-తెలంగాణను గోసపెట్టింది ఆ రెండు పార్టీలే -కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాల భర్తీ -మోదీ చెప్పిన 12 కోట్ల ఉద్యోగాలెక్కడ? -కాంగ్రెస్, బీజేపీలపై బాల్క సుమన్ నిప్పులు -హస్తం, కమలం పార్టీలవి గాలి మాటలు: ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు -త్యాగధనులకు తెలంగాణలో సమున్నత గౌరవం

పార్టీలకు అతీతంగా తెలంగాణ త్యాగధనులను సీఎం కేసీఆర్ గౌరవించుకునే సంస్కృతిని కొనసాగిస్తుంటే.. గుజరాత్లోని సర్దార్ పటేల్ స్టేడియానికి మోదీ పేరు పెట్టుకున్న కొత్త సంస్కృతికి బీజేపీ నేతలు బాటలు వేశారని బాల్కసుమన్ మండిపడ్డారు. ప్రజాకవి కాళోజీ, కొండా లక్ష్మణ్బాపూజీ, ఆచార్య జయశంకర్ వంటి తెలంగాణ వైతాళికుల పేర్లను యూనివర్సిటీలకు పెట్టడమే కాకుండా.. తెలంగాణ ముద్దుబిడ్డ కాకా (వెంకటస్వామి) విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నెలకొల్పామని గుర్తుచేశారు. పీవీ శతజయంతి ఉత్సవాలను గొప్పగా సాగుతున్నాయని తెలిపారు.
ఆది నుంచి తెలంగాణకు అడగడుగునా అన్యాయం చేయటంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు. కాంగ్రెస్ది అవినీతి డీఎన్ఏ అయితే.. బీజేపీది అబద్దాల డీఎన్ఏ అని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ రాష్త్ట్ర నాయకులు రావుల శ్రీధర్రెడ్డి తదితరులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలోని వివిధ శాఖల్లో భర్తీచేసిన 1,32,899 ఉద్యోగాల జాబితాను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకమారావు స్పష్టంగా వెల్లడించినా కాంగ్రెస్, బీజేపీలు వాస్తవాలను అంగీకరించకుండా నీచంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేటీఆర్ ప్రకటించిన జాబితాను శాఖలవారీగా సరిచూసుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని ఉద్యోగాలను భర్తీచేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బాల్క సుమన్ అన్నారు. సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగానే 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన దమ్మున్న పాలన తమదని బాల్క సుమన్ పేర్కొన్నారు.
దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయండి బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న తెలంగాణ జోనల్ వ్యవస్థ సమస్యను పరిష్కరించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటన్నా ఎందుకివ్వలేదని కేంద్రాన్ని నిలదీసే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రిజర్వేషన్ల పెంపు, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు, లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్, మిషన్భగీరథ, మిషన్ కాకతీయకు నిధుల కేటాయింపుపై కేంద్రంపై కొట్లాడి సాధించుకురావాలని ఆయన డిమాండ్చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ నేతలను బాల్క సుమన్ ప్రశ్నించారు. ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు కల్పించారా అని నిలదీశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచటమే కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వరంగ సంస్థలను బాజాప్తా అమ్ముతామని స్వయంగా ప్రధానే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే అనేక సంస్థలను అప్పనంగా అమ్మకానికి పెట్టిందని.. మరికొన్ని సంస్థలను నిర్వహించలేమని చేతులెత్తేసిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే తెలంగాణలోనే ఉద్యోగ కల్పన అధికంగా ఉన్నదనటానికి టీఎస్పీఎస్సీ భర్తీచేసిన ఉద్యోగాలే నిదర్శనమని చెప్పారు
కాంగ్రెస్, బీజేపీలవి గాలి మాటలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా గాలివార్తలు ప్రచారంచేయటంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీలు పడుతున్నారని ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. బండి సంజయ్, అర్వింద్కు అసత్యాలు మాట్లాడం ఫ్యాషన్గా మారిందని మండిపడ్డారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడే మాటలను వాళ్ల ఇండ్లల్లో కూడా ఈసడించుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టభద్రుల ఓట్లు అడిగే నైతిక హక్కులేదని టీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అబద్ధాలకు చరమగీతం పాడాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
బండి సంజయ్ తెలంగాణ వ్యక్తేనా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బాల్కసుమన్ విమర్శించారు. బండి సంజయ్ తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి ఉత్తరాలు రాశారని, అసలు ఆయన తెలంగాణవాడేనా అన్న అనుమానం కలుగుతున్నదని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసి హంద్రీనీవాకు హారతులిచ్చిన డీకే అరుణ.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలుచేయటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధిచెప్పాలని పట్టభద్రులకు విజ్ఞప్తిచేశారు.