-మిషన్ భగీరథ పనుల్లో మరింత వేగం పెంచాలి
-త్వరితగతిన అంతర్గత పనులు
-ఇప్పటికే 12 వేల గ్రామాలకు భగీరథనీళ్లు
-ఆగస్టుకల్లా మిగిలిన చోట్ల పూర్తికావాలి
-అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనులు
-పనుల నాణ్యతలో రాజీపడొద్దు
-వర్క్ ఏజెన్సీలకు సీఎం కేసీఆర్ ఆదేశం
-మిషన్ భగీరథపై ఉన్నతస్థాయి సమీక్ష
-సకాలంలో పూర్తిచేయని ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దుచేస్తామని హెచ్చరిక
పరుగులు పెడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్ఫూర్తిగా తీసుకుని మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వర్క్ ఏజెన్సీలకు సూచించారు. ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతున్నదని, మిగిలిన గ్రామాలకు ఆగస్టు చివరినాటికి మంచినీరు అందాలని చెప్పారు. అంతర్గత పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే టీములను పెంచి మూడు షిప్టుల్లో పనిచేయించాలని సూచించారు. ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్ ఏజెన్సీలకు కూడా మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అగ్రిమెంటులో పేర్కొన్న దానికన్నా అదనంగా పడే జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చిన సీఎం.. నిర్ణీత సమయంలో పనులను పూర్తిచేయని వర్క్ఏజెన్సీల కాంట్రాక్టులను రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మిషన్ భగీరథపై ప్రగతిభవన్లో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో జిల్లాలు, నియోజకవర్గాలవారీగా పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు.
లక్ష్యాన్ని సవాల్గా తీసుకొని పనులు పూర్తిచేయాలి ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో సవాల్గా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని వర్క్ ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చిచెప్పారు. గ్రామాలకు నీటి సరఫరాచేసే పనులతోపాటు, గ్రామాల్లో అంతర్గత పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని సూచించారు. కొన్నిచోట్ల ఓహెచ్ఎస్ఆర్ పనుల్లో అనుకున్నంత వేగంలేదని అసంతృప్తి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి.. డెడ్లైన్లోపు పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం కాలేదనే నెపంతో గ్రామా ల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం ఆపాల్సిన అవసరం లేదని, వాటి నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పారు. పైపులైన్లు, నల్లాలు, ఇతర సామగ్రిని నిర్మాణ ప్రాంతాలకు తరలించి, స్టోర్చేసి పెట్టాలని సూచించారు. రేయింబవళ్లు కష్టపడుతూ, శరవేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిషన్ భగీరథలో కూడా వేగం పెంచాలని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని దాదాపు 25 వేల ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీటిని ప్రతిరోజూ సరఫరాచేసేలా మిషన్ భగీరథను చేపడుతున్నామని అసెంబ్లీలో మాటిచ్చామని సీఎం గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు వేగంగా జరుగాలన్నారు.
మిషన్ భగీరథ.. ఇంజినీరింగ్ అద్భుతం మిషన్ భగీరథ చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్ ఏజెన్సీలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇది ఆ కంపెనీలకు దేశంలో మరిన్ని మెగా ప్రాజెక్టులు చేపట్టడానికి అనుభవంగా, అర్హతగా మారుతుంది. అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి మొదట్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఆ తప్పులను వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలి. మిషన్ భగీరథ తెలంగాణ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టు. కొద్దికాలంపాటు కాంట్రాక్టర్లు పనులు నిర్వహించినా, ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లే దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కనుక అధికారులు మొదటి నుంచి దీనిపై శ్రద్ధపెట్టాలి. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. పకడ్బందీగా పనులుచేయించాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు మిషన్ భగీరథకోసం ఏర్పాటుచేసిన సబ్స్టేషన్ల వద్ద అసరమైన సిబ్బందిని నియమించాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.
రిజర్వాయర్లలో కనీస నీటి సేకరణ స్థాయిని నిర్వహించాలి రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో కనీస నీటి సేకరణ స్థాయి (మినిమమ్ డ్రాయింగ్ డౌన్ లెవల్ – ఎండీడీఎల్) నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. తాగునీటికి అవసరమయ్యే నీటిని రిజర్వ్చేసిన తర్వాత సాగునీటికి నీరు విడుదలచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు. అగ్రిమెంటులో పేర్కొన్న దానికన్నా అదనంగా పడే జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్న ప్రాంతంలో.. భూ ఉపరితలంపై గ్యాస్ పైపులైన్ల వద్ద పెట్టే విధంగా ఇండికేటర్స్ పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీ బాల్కసుమన్, టీఎస్ఐఐడీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ బీ సురేందర్రెడ్డి, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్ ఏజెన్సీలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇది ఆ కంపెనీలకు దేశంలో మరిన్ని మెగా ప్రాజెక్టులు చేపట్టడానికి అనుభవంగా, అర్హతగా మారుతుంది. అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి మొదట్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఆ తప్పులను వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలి. మిషన్ భగీరథ తెలంగాణ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టు. కొద్దికాలంపాటు కాంట్రాక్టర్లు పనులు నిర్వహించినా, ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లే దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కనుక అధికారులు మొదటి నుంచి దీనిపై శ్రద్ధపెట్టాలి. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు