ప్రభుత్వం రైతు సంక్షేమానికి నిరంతర ప్రయత్నం చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని మునిపల్లి, రాయికోడ్, వట్పల్లి, అందొల్, పుల్కల్, చట కూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాయికోడ్ గ్రామంలో ‘వరం’ (రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం) కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వరం పరిధిలో కొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

వరం ద్వారా అమ్మడమే కాకుండా కొనుగోళ్లు జరగడం అభినందనీయమన్నారు. పెసలు, కందులు, శనగలు, మినుములు లాంటివి నేరుగా అమ్మకుండా పప్పుగా మార్చాలని, అందుకు అవసరమైన దాల్ మిల్లును ఏర్పాటు చేసుకుని సమిష్టిగా కష్టపడితే తక్కువ ధరకే వినియోగదారులకు పప్పులు అందించడంతోపాటు రైతులు లాభపడే అవకాశం ఉందన్నారు. వరంకు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కాలేశ్వరం నీటిని అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
ఒక్కొక్క మెట్టుగా అభివృద్ధి పథంలోకి వెళ్లేలా రైతుల ఆలోచనలు ఉండాలన్నారు. ఆ దిశగా రైతులు ముందుకు కదలాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో, వసతి గృహాలలో కొనుగోలు చేస్తున్న పప్పులు, కూరగాయలు, పండ్లు, తదితరాలను వరం నుంచి కొనుగోలు చేసేలా చూస్తామనారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు వరం ఆదర్శంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరిదుద్దిన్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాకార్షి షా, పాల్గొన్నారు.