-గడువు ముగిసినా తగ్గని స్పందన -వాడవాడలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు -ఊపందుకున్న కంప్యూటరీకరణ

టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదుకు స్పందన ఏమాత్రం తగ్గడంలేదు. 20వ తేదీనాటికే గడువు ముగిసిన విషయం తెలిసిందే. సభ్యత్వాల కంప్యూటరీకరణకు గడువు ఈనెల చివరివరకు పెంచడంతో నభ్యత్వాల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. ఆదివారం కూడా వాడవాడలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు భారీ జనం ముందుకువచ్చారు. ఇతర పార్టీ నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతుండటంతో సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. మరోవైపు సభ్యత్వాలను కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ కూడా ఊపందుకున్నది.
పెండ్లిళ్లు, దావతులు ఉన్నా అదేజోరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం వాడవాడలా కొనసాగింది. ఆదివారం పెండ్లిళ్లు దావతులు ఉన్నా అదేజోరు కనిపించింది. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం బూర్గుగడ్డలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసోజు శంకరమ్మ, నేరేడుచర్ల మండలం ముసిఒడ్డు సింగారంలో ఆ పార్టీ సీనియర్ నేత సాముల శివారెడ్డి భారీ సంఖ్యలో సభ్యత్వాలు చేయించారు. ఆత్మకూర్లో ఎంపీపీ భాగ్యశ్రీ, సర్పంచ్ చంద్రగౌడ్, గుండాల మండలం వెల్మజాలలో ఎంపీపీ వేణుగోపాల్, బొమ్మలరామారంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ జయమ్మలు పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 4.80 లక్షల సభ్యత్వాలు చేయించగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వాటిని నమోదు చేసి పంపిస్తున్నట్లు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం నిర్మల్లోని ప్రియదర్శినినగర్లో గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పలువురికి సభ్యత్వం అందచేసి మాట్లాడారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని అందుకే జనం పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదులో పాల్గొంటున్నారన్నారు. ఇచ్చోడలో పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, కోటపల్లిలో కేసీఆర్ అభిమాన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బైస ప్రభాకర్, తాండూరు మండలం పోచంపల్లిలో ఎంపీపీ మాసాడి శ్రీదేవి, జెడ్పీటీసీ మంగపతి సురేశ్బాబు, కాసిపేట మండలం ముత్యంపల్లిలో జెడ్పీటీసీ రౌతు సత్తయ్య చేతుల మీదుగా పలువురు కార్యకర్తలు సభ్యత్వం స్వీకరించారు. వరంగల్ జిల్లాలో ఇప్పటికే 6 లక్షలకు పైగా టీఆర్ఎస్ కుటుంబంలో సభ్యులుగా చేరారు. ఆదివారం వరంగల్ గ్రేటర్లో అర్బన్పార్టీ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో, పాలకుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఎన్ సుధాకర్రావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కొనసాగింది. ఇప్పటి వరకు జిల్లా నుంచి రాష్ట్ర పార్టీకి రూ.62 లక్షలు సభ్యత్వ రుసుమును చెల్లించారు. హైదరాబాద్లో కూడా సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగింది. సరూర్నగర్ మండలం జిల్లెలగూడలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెబీ కాలనీలో ఇన్చార్జి గొట్టిముక్కల పద్మారావు సభ్యత్వాలు అందజేశారు.