-ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకుంటారు -పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలి -పార్ట్-1 పనులు ఈ ఏడాది చివరినాటికి పూర్తిచేయాలి -మరో ఆరునెలల్లో పార్ట్-2 పనులు ముగించాలి -మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ప్రాధాన్యం -పరిశ్రమలకు 8 టీఎంసీల నీరు కేటాయించాలి -మిషన్ భగీరథపై సమీక్షలో సీఎం కేసీఆర్
రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక ఇంజినీరింగ్ అద్భుతమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభివర్ణించారు. జీవితమంతా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే పనిగా మిగిలిపోతుందని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయడం అందరికీ గర్వకారణమన్నారు. సుమారు 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసిన జలాలను.. ప్రతిరోజూ ప్రతిఇంటికీ అందించే గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. అందుకే ఈ పథకాన్ని నీతి ఆయోగ్తోపాటు అనేక రాష్ట్రాలు మెచ్చుకున్నాయని చెప్పారు. చాలా రాష్ర్టాలు వారి రాష్ర్టాల్లో కూడా అమలు చేయడానికి అధ్యయనం చేశాయని అన్నారు. ప్రగతిభవన్లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. పార్ట్-1 పనులను ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పూర్తిచేయాలని, మరో ఆరు నెలల్లో పార్ట్-2ను పూర్తిచేయాలని చెప్పారు.
కొత్త సంవత్సర కానుకగా 24,225 ఆవాస ప్రాంతాలకు భగీరథ జలాలు పార్ట్-1లో పనులను ఈ ఏడాది డిసెంబర్ చివరికి పూర్తిచేసి, రాష్ట్రంలోని 24,225 ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసిన నదీ జలాలను నూతన సంవత్సర కానుకగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పైపులైన్ద్వారా నీరు పంపించే క్రమంలో కొద్ది నెలలపాటు కొన్ని సహజమైన సమస్యలు తలెత్తుతాయని వివరించారు. అంతర్గత పనులన్నీ పూర్తయి, నల్లాలద్వారా మంచినీరు అందించే సందర్భంగా కూడా ప్రారంభ దశలో కొన్ని సమస్యలుంటాయని అన్నారు. వాటిని వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలని చెప్పారు. నీటి ప్రవాహ ఒత్తిడివల్ల ప్రారంభంలో పైపులు, వాల్వ్ ల వద్ద లీకేజీలలాంటి సమస్యలు తలెత్తుతాయని,దాంతో భయపడిపోవద్దని కేసీఆర్ అన్నారు. పథకం ప్రారంభమయిన గజ్వేల్లో కూడా రెండునెలలవరకు చిన్నచిన్న సమస్యలు వచ్చాయని గుర్తుచేశారు. ఎదురైన సమస్యలను ఎప్పటికప్పుడూ సవరించుకుంటూనే.. పార్ట్-2 కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు అంతర్గత పైపులైన్ల నిర్మాణం, నల్లాల ఏర్పాటులాంటి పనులు పూర్తిచేయాలని చెప్పారు. పార్ట్-2 పనులు కూడా 2018 మొదటి అర్ధభాగంలో పూర్తికావాలని అన్నారు.
పనుల ప్రగతిపై గూగుల్ మ్యాప్ ఆధారంగా పరిశీలన రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సీఎం కేసీఆర్ గూగుల్ మ్యాప్ద్వారా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ సమస్య తలెత్తుతున్నదో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలవారీగా, సెగ్మెంట్లవారీగా ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్బీఆర్ల నిర్మాణం, పైపులైన్ల నిర్మాణం, ఎలక్ట్రోమోటర్ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ ప్రాజెక్టుద్వారా 24,225 ఆవాస ప్రాంతాలకు మంచినీరు అందించాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3,431 గ్రామాలకు మంచినీరు అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబర్ చివరినాటికి మరో 5,443 గ్రామాలకు, నవంబర్ చివరినాటికి మరో 6,006 గ్రామాలకు, డిసెంబర్ చివరినాటికి 9,345 గ్రామాలకు మంచినీరు అందిస్తామని ఈఎన్సీ సురేందర్రెడ్డి సీఎం కేసీఆర్కు వివరించారు. పైపులైన్ల నిర్మాణంతోపాటు మోటర్లు బిగించే పనులు కూడా శరవేగంగా చేస్తున్నట్టు వివరించారు.
