తెలంగాణ ఆవిర్భావానికి ముందు జిల్లాల సగటు విస్తీర్ణం 11,430 చదరపు కిలోమీటర్లు. కొత్త జిల్లాల్లో అది 3400 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది. పరిపాలనకు కొత్త ఊపు వచ్చింది. ఇరిగేషన్ సహా ప్రధాన రంగాల అభివృద్ధి పనులను చాలా సూక్ష్మస్థాయిలో మానిటర్ చేయడం సాధ్యపడింది. ఉన్నతస్థాయి అధికారులు దృష్టిని కేంద్రీకరించగలిగినప్పుడు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడం ఖాయం. తెలంగాణలో కూడా అదే జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఇచ్చే నవోదయ విద్యాసంస్థలను తెచ్చుకోవలసి ఉన్నది. తెలంగాణలో 9 నవోదయ విద్యా సంస్థలున్నాయి. మరో 23 నవోదయ విద్యాసంస్థలు కొత్త జిల్లా కేంద్రాలకు రావాలి. ఇవేకాకుండా కేంద్రం ప్రతి జిల్లాకు ఇచ్చే ప్రతిదాన్ని రావాల్సిన వాటిని పోరాడి సాధించుకోవాలి.
అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ఏవో కొన్ని పాలనాపరమైన సంస్కరణలు చేపట్టడం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పరిపాటిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఆ సంస్కరణలు ఆశించిన ఫలితాలు ఇచ్చాయా? లేదా? అన్న పరిశీలన క్షేత్ర స్థాయిలో ఎప్పుడూ జరుగలేదు. అలా జరిగి ఉన్నట్టయితే మన దేశ, రాష్ట్ర పరిస్థితులు ఇప్పుడున్న వాటికంటే భిన్నంగా ఉండేవి. సరే గత జల సేతు బంధనం గురించి పక్కన పెట్టి ప్రస్తుతానికి వద్దాం.
తెలంగాణరాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత 2001-02 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని కేసీఆర్ తలంచారు. రాష్ర్టాభివృద్ధికి, పాలనాసంస్కరణలకు కొత్త జిల్లాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన నాడే దార్శనికతతో ఆలోచించారు. ఆయన ఆలోచనల ధారల్లోనే కొత్త జిల్లాల ఎజెండా ఉద్యమంలో ముందుకు వచ్చింది. దాన్ని అనుసరించి 2008లోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ ఆలోచనలను నేను ఓ వ్యాసంలో పంచుకున్నాను. తెలంగాణలో 2016 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అతిపెద్ద పాలనా సంస్కరణ తీసుకొచ్చింది. చిన్న రాష్ర్టాలు అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్న తాత్త్విక దృక్పథంలో ఉన్న తెరాస ప్రభుత్వం ఆ తాత్త్వికతను చిన్న జిల్లాల వైపు కూడా మళ్లించింది. తెలంగాణ ఏర్పడటానికి ముందు ఉన్న 10 జిల్లాలను విభజించి మొత్తం 33 జిల్లాలు సృష్టించింది. ఈ విభజన రాష్ర్టానికి ఎంతో మేలు చేసిందని, పలుశాఖల పనితీరు ద్వారా తెలుస్తుంది. అది ఈ విపత్కాలంలో కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించటంలో కట్టడి చేయటంలో, వ్యవసాయరంగాన్ని సంస్కరించుకోవటంలో, పలుశాఖల పనితీరును అంచనా వేయటంలో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆచరణ ద్వారా రుజువవుతున్నది.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు జిల్లాల సగటు విస్తీర్ణం 11,430 చదరపు కిలోమీటర్లు. కొత్త జిల్లాల్లో అది 3400 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది. పరిపాలనకు కొత్త ఊపు వచ్చింది. ఇరిగేషన్ సహా ప్రధాన రంగాల అభివృద్ధి పనులను చాలా సూక్ష్మస్థాయిలో మానిటర్ చేయడం సాధ్యపడింది. ఉన్నతస్థాయి అధికారులు దృష్టిని కేంద్రీకరించగలిగినప్పుడు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడం ఖాయం. తెలంగాణలో కూడా అదే జరిగింది.
కొవిడ్-19 సమయంలో ఈ చిన్న జిల్లాల ఉన్నతాధికారులు కరోనా నియంత్రణపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టడంతో గ్రామీణ తెలంగాణలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. 2,750 చదరపు కిలోమీటర్ల సగటు విస్తీర్ణంతో ఉన్న 14 జిల్లాల కేరళ రాష్ట్రం మాత్రమే కరోనా వ్యాప్తి నిషేధం విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నది.
తెలంగాణలోని నల్లగొండ జిల్లాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలుగా విభజించారు. ఈ మూడు జిల్లాల మొత్తం విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా విస్తీర్ణంతో సమానం. మూడు జిల్లాలను ముగ్గురు కలెక్టర్లు మైక్రో లెవెల్లో పరిశీలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈ సంఖ్యా చాలా తక్కువ. కానీ చిత్తూరు జిల్లాలో కేసులు దేశంలోనే ఎక్కువ. కంటైన్మెంట్ జోన్ అనే కాన్సెప్ట్ను మొదటగా ఆచరణలోకి తీసుకుని వచ్చింది కరీంనగర్ జిల్లా కాగా ఇవాళ ఆ నూతన పరికల్పనను దేశం అంతా అమలుపరుస్తున్నది.
ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞత వైపు దేశం చూస్తున్నది. కేసీఆర్ పరిపాలన సంస్కరణలను మిగతా దేశం ఆచరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ నియోజకవర్గం స్థాయిలో జిల్ల్లాలను విభజించాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నదది. అక్కడి 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం 1000 జిల్లాలు సృష్టించాలని రాష్ట్రాలకు సూచిస్తున్నది. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న కేసీఆర్ మాట ఇవాళ దేశవ్యాప్తంగా కొత్త అభివృద్ధి నమూనాగా విస్తరిస్తున్నది.
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం పాలన ప్రజల గడపల దాకా వెళ్లింది. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు పట్టుసాధించారు. ప్రధానంగా ప్రజలకు జిల్లా కేంద్రాల వద్దకు పోవడం సులభమైంది. ఎల్కతుర్తి మండలం హన్మకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకుముందు ఎల్కతుర్తి మండల ప్రజల జిల్లా కేంద్రం 70 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్. అలాంటప్పుడు పాలన ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావించలేం. నూతన జిల్లాల ఏర్పాటువల్ల జిల్లా పాలన కలెక్టర్లకు అందుబాటులోకి వచ్చింది. అది ఎంత అందుబాటులోకి వచ్చిందంటే కలెక్టర్లు తలచుకుంటే ఒకే రోజులో జిల్లా మొత్తాన్ని చుట్టేయవచ్చు. ఏ మారుమూల జరిగిన చిన్న సంఘటనైనా అందరి దృష్టికి రాగలుగుతున్నది. శాంతిభద్రతల పరిస్థితి నియంత్రణలో ఉంది.
జిల్లా వ్యవసాయాధికారులు జిల్లాలో రైతులు ఏ పంటలు వేశారు? అవి ఏ విధంగా ఉన్నాయి తదితర వివరాలను సూక్ష్మస్థాయిలో తెలుసుకోగలుగుతున్నారు. రాబోయే వ్యవసాయ సంవత్సరానికి ఏయే పంటలు వేయాలో ప్రణాళికలు తయారుచేయడానికి చిన్న జిల్లాలు చాలా దోహదపడుతున్నాయి. దీనిపైన ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి సమావేశపరిచి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వచ్చే ఏడాది పంటల తీరుతెన్నులపై ఒక సమగ్రమైన అవగాహనకు అవకాశం కలిగింది. జిల్లా విద్యారంగం తీరుతెన్నులు ఎప్పటికప్పుడు పరిశీలించి అంచనావేసే వెసులుబాటు డీఈవోలకు కలుగుతున్నది. కీలక సందర్భాలలో జిల్లాలోని అందరు హెడ్మాస్టర్లను ఒక్క గంట సమయంలో ఆకస్మికంగా జిల్లా కేంద్రాలకు పిలిపించుకుని చర్చించే అవకాశం దొరికింది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు (డీఎంహెచ్వో) జిల్లాలోని వైద్యరంగానికి సంబంధించి ప్రతిరోజూ రివ్యూ చేసే అవకాశం వచ్చింది. దీనివల్లనే ఇటీవల తల్లుల ప్రసవాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడగలుగుతున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యం సంరక్షించగలుగుతున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై పట్టు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ను వైద్యరంగం, పోలీసు వ్యవస్థ, జిల్లా పాలనాయంత్రాంగం సంయుక్తంగా కలిసి నియంత్రించగలుగుతున్నాయి. ఇంత క్లిష్టపరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటితమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఇచ్చే నవోదయ విద్యాసంస్థలను తెచ్చుకోవలసి ఉన్నది. తెలంగాణలో 9 నవోదయ విద్యాసంస్థలున్నాయి. మరో 23 నవోదయ విద్యాసంస్థలు కొత్త జిల్లా కేంద్రాలకు రావాలి. ఇవేకాకుండా కేంద్రం ప్రతి జిల్లాకు ఇచ్చే ప్రతిదాన్ని రావాల్సిన వాటిని పోరాడి సాధించుకోవాలి.
రాష్ట్రంలో రెవెన్యూ, పోలీసు సంస్కరణలు జరుగవలసి ఉన్నది. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు మేధోమథన సమావేశాలు నిర్వహించారు. ఇంకా న్యాయపరిపాలనా సంస్కరణలు జరుగాలి. ప్రతి జిల్లాకు జిల్లా కోర్టు రావాలి. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందిస్తే రాష్ట్రంలో కొత్త న్యాయపరిపాలనా వ్యవస్థ ఏర్పాటు జరుగుతుంది. జిల్లా కేంద్రాలు దగ్గర కావడం వల్ల ప్రజలకు అనేక సమస్యలు తీరుతాయి. కొత్త జిల్లాలు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.
(వ్యాసకర్త: రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు) బోయినపల్లి వినోద్ కుమార్