-ఓట్లు డబ్బాలో పడగానే పత్తాలేకుండాపోతరు -కాంగ్రెస్, టీడీపీల చీకటి ఒప్పందాలు -సిద్దిపేట యాదవుల ఆత్మీయ బహిరంగసభలో మంత్రి హరీశ్రావు -ఆలీబాబా 40 దొంగల్లాగా మహాకూటమి: మంత్రి తలసాని
ఓట్లు వచ్చాయంటే కాంగ్రెసోళ్లు ఊళ్లోకి వస్తరని, పోలింగ్ అయిపోగానే పత్తాలేకుండాపోతరని నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ను ఓడించే దమ్ములేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుని కూటమిగా వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో వస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలో అఖిల భారత యాదవ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీహరియాదవ్ అధ్యక్షతన యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సభలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, మండలి చీఫ్విప్ పాతూరి సుధాకర్రెడ్డి, గొర్రెల ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ బాటపడితే.. టీడీపీ నేతలు అమరావతి బాట పట్టారని, టీఆర్ఎస్ నాయకులు మాత్రం జనం మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకోల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. కాంగ్రెస్ నేతలకు కుర్చీల కోసం కొట్లాడుకోవడమే సరిపోతుందని, వారు ప్రజల సమస్యల గురించి ఎప్పుడూ పట్టించుకోరని విమర్శించారు. నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియనోళ్లు ఇవ్వాళ ఓట్ల కోసం వస్తున్నారని, అలాంటి నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని కేసీఆర్ చెప్పిండు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని సీఎం కేసీఆర్ మాకు నేర్పించిండు. ఎదిగిన కొద్దీ మంచి వినయంగా ఉండాలని, కష్టపడాలని పేదలకు సహాయం చేయాలని చెప్పిండు. అం దుకే మీ బిడ్డగా మీరు నాకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నిరంతరం మీ సేవలో ఉంటా అని మంత్రి హరీశ్రావు చెప్పారు. కొమురవెల్లి మల్లన్న, బీరప్పల ఆశీర్వాదంతో తనకిచ్చిన శక్తినంతా ప్రజాసేవకోసమే వినియోగిస్తానన్నారు. సిద్దిపేటలో గెలుపు పక్కా అయింది. భారీ మెజార్టీతో గెలిస్తే సిద్దిపేట గౌరవం ఇంకా పెరుగుతుంది. సీఎం కేసీఆర్ సార్కు బహుమతిగా ఇద్దాం అని చెప్పారు. యాదవుల సంక్షేమం కోసం అన్ని గ్రామాల్లో సామాజిక భవనాలు నిర్మించామని, భవిష్యత్తులో రాజకీయంగా ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
దొంగలంతా ఒక్కటయ్యారు: తలసాని

ఎన్నికలు రాగానే దొంగలంతా ఒక్కటయ్యారని, ఆలీబాబా 40 దొంగల్లాగా కూటమిగా ఏర్పడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవాచేశారు. గడ్డాలు, మీసాలు పెంచుకుంటే ఎమ్యెల్యేలు కారని, ప్రజలకు సేవచేసే వారినే గుర్తించి ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాకే యాదవులకు స్వాతంత్య్రం వచ్చిందని, రాష్ట్రంలో గుర్తింపు లభించిందని తెలిపారు. జనంలో ఆదరణ లేక ఓడిపోతామనే భయం తో హరీశ్రావుపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. యాదవుల ఇష్టదైవమైన కొమురవెల్లి ఆలయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. యాదవులు సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి భారీర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, యాదవసంఘం రాష్ట్ర నాయకులు రమేశ్, జిల్లా అధ్యక్షుడు ఐలయ్యయాదవ్ పాల్గొన్నారు.
కూటమి గెలిస్తే ప్రాజెక్టులు పూర్తికానిస్తుందా? -నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు -టీఆర్ఎస్లో చేరిన 300 మంది షాద్నగర్ టీడీపీ నాయకులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ భాగస్వామిగా ఉన్న కూటమి గెలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కానివ్వరని అని నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. గురువారం తెలంగాణభవన్లో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కడెంపల్లి సదానందంగౌడ్, కొడిచర్ల మాజీ సర్పంచ్ బాల్రెడ్డి, తెలుగు యువత మండలాధ్యక్షుడు ఎర్రవెళ్లి వేణుగోపాల్చారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జోగు బాలరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు మక్తగూడెం బాలయ్యతోపాటు, 300 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం తెలంగాణభవన్లో హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఏపీ సీఎం చం ద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాలంటూ కేంద్రానికి అనేకలేఖలు రాశారని, కూటమి అధికారంలోకి వస్తే వాటిని నిజంగానే నిలిపివేయిస్తారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మహబూబ్నగర్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలోనే 6.50 లక్షల ఎకరాలకు సాగునీందించిందన్నారు. వలసలు వాపస్ వస్తున్నాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే షాద్నగర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందుతుందని అన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం గా చంద్రబాబు రాసిన లేఖలను పుస్తక రూపంలో తీసుకొస్తామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. వచ్చే 30 రోజులు టీఆర్ఎస్ కోసం పనిచేస్తే వచ్చే ఐదేండ్లు మీ కోసం పనిచేస్తామని హరీశ్రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.