ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ విదేశాల మన్ననలు పొందే విధంగా తయారు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర పోలీసులకు హితవు పలికారు.

మంగళవారంనాడాయన సచివాలయంలో రాష్ట్ర పోలీసు కొత్త లోగో ఆవిష్కరించారు. ఇంతకు ముందే తెలంగాణ రాష్ట్ర పోలీసు కొత్త లోగోను ఖరారు చేస్తూ ప్రభుత్వం జి.వో జారీ చేసింది. తెలంగాణ స్టేట్ పోలీసు కొత్తలోగో రూపకల్పనకు ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ ఎంతో కృషి చేశారని సీఎం ప్రశంసించారు. లోగో తయారీలో హైదరాబాద్ స్టాఫ్ ఆడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కూడా సహకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. లోగో రూపశిల్పి. చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సన్మానించారు.