-హైదరాబాద్ -శివారు జిల్లాల్లో నిర్వహణ -పరీక్షలకు 30 నియోజకవర్గాలు ఎంపిక -భాగ్యనగరాన్ని కాపాడుకొనేందుకే నిర్ణయం -ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు -ఎందరికి పాజిటివ్ వచ్చినా ఏర్పాట్లు సిద్ధం -ఇతర రాష్ర్టాలతో పోలిస్తే వ్యాప్తి తక్కువే -రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉన్నది -ప్రైవేటులోనూ కరోనా పరీక్షలకు అనుమతి -త్వరలో ధరలు, నిబంధనలు ఖరారు -వ్యాధి లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స -అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్

‘రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినా.. చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొంటున్నాం. చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉన్నది’
కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని వారు చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
‘హైదరాబాద్ తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరుప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాలి. వచ్చే వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరుగకుండా ముందుజాగ్రత్త చర్యగా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మలక్పేట్, అంబర్పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేలమందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ దవాఖానలనే కాకుండా, ప్రైవేటు ల్యాబొరేటరీలు, దవాఖానలను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగాలేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి (హోం ట్రీట్మెంట్)’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘హైదరాబాద్ను కాపాడుకోవాలనే ముందుచూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళనపడాల్సిన అవసరంలేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్రమైన జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉన్నది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉన్నది’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
కరోనాపై నేడు మంత్రి ఈటల సమీక్ష కరోనా పరిస్థితులపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. బీఆర్కే భవన్లో ఉదయం పది గంటలకు కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్తో సహా 30 నియోజకవర్గాల్లో 50వేల పరీక్షలు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: ఎంపీ అసద్ కరోనా కట్టడిలో భాగంగా భారీఎత్తున పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. ఇది ప్రజల్లో భయాన్ని తొలగిస్తుందన్నారు. ప్రైవేటు దవాఖానల్లో పరీక్షలు చేయడానికి సంబంధించి ప్రభుత్వం పకడ్బందీగా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.
‘ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నది. మరణాల రేటు తక్కువగానూ, కోలుకొంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి’.