సర్కారు దవాఖానల్లో గర్భిణులకు గౌరవంగా 15వేల నజరానా
వందశాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన దిశానిర్దేశం మేరకు వైద్యారోగ్యశాఖ వడివడిగా అడుగులు వేస్తున్నది. గర్భిణులకు గౌరవం దక్కేలా, ప్రసవాలన్నీ సర్కార్ దవాఖానలో జరిపించి మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. అంతే కాకుండా తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ను అందజేయాలని భావిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో పర్యటించి అక్కడి వైద్యవిధానాలపై లోతైన అధ్యయనం చేసిన అధికార యంత్రాంగం.. అక్కడ అమలవుతున్న విధానం కన్నా మెరుగైన పథకాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి సోమవారం వెంగళరావునగర్లోని ఐఐపీహెచ్లో జరిగిన వైద్యాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. తమిళనాడులో గర్భిణులకు ముత్తులక్ష్మీరెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీంలో రూ.12 వేలు ఇస్తుండగా, మన రాష్ట్రంలోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని, మరో మూడు వేలు అదనంగా జోడించి రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
గర్భిణులు మూడోనెల నుంచి ప్రసవం వరకు పరీక్షలు చేయించుకోవడం పూర్తికాగానే తొలివిడతగా రూ.5వేలు, ప్రసవం పూర్తికాగానే మరో విడతగా రూ.5 వేలు, ఆ తర్వాత బేబీ ఇమ్యూనైజేషన్ (పూర్తి స్థాయిలో టీకాలు)కు రూ. 5వేలు చొప్పున మొత్తంగా రూ. 15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఎంత ఖర్చవుతుందో బడ్జెట్ రూపొందించాలని మంత్రి లకా్ష్మరెడ్డి అధికారులను ఆదేశించారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు పనులు చేసుకునే వీలుండదు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యవర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగి, తల్లీబిడ్డలు క్షేమంగా ఇంటికి చేరేలా అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రసవాలు చేసిన డాక్టర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు.

కేసీఆర్ కిట్లో 30 వస్తువులు తమిళనాడులో అమ్మకిట్ పేరుతో నవజాత శిశువులకు కావాల్సిన మొత్తం 16 వస్తువులను అందజేస్తున్నారు. ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచి రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు, అదనంగా తల్లికి కూడా మూడు నెలలకు అవసరమైన వస్తువులను కిట్ రూపంలో ఇవ్వాలని భావిస్తున్నది. దీనికి కేసీఆర్ కిట్ అని పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. ఈ కిట్ల అమలుకు ఎంతఖర్చవుతుందో బడ్జెట్ రూపొందించాలని సమీక్షలో మంత్రి లకా్ష్మరెడ్డి అధికారులను ఆదేశించారు. బేబీకిట్లో బేబీ ఆయిల్, బేబీ పౌడర్, మస్కిటో కిట్, చిన్న బెడ్తో పాటు నవజాత శిశువులకు అవసరమయ్యే దాదాపు 30 వరకు వస్తువులుండేలా చర్యలు తీసుకుంటున్నారు. తల్లికి ఇచ్చే కిట్లో బాలింతలకు అవసరమయ్యే వివిధ వస్తువులు అందించాలని భావిస్తున్నారు. ఈ రెండింటినీ కేసీఆర్ కిట్ పేరుతో అందించనున్నారు.
జిల్లా కేంద్రాల్లో 20 ఐసీయూలు రాష్ట్రవ్యాప్తంగా 20 ఐసీయూలు ఏర్పాటు చేయాలని సమావేశంలో మంత్రి నిర్ణయించారు. జిల్లా కేంద్రా ల్లోని దవాఖానాలో ఐసీయూలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్నగర్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూలు ఉండగా, మరో 17 కొత్తవి ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు.
అవసరమైన పోస్టులన్నీ భర్తీ ఇప్పటివరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తున్నది. 2,118 వైద్యులు, సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది తదితర పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వైద్యసేవల కోసం ఏయే పోస్టులు కొత్తగా అవసరమో గుర్తించిన ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. దాదాపు మరో మూడు వేల పోస్టుల వరకు అవసరం ఉంటుందని వైద్యారోగ్యశాఖ అంచనాకు వచ్చింది. వీటికి సంబంధించి సీఎం కేసీఆర్ ఆమోదం ఇవ్వగానే వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాల్సి ఉందని మంత్రి అధికారులకు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి గిరిజన ప్రాంతాలకు పరిమితమైన అమ్మ ఒడి వాహన సేవలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని అధికారులకు మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. దీనికోసం ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కావాల్సిన సిబ్బంది? ఖర్చు తదితర అంశాలన్నీ నివేదించాలని సూచించారు.