రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టింది.. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపట్టి అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో హరితహారంలో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ప్రారంభించారు. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
-ఆత్మహత్యల నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నాం -పథకాలతో లబ్ధి చేకూర్చి ఆదుకుంటున్నాం: మంత్రి ఈటల -అడవులను 33 శాతం పెంచడానికి కృషి: మంత్రి జోగు రామన్న -నర్సంపేటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

ఆత్మహత్యలు తెలంగాణలో మాత్రమే జరగడం లేదని, అన్ని రాష్ర్టాల్లోనూ కొనసాగుతున్నదన్నారు. అధిక పెట్టుబడులు, తక్కువ రాబడి కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పా రు. పంటలు సాగు చేస్తే వచ్చే డబ్బుతోనే వైద్యం, విద్య, పిల్లల పెండ్లిళ్లు చేయాల్సి రావడం, డబ్బు సరిపోక అప్పులవుతున్నారన్నారు. ఈ కష్టాలకు ముగింపు పలికేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులపై భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టిందని వివరించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి యువతుల వివాహానికి రూ. 51 వేలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగై న వైద్యం అందించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిస్తున్నామన్నారు.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సాగునీటి వసతి కల్పించేందుకు మిషన్ కాకతీయలో చెరువులను పునరుద్ధరిస్తున్నామని, ప్రాజెక్టులకు రీ డిజైన్ చేసి ఆయకట్టు పెంచుతున్నామన్నారు. ఎరువులు, పురుగుమందుల విత్తనాలు అందుబాటలోకి తెచ్చి బ్లాక్మార్కెట్ సమస్య లేకుం డా చేశామన్నారు. గత ప్రభుత్వాలకాలంలో పంట నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇటీవలే రూ.480కోట్లు ఇన్ఫుట్ సబ్సిడీ అందించామని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. ఇప్పటికే రూ.8500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
మూడేండ్లలో పగటిపూటే 9 గంటల కరెంటు ఇచ్చే పనులు మొదలయ్యాయన్నారు. మరో మంత్రి జోగురామన్న మా ట్లాడుతూ రాష్ట్రంలో అడవులను 33 శాతం పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. హరితహరంలో నాలుగేండ్లలో 230 కోట్ల మొక్కలు పెంచాలని సీఎం కేసీఆర్ సా హసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తర్వాత పాకాలలో స్పీడ్బోట్ను ప్రారంభించి మంత్రులు జలవిహారం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి, అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు.