Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జూలై చివరినుంచే గోదావరి జలాల ఎత్తిపోత

-ఆరునెలలు నిర్విరామంగా నీటిని లిఫ్ట్ చేయాలి
-అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలి
-అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
-ఈ ఏడాది రోజుకు రెండు టీఎంసీల చొప్పున..
-వచ్చే ఏడాదినుంచి మూడు టీఎంసీలకు పెంచాలి
-ఏటా గరిష్ఠంగా 600 టీఎంసీలను తరలించాలి
-గోదావరిలో మన వాటా సంపూర్ణంగా వాడాలి
-45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీళ్లు
-లిఫ్టుల వద్ద జలవిద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం
-అవగాహన లేకే కాళేశ్వరంపై అపోహలు
-అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
-రేపు, ఎల్లుండి రామగుండం, కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ పర్యటన

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ జూలై చివరినుంచే గోదావరి జలాలను ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పారు. నీటి ప్రవాహం ఉండే ఆరునెలల్లో రోజుకు 24 గంటలపాటు నిర్విరామంగా నీటిని ఎత్తిపోయాలని అన్నారు. మొత్తంగా ఏటా దాదాపు 540 టీఎంసీల నుంచి 600 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోయాలని, 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వాలని చెప్పారు.

ఈ ఏడాది రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టుచేయాలని, వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీలకు పెంచాలని అన్నారు. ఈ ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వెల్లడించారు. ఈ ఏడాది రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3,800 మెగావాట్లు, వచ్చే ఏడాది వానకాలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యు త్ అవసరమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సమాయత్తం కావాలన్నారు. వచ్చే నెల పదోతేదీలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల పంపుహౌస్‌ల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెల 18, 19 తేదీల్లో రామగుండం, కాళేశ్వరంలో పర్యటించి, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటును, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా విషయంపై గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజె క్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంపుల ట్రయల్ రన్లు కూడా విజయవంతమయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయాలి. ఇందుకు 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. గోదావరిలో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటి లభ్యత కూడా మేడిగడ్డ వద్దే ఉన్నది. కాబ ట్టి మేడిగడ్డ నుంచి మరో టీఎంసీని కూడా ఎత్తిపోయాలి. వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టుచేస్తాం. ఇందుకు 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుంది. గోదావరిలో నీటిప్రవాహం ఉండే జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుంది. జూన్, నవంబర్ మాసాల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున, జూలై నుంచి అక్టోబర్ వరకు నెలకు మూడు టీఎంసీల చొప్పున నీరు లిఫ్టు చేయవచ్చు. డిసెంబర్‌లో కూడా ఒక లిఫ్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చు? దీనికి ఎంత కరంటు అవసరం పడుతుందో శాస్త్రీయంగా అంచనావేయాలి. ఈ సమయం లో సరిపడినంత విద్యుత్ సరఫరాకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు.

సాగు, తాగునీటికి, పరిశ్రమల అవసరాలకు కాళేశ్వరం నీళ్లు
85% తెలంగాణ భూభాగంలో వ్యవసాయానికి, తాగు అవసరాలకు, పరిశ్రమలకు అవసరమైన నీటిని గోదావరి నుంచే తీసుకోవాలి. గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. ఈ నీటిని వాడుకోవడానికి అన్నిరకాల అనుమతులున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నాం. 44 ఏండ్ల సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉన్నది. కాబట్టి గోదావరిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో నీటిని లిఫ్టు చేయాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌మానేరుకు ఈ ఏడాది రెం డు టీఎంసీలు లిఫ్టు చేయాలి. రివర్స్ పంపింగ్ ద్వారా ఒక టీఎంసీని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మల్లన్నసాగర్‌కు తరలించాలి. వచ్చే ఏడాది ఎల్లంపల్లికి మూడు టీఎంసీలు, కొండపోచమ్మసాగర్‌కు రెండు టీఎంసీల నీటిని తరలించి, రిజర్వాయర్లను, చెరువులను నింపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకే కాకుండా, ఎస్సారెస్పీ ఆయకట్టుకు, గుత్ప-అలీసాగర్ పథకాలకు, నిర్మల్- ముథోల్ నియోజకవర్గాలకు, గౌరవల్లి ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గానికి నీరివ్వాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఏడాదికి రెండు పంటలకు నీరందించాలి. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.

