-సంక్షేమంలో మనమే నంబర్వన్
-పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం
-డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో ఉచిత పరీక్ష
-పర్యాటక కేంద్రాలుగా రామప్ప గుట్టలు
-లాభదాయక పంటలపై అవగాహన
-ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ పేరిట రోగ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేసి 56 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలుస్తున్నది. కార్మిక, ధార్మిక క్షేత్రాలు సిరిసిల్ల, వేములవాడను జంటనగరాలుగా తీర్చిదిద్దుతాం. మధ్యమానేరు బ్యాక్వాటర్లోని నారపల్లి- రామప్పగుట్టలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయనున్నాం.
-మంత్రి కేటీఆర్
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3.9 లక్షల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకుపోతున్నదని తెలిపారు. సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయాచోట్ల మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలందరికీ తెల్లరేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రోగ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని, ఇందులో 56 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని చెప్పారు. వచ్చే రోజుల్లో కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడలను జంటనగరాలుగా, మధ్యమానేరు బ్యాక్వాటర్లోని నారపల్లి- రామప్ప గుట్టలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆయిల్పాం వంటి లాభాదాయక పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కోనరావుపేట మండలం మల్కపేట గుట్టల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రిజర్వాయర్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తవగానే మరోసారి ముఖ్యమంత్రిని జిల్లాకు అహ్వానిస్తామని చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్తో మెరుగైన ఉద్యోగాలు
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు ద్వారా స్థానికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. అందుకు జిల్లాలో విరివిగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పల్లెప్రగతిలో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొన్నామని, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి చేసినట్లు చెప్పారు. పల్లెల తరహాలో పట్టణాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి తదితరులు పాల్గొన్నారు.
అవ్వా.. ఏంకావాలె.. నేనున్నా ..!
అవ్వా.. ఏంకావాలె.. నేనున్నా.. అంటూ నర్సింహులపల్లెకు చెందిన వృద్ధురాలు బొంగరం లక్ష్మికి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. కరోనాతో మృతిచెందిన తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లె గ్రామశాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, తిరిగి వెళ్తున్న సమయంలో ఆమె మంత్రి కేటీఆర్ వద్దకు వచ్చి కన్నీళ్లతో దండం పెట్టింది. వెంటనే చలించిన మంత్రి..‘అవ్వా ఏం కావాలె.. నేనున్నా’ అంటూ ఆప్యాయంగా భుజంపై చేయివేస్తూ సమస్య తెలుసుకున్నారు. తన భర్త నర్సింహారెడ్డి కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో ఉన్నారని, కిడ్నీలు కరాబయ్యాయని, ఆదుకోవాలని వేడుకున్నది. ‘సరే నేను చూసుకుంటూ.. నువ్వు బాధపడకు..’ అని హామీఇచ్చారు. వెంటనే అక్కడేఉన్న పీఏను పిలిచి, సదరు దవాఖాన యాజమాన్యంతో మాట్లాడి, మెరుగైన వైద్యం చేయాలని, బిల్లు తామే కడుతామని చెప్పమని సూచించారు.