-మున్సిపల్ ఎన్నికల్లో ఊపుమీదున్న టీఆర్ఎస్ -రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సన్నాహక సమావేశాలు

ఎన్నికలేవైనా విజయాలను చిరునామాగా మార్చుకున్న టీఆర్ఎస్ మరోసారి ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవనున్న నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఒక్క స్థానం కూడా కోల్పోకుండా పక్కాగా ప్రణాళిక రచిస్తున్నది. ఇందుకోసం మున్సిపాలిటీలవారీగా కార్యకర్తలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, అగ్ర నేతలు సమావేశమవుతున్నారు.
సోమవారం సిరిసిల్ల పట్టణ కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతివర్గానికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేరువయ్యాయని, ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతి ఓటరును కలిసి కారు గుర్తుకే ఎందుకు ఓటు వేయాలో వివరించాలని సూచించారు. గోదారి జలాలతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా కావాలన్నది కేసీఆర్ సంకల్పమని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే, ప్రభుత్వానికి వారధిగా ఉండి పట్టణాల అభివృద్ధికి సంబంధిత పాలక వర్గాలు దోహదపడుతాయని వివరించారు. మేడ్చల్లో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు హాజరయ్యారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకుపోదామని తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పల్లెప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి నిర్వహిస్తామని చెప్పారు. కోదాడ, హుజుర్నగర్ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం జలాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. రైతులను, అన్ని వర్గాలను ఆదుకున్న చరిత్ర కేసీఆర్దని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కోరుట్లలో లాంఛనంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమపథకాలను చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు.
నియోజకవర్గాల్లో ఇంచార్జీల పర్యటన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లవారీగా ఇంచార్జిలను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులతోపాటు వివిధవర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ అంచనాల ద్వారా నివేదికను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. నివేదికను త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందించనున్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎలా సరిదిద్దాలనే అంశాలపై చర్చించి పరిష్కారం చూపించనున్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా వందల సంఖ్యలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. 55 ఏండ్లలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా సంక్షేమపథకాలను అమలుచేస్తున్నందుకు రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల ప్రజలంతా టీఆర్ఎస్వైపే ఉన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో అన్ని పంచాయతీలు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సంపూర్ణ విజయాన్ని సాధిం చాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 120 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురడం ఖాయం. సంక్షేమపథకాల అమలు, అభివృద్ధిలోనూ మనమే టాప్లో ఉన్నాం. ఓట్లడిగే హక్కు మనకే ఉన్నది. – సిరిసిల్ల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్