రెండేండ్లలోనే ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సమానమైన పంట
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిర్వహణ భారంపై కొందరు వెలిబుచ్చే అభిప్రాయాలు అవగాహనరాహిత్యంతో కూడుకున్నవి. ఒక్కో ప్రాంతానికి అక్కడున్న పరిస్థితులను బట్టి వేర్వేరు ప్రాధాన్యాలుంటాయి. గల్ఫ్ దేశాల్లో మంచినీళ్లు దొరకవు. అక్కడి ప్రభుత్వాలు మంచినీళ్ల కోసమే ఎక్కువ వ్యయం చేస్తాయి. లాస్‌వెగాస్ ప్రాంతానికి మంచినీళ్లు అందివ్వడానికి అమెరికా ప్రభుత్వం 600 కిలోమీటర్ల దూరం నీళ్లను పంప్ చేస్తున్నది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు ఇవ్వడం ప్రాధాన్య అంశం. రైతులను బతికించడానికి, వ్యవసాయం సాగడానికి సాగునీటి కోసం ఖర్చుచేస్తాం. ఒక్కసారి కాళేశ్వరం పూర్తయితే జనం బతికిపోతారు. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి పెట్టిన ఖర్చుకు సమానమైన పంట ఏడాది రెండేండ్లలోనే పండుతుంది. రైతుల జీవితాలు మారుతాయి. తెలంగాణ వాతావరణం మారుతుంది అని ముఖ్యమంత్రి వివరించారు.

17వేల మెగావాట్లకు సిద్ధం: ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
ఇతర రంగాలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరాచేస్తూనే, కాళేశ్వరంతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను నిరాటంకంగా సరఫరాచేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వివరించారు. సమీక్షలో భాగంగా రాష్ట్ర విద్యుత్ పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 11వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ వచ్చినప్పటికీ విద్యుత్ కోతలు లేకుండా సరఫరాచేశామని ప్రభాకర్ రావు వెల్లడించారు. ఎత్తిపోతల పథకాలకు మరో ఆరువేల మెగావాట్లు అవసరమైనా సమకూరుస్తామన్నారు. మొత్తం రాష్ట్ర డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరినా, విద్యుత్ సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి అవసరమైన ప్రణాళిక సిద్ధంచేసినట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 16,203 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉందని తెలిపారు.

ఈ ఏడాది చివరినాటికి 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, కొద్దినెలల్లోనే ఎన్టీపీసీ ప్లాంటు ద్వారా 1600 మెగావాట్లు అందుతుందని వివరించారు. 4,000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ప్లాంటు పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 28వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా, వందకు వంద శాతం పంపిణీ చేయడానికి అనువైన వ్యవస్థను ట్రాన్స్‌కో సిద్ధంచేసిందని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్‌కో-ట్రాన్స్‌కో డైరెక్టర్లు సూర్యప్రకాశ్, వెంకట్రాజం, జగత్‌రెడ్డి, అజయ్ పాల్గొన్నారు.

ఎత్తిపోతల పథకాలకు అయ్యే విద్యుత్‌కు ప్రభుత్వ గ్రాంట్స్
దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నిర్వహణకు మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎత్తిపోతల పథకాల పంపుసెట్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చాలని, దీనికయ్యే ఖర్చుకోసం రైతుల ఉచిత విద్యుత్ సబ్సిడీ మాదిరిగా ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు ప్రత్యేక గ్రాంటు ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఎత్తిపోతల పథకాల కోసం నిర్మించిన సబ్‌స్టేషన్లు, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థల నిర్వహణ బాధ్యతను విద్యుత్ సంస్థలే చేపట్టాలని సీఎం చెప్పారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నదన్న సీఎం.. ఎక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చో శాస్త్రీయంగా సర్వే చేయించాలని ఆదేశించారు.

విద్యుత్ పనులు వేగంగా చేశారు
-విద్యుత్ సంస్థలకు సీఎం అభినందన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి కావల్సిన వ్యవస్థలను శరవేగంగా పూర్తిచేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థలను అభినందించారు. విధించిన గడువుకన్నా ముందే పనులు పూర్తిచేశారని అన్నారు. సహజంగా ఇంత త్వరగా పనులు పూర్తికావని చెప్పారు. ఇదే స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన అదనపు ఏర్పాట్లు కూడా వేగంగా పూర్తిచేయాలని సీఎం చెప్పారు. 18, 19 తేదీల్లో రామగుండం, కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ పర్యటన ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం (ఈ నెల 18న) రామగుండంలో, ఆదివారం (19న) కాళేశ్వరంలో పర్యటిస్తారు. 18న రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్‌ప్లాంటును సందర్శిస్తారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 19న ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పనులు పరిశీలిస్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.