అన్నదాతలకు బాసటగా గులాబీ దళం
ఉద్యమాల ఊపిరిగడ్డ, పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ మరోసారి పిడికిలెత్తింది. స్వరాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్.. నేడు దేశానికి ఆకలి తీర్చే రైతన్నకు అండగా నిలిచింది. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా గులాబీ సైన్యం జెండాలెత్తింది. రైతన్నకు సంఘీభావం ప్రకటిస్తూవారి ఆశయ సాధనకు టీఆర్ఎస్ శ్రేణులు బంద్ పాటించాలని అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం రాష్ట్రంలో భారత్ బంద్ సంపూర్ణమైంది.

హోరెత్తిన నినాదాలు వ్యవసాయానికి ఉరికొయ్యల్లా మారిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని పోరుబాట పట్టిన రైతులకు అండగా నిలవటం తమ బాధ్య త అని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివి ధ కార్పొరేషన్ చైర్మన్లు..పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు ఇలా ఎక్కడికక్కడ.. ఎవరికివారు అధినేత పిలుపు ను అందుకొని నినదించారు. ‘మోదీ హఠావో-దేశ్ బచావో’, ‘మాకొద్దు మాకొద్దు.. రైతు వ్యతిరేక నల్లచట్టాలు మాకొద్దు’ అంటూ నినదించారు. ‘కదిలిందిర తెలంగాణ ఖబర్దార్ ఖబర్దార్.. నిలిచిందిర తెలంగాణ కిసాన్కు అండగా’.. ‘మేముం టాం మేముంటాం.. రైతన్నకు అండగా మేముం టాం’ అని పిడికిళ్లెత్తి తెలంగాణ నినదించింది. కేంద్ర నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు అండగా నిలబడింది. మంత్రుల నాయకత్వంలో ఎడ్లబండ్లు.. ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించి, వంటావార్పు చేపట్టారు.

రైతులకు మద్దతుగా మంత్రులు.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గులగేట్ వద్ద బెంగళూర్ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్శాఖ మం త్రి కే తారకరామారావు, మంత్రి శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు భైఠాయించారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ వై జంక్షన్ వద్ద ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ క్రాస్రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డి జిల్లా టేక్రియాల వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగుళాంబ-గద్వాల జిల్లా అలంపూర్లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆందోళనల్లో పాల్గొన్నారు. కరీంనగర్-వరంగల్ రహదారిపై మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పత్తిపాక ఎక్స్రోడ్ వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్లో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, సికింద్రాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, తుక్కుగూడ వద్ద మంత్రి సబితాఇంద్రారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్, నల్లగొండ, సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి ఆందోళన చేశారు. హైదరాబాద్లోని మూసారాంబాగ్ వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు.

బీజేపీ సర్కారు పక్కా కార్పొరేట్ సర్కారు. అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చింది. -తన్నీరు హరీశ్రావు, ఆర్థికశాఖ మంత్రి
కేంద్రానికి రైతులపై ప్రేమ ఉంటే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి లక్ష కోట్ల బడ్జెట్ పెట్టాలి. కొత్త రైతు చట్టాలను రద్దుచేయాలి. -ఈటల రాజేందర్, వైద్యారోగ్యశాఖ మంత్రి
రైతులను దోచుకునేలా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే చట్టాలను తెచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతాం. -మహమూద్ అలీ, హోంశాఖమంత్రి
కేంద్రం రైతులను ఆగం చేస్తున్నది. రైతు ఉత్పత్తులు నిల్వచేసి కృ త్రిమ కొరతకు కొత్త చట్టాలతో కుట్ర చేసింది. వాటిని అంగీకరించం. -సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ముప్పు. సీఎం కేసీఆర్ రైతు బంధువుగా మారితే.. కేంద్రం రైతులను ముంచేందుకు యోచిస్తున్నది. ‘నల్ల’ చట్టాలను వెంటనే ఎత్తివేయాలి. -జగదీశ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి
ఈ చట్టాలు అమలైతే రాష్ట్రంలో రైతుబంధు, 24గంటల కరెంటు, మార్కెట్లు, సీసీఐ, ఎఫ్సీఐ కొనుగోళ్ల్లు బందవుతాయి. రైతులకు కార్పొరేట్ సంస్థలే దిక్కవుతాయి. -ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి

పెట్టుబడిదారుల, కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి -కొప్పుల ఈశ్వర్, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి
దేశానికి అన్నం పెడుతున్న రైతులు రక్తం గడ్డకట్టే చలిలో ఢిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. -తలసాని శ్రీనివాస్యాదవ్, పశుసంవర్ధకశాఖ మంత్రి
కార్పొరేట్ సంస్థల కోసం మోదీ కొత్త చట్టాలను తీసుకొచ్చారు. వీటిని బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్ సీఎం వ్యతిరేకించారు. -వీ శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్శాఖ మంత్రి
దేశంలోని వివిధ సంస్థలు, కంపెనీలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టం తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నది. -అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని నష్టం జరుగుతుంది. వెంటనే వాటిని ఉపసంహరించుకోకపోతే గుణపాఠం తప్పదు. -చామకూర మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసేంత వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం విశ్రమించదు. -సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి
మోదీ సర్కార్ అన్నదాతల ఉసురు తీస్తున్నది. గ్లోబల్ వ్యాపా రం పేరుతో దేశ రైతులను అధోగతి పాలుకు యత్నిస్తున్నది. -పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి
కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు అమల్లోకి వస్తే రైతులకు, ప్రభుత్వానికి సంబంధాలు ఉండవు. కనీస మద్దతు ధరకు ఉత్పత్తులు కొనే పరిస్థితి ఉండదు. – గంగుల కమలాకర్, పౌరసరఫరాలశాఖ మంత్రి మోదీ ప్రభుత్వం కార్పొరేట్కు అనుకూలంగా వ్యవసాయ చట్టా లు చేసింది. కొత్త చట్టాలు రైతులకు ఉరితాళ్లుగా మారనున్నాయి. -సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
టీఆర్ఎస్ సర్కారు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుం టుంటే.. కేంద్రం వారి కడుపు కొట్టేలా వ్యవహరిస్తున్నది. కొత్త వ్యవ సాయ చట్టాలను రద్దు చేసేవరకు టీఆర్ఎస్ పోరాటం ఆగదు. -కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎమ్మెల్సీ