విద్యుత్శాఖను అభినందించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథకు కావాల్సిన కరెంటును అందించడానికి విద్యుత్శాఖ చేసిన ఏర్పాట్లను సీఎం కేసీఆర్ అభినందించారు. మిషన్ భగీరథ కోసం చేపట్టిన పనులన్నీ అక్టోబర్ 2 నాటికే పూర్తవుతాయని సీఎం కేసీఆర్కు జెన్కో, ట్రాన్స్కో సీఎండీ డీ ప్రభాకర్రావు తెలిపారు. 2017 డిసెంబర్ 31 లక్ష్యంగా మిషన్ భగీరథ పనులు చేపట్టగా, విద్యుత్శాఖ మాత్రం రెండు నెలల ముందే అప్పగించిన బాధ్యతలను నెరవేర్చిందని సీఎం కేసీఆర్ జెన్కో సీఎండీకి ఫోన్ చేసి ప్రశంసించారు. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో సబ్స్టేషన్ నిర్మాణం, విద్యుత్లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు బిగించడంలాంటి పనులన్నీ పూర్తిచేసినట్టు ప్రభాకర్రావు వివరించారు. మిషన్ భగీరథ కోసం 221 మెగావాట్ల నిరంతర విద్యుత్ అందించడం కోసం 42 సబ్స్టేషన్లు, 1190 కిలోమీటర్ల పైపులైన్లు ఏర్పాటుచేశామని, 87 పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పుతున్నామని ఆయన సీఎంకు వివరించారు.
మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మొదట మంచినీరు అందించాలని సీఎం చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అక్టోబర్ చివరి నాటికే పనులు పూర్తిచేసి, అంతర్గత పనులను కూడా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని గిరిజన తండాలు, దళితవాడలు, గోండు గూడేలకు నూటికి నూరు శాతం మంచినీరు అందించాలని కోరారు.
పాలేరుకు డిప్యూటీ సీఎం బృందం పాలేరు సెగ్మెంట్ పరిధిలోని పాత వరంగల్ జిల్లా మండలాలకు నీరందించే పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. పాలేరుద్వారా పాత వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1706 ఆవాస ప్రాంతాలకు నీరు అందించే పనులు అనుకున్నంత వేగంగా జరుగడం లేదని చెప్పారు. వచ్చే రెండు నెలల సమయంలో పనులన్నీ పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి నాయకత్వంలోని బృందం పాలేరు సెగ్మెంటును సందర్శించి వర్క్ ఏజెన్సీలు, అధికారులతో సమీక్షించాలని చెప్పారు.
మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీరు మిషన్ భగీరథద్వారానే పరిశ్రమలకు కూడా శుద్ధిచేసిన మంచినీటిని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంచినీరు అవసరమున్న పరిశ్రమలనుంచి దరఖాస్తులు స్వీకరించి, వారికి ప్రత్యేక పైపులైన్లు వేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని కోరారు. మిషన్ భగీరథకు కేటాయించిన దాదాపు 80% నీటిలో పదిశాతం (8 టీఎంసీలు) పరిశ్రమలకు అందించే వెసులుబాటు ఉందని సీఎం చెప్పారు. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాలకోసం 10 టీఎంసీల డెడికేటెడ్ రిజర్వాయర్ కడుతున్నందున అక్కడినుంచి పరిశ్రమలకు నీరందించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్ భగీరథ ద్వారానే బల్క్ సప్లయ్ చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్, మిషన్ భగీరథ ఈఎన్సీ బీ సురేందర్రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, కన్సల్టెంట్ మనోహర్బాబు, సీఈలు జగన్మోహన్రెడ్డి, విజయప్రకాశ్, కృపాకర్రెడ్డి, ఓఎస్డీ సత్యపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.