-దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేసీఆర్కు అగ్రస్థానం -ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 51% ఓట్లు -17 లోక్సభ స్థానాలూ గులాబీ దళానికే -వీడీపీ అసోసియేట్స్ సర్వేలో వెల్లడి

మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన నేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకు భవిష్యత్ సోపానాలను నిర్మిస్తున్న నాయకుడు కేసీఆర్కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. రెండున్నరేండ్ల పాలన తర్వాత కూడా ఆయన చరిష్మా ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగిందని నిరూపిస్తున్నారు. అత్యుత్తమ పనితీరుగల ముఖ్యమంత్రిగా ప్రజలు కేసీఆర్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు మరోమారు నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 12 రాష్ర్టాల్లో నిర్వహించిన జాతీయస్థాయి సర్వేలో కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. అత్యధికంగా 87 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలనకు తమ ఆమోదం తెలియజేశారు. ఆ తర్వాత స్థానాలను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ (85%) కైవసం చేసుకున్నారు.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సుమారు 51 శాతం ఓట్లు టీఆర్ఎస్కు లభిస్తాయని, రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తుందని సర్వేలో తేలింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు 33.66% ఓట్లు లభించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 58 శాతం ప్రజల మద్దతుతో 8వ స్థానంలో నిలిచారు. పనితీరు, ప్రజాదరణపై ప్రశ్నలు దేశలో 17 లేదా అంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగిన పన్నెండు రాష్ర్టాల్లో (కేరళ మినహా) వివిధ అంశాలపై ఈ సర్వే జరిపారు. దీంట్లోభాగంగా 12,000 మందిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. పన్నెండు రాష్ర్టాల్లోని సీఎంల పనితీరుపైనా, వారి ప్రజాదరణపైనా జరిపిన ఈ సర్వేలో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రి కంటే తెలంగాణ సీఎం కేసీఆర్కే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. మెజారిటీ ప్రజలు కేసీఆర్ పనితీరు, పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో లోక్సభ లేదా అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 51 శాతం ఓట్లు టీఆర్ఎస్కు లభిస్తాయని, మొత్తం 17 లోక్సభ స్థానాలూ ఆ పార్టీకి దక్కుతాయని సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో యూపీఏ భాగస్వామ్య పార్టీలకు 17 శాతం, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు 15 శాతం ఓట్లు లభిస్తాయని తేలింది.
గతంలోనూ కేసీఆర్కే అగ్రస్థానం ఈ సంవత్సరం మే నెలలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ నిలిచారు. నాడు కేసీఆర్కు 86 శాతం మంది ప్రజల మద్దతు లభించగా.. నేడు అది మరింత పెరిగి 87 శాతానికి చేరుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అవుతున్న ప్రస్తుత సమయంలోనూ కేసీఆర్ ప్రజాదరణ తగ్గకపోగా మరింత పెరగటం విశేషం. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబుకు గత సర్వేలో 69% మద్దతు లభించగా.. ప్రస్తుతసర్వేలో మద్దతు గణనీయంగా తగ్గిపోయి 58 శాతానికి పడిపోయింది. ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 15 స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని, మిగిలిన 10 స్థానాలు వైసీపీ గెల్చుకుంటుందని సర్వే తేల్చింది.
కేసీఆర్ పరిపాలన తీరుకు నిదర్శనం కేంద్ర సర్కారుతో పాటు ఆయారాష్ర్టాల ప్రభుత్వాల పనితీరుకు సంబంధించిన అంశాలపై సర్వేలో భాగంగా ప్రజలను వీడీపీ అసోసియేట్స్ సంస్థ ప్రశ్నించింది. సర్వే జరిగిన 12 రాష్ర్టాల్లో కేసీఆర్కు ఇతర సీఎంలందరికంటే ఎక్కువ ప్రజాదరణ లభించింది. దాదాపు రెండున్నరేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న పథకాల పట్ల తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నది. ప్రత్యక్షంగా ప్రజలకు చేరే వివిధ రకాల పింఛన్లు, రేషను బియ్యం, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్బెడ్రూం ఇండ్లు తదితర పథకాల కారణంగానే కేసీఆర్కు జనం పట్టం కట్టినట్లుగా స్పష్టమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, నిరంతర విద్యుత్ సరఫరా తదితర ప్రాజెక్టులు కూడా ప్రజల మీద సానుకూల ప్రభావం చూపినట్లుగా సర్వే వెల్లడిస్తున్నది.
సర్వే ఇలా జరిగింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లయిన సందర్భంగా జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్… 17 లేదా అంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగిన రాష్ర్టాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ప్రధాని పనితీరుతోపాటు ఆయా రాష్ర్టాల్లోని ముఖ్యమంత్రుల పనితీరును, వారికున్న ప్రజాదరణను తెలుసుకునే లక్ష్యంతో వివిధ అంశాలపై సర్వేలో భాగంగా ప్రజల్ని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారన్న దానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.