-వయోపరిమితి 57 ఏండ్లకు తగ్గింపు
-ఈ నెల 20న ప్రొసీడింగ్స్
-వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి
-రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
-పింఛన్లు వెయ్యి నుంచి రూ.2016కు
-దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు రూ.1500ల నుంచి రూ.3016కు
-పీఎఫ్ కటాఫ్ డేట్ తొలిగింపు
-పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం
-నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు
-ఆమోదానికి మున్సిపల్ బిల్లు
-భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష
రాష్ట్రంలో పెంచిన పింఛన్లు అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలవారీగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ను అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే కొత్త మున్సిపల్ చట్టం బిల్లుకు ఆమోదం తెలిపింది. బుధవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న పింఛన్ను రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ను రూ.1500 నుంచి రూ.3016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పింఛన్లను 2019 జూన్ నుంచి అమలుచేస్తారు. జూన్ నెల పెన్షన్ను ఈ జూలైలోనే లబ్ధిదారులకు అందుతుంది. పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను ఈ నెల 20న అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా లబ్ధిదారులకు అందిస్తారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రొసీడింగ్స్ అందజేసేందుకు సమావేశాలు ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్ పంపిణీ ముగిసిన వెంటనే లబ్ధిదారులకు పింఛన్సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. పెంచిన పింఛన్లు అందించటానికి సంవత్సరానికి రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుంది. దీంట్లో రూ.11,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా కేంద్రం రూ.200 కోట్లను ఇస్తున్నది. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టీఆర్ఎస్ ఎన్నికల హామీని అమలుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితాను రూపొందించి, దాని ప్రకారం పెంచిన పెన్షన్ అందించనున్నారు. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్ను తొలిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2019 జూలై 17 వరకు పీఎఫ్ ఖాతా ఉన్న కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.