Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నూరేళ్ల గోస తీరితేనే విముక్తి

శతాబ్దకాలంగా అనేక రకాల గోసపడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరుపాళ్లు రావాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సిటీ పోలీస్ కమీషనర్ ఎం మహేందర్‌రెడ్డి, జెన్‌కో చైర్మన్, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్, ఈడిఈ. వెంకటనర్సింహారెడ్డితో పాటు సీఎం కార్యాలయ అధికారులు నర్సింగ్‌రావు, స్మితాసబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM-KCR-meet-with-secretaries

-సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల రంగాలపై త్రిముఖ వ్యూహంతో ప్రణాళికలు -సమతుల అభివృద్ధి జరిగేలా బడ్జెట్ ప్రతిపాదనలు -అధికారులే ప్రభుత్వానికి సారధులు -వాస్తవాల ఆధారంగా పనిచేయండి -నెలకు రెండురోజులు స్వచ్ఛ తెలంగాణ -ఏటా జూలై మొదటివారం హరితహారం -ఫిబ్రవరి చివరివారం మిషన్‌కాకతీయ.. -ఈ వేసవిలోనే హుస్సేన్‌సాగర్ శుద్ధి -ముఖ్యకార్యదర్శుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వందేండ్లుగా తెలంగాణ ప్రజలు పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న ఇబ్బందులను, మారుతూ వస్తున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరించారు. నిజాం పాలన మంచిచెడులు, రజాకార్ల ఆవిర్భావం- ప్రభావం, సైనిక పాలన, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 ఉద్యమం, ఇండ్లీసాంబార్ గోబ్యాక్ ఉద్యమం, గైర్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం, 2001 నుంచి రాజకీయ పోరాటం, మధ్యలో వచ్చిన వివిధ ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన బలిదానాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ప్రారంభంలో పడుతున్న కష్టాలు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి భావోద్వేగంగా, సోదాహరణలతో అధికారులకు విడమర్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని మంచి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులుగా తమకు, అధికార యంత్రాంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న అధికారులకు ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాలనలో మూడు భాగాలు ఉన్నాయని సీఎం అన్నారు. ఒకటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, రెండు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, మూడు అధికారులు. వీరంతా కలిస్తేనే సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రభుత్వ పాలనను మూడు విభాగాలుగా మార్చుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని సీఎం అన్నారు. ఒకటి పేదలు-సంక్షేమం, రెండు వ్యవసాయం, మూడు పరిశ్రమలు- పెట్టుబడులు- మౌలిక వసతులు. ఈ మూడు విభాగాల్లో సమతుల అభివృద్ధికోసం విధానాల రూపకల్పన జరగాలి. ఇందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పుడున్న అవగాహన, పరిమిత వనరులు, పరిమిత అవకాశాల మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. మొదటి బడ్జెట్‌లో ప్రభుత్వ అంచనాలు ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిఫలించాయన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ సమగ్రంగా రూపొందాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవాల ఆధారంగా, నిజాల భూమికపై పనిచేయాలని, మంచిచెడులను ప్రజలకు విడమర్చి చెప్పాలని సీఎం అధికారులను కోరారు. పరిపాలనలో ఎలాంటి దాపరికం అవసరం లేదన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దేశాన్ని నూతన పంథాలో నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని వెల్లడించారు.

సీఎంగా చేసిన వ్యక్తే ప్రధాని కావడం రాష్ర్టాలకు సానుకూలం కొద్దికాలం క్రితంవరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే దేశానికి ప్రధానిగా ఉండడం రాష్ర్టాలకు సానుకూల అంశమని సీఎం కేసీఆర్ విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బాగా కుదిస్తున్నారని, రాష్ర్టాలకు కేంద్రం ఇచ్చే నిధుల విధానంలోకూడా సమూల మార్పులు రానున్నాయన్నారు. అనేక కొత్త ఆలోచనలను కేంద్రం చేస్తుందని అధికారులకు సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చాలా పథకాలు, కార్యక్రమాలకు తుదిరూపం ఇచ్చే పనిలో అక్కడి యంత్రాగం ఉందన్నారు. కేంద్రంనుంచి వివిధ పథకాలకు సంబంధించి వచ్చే విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు.

పెట్టుబడులకు ఎంతో ఆకర్షనీయమైనది తెలంగాణ పెట్టుబడులకు ఎంతో ఆకర్షణీయమైన వాతావరణ స్థితిగతులు, భౌగోళిక పరిస్థితులు తెలంగాణ రాష్ర్టానికి ఉన్నాయని సీఎం అన్నారు. అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు లేకపోవడంతోపాటు చాలినంత భూమి ఉందని, అలాగే నీళ్లు కూడా అందుబాటులో ఉండడంలాంటి అనుకూలతలు రాష్ర్టానికి ఉన్నాయని అన్నారు. దేశ స్వాతంత్య్రానికి ముందే హైదరాబాద్‌లో 165 పరిశ్రమలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఐటీ దిగ్గజాలైన ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లాంటి కంపెనీలు తమ మెయిన్ సర్వర్‌ను హైదరాబాద్‌లో పెట్టుకుంటున్నాయని చెప్పారు.

పరిశ్రమల అనుమతులకు సీఎంవోలో ప్రత్యేక విభాగం పరిశ్రమల అనుమతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే మరెక్కడాలేని గొప్ప పారిశ్రామిక విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టామని అన్నారు. సింగిల్ విండో విధానం, పెట్టుబడిదారులకు అనుమతులు పొందే హక్కు, టీఎస్ ఐ పాస్ చట్టం, 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చే విధానం తదితర అంశాలన్నీ రాష్ర్టానికి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు రావడానికి కారణమవుతాయని చెప్పారు.

2018 నాటికి అందుబాటులోకి 23వేల మెగావాట్ల విద్యుత్ రాష్ర్టానికి, హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ ప్రస్తుతం కరెంటు విషయంలో మాత్రమే కొంత ఇబ్బంది ఉందని సీఎం అన్నారు. దీనిని అధిగమించేందుకు కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. 2018చివరి నాటికి రాష్ట్రంలో 23 వేలకుపైగా మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఈ ఏడాది చివరినాటికే 6679 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, దీంతో చాలా వరకు కరెంటు కష్టాలు తీరుతాయని సీఎం తెలిపారు. పరిశ్రమలకు చాలినంత విద్యుత్ ఇస్తామన్నారు.

ప్రైవేట్‌రంగాన్ని విస్మరించం రాష్ట్రం ప్రైవేట్ రంగాన్ని విస్మరించే పరిస్థితి లేదని సీఎం అన్నారు. పరిణామక్రమంలో సమాజంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో సామ్యవాద వైఖరితో పాలన సాగిందన్నారు. దీనికి అనుగుణంగానే ప్రణాళిక సంఘాల ఏర్పాటు జరిగిందని చెప్పారు. మారిన పరిస్థితుల ఆధారంగా ఇప్పుడు మార్కెట్ ఎకానమీవైపు పోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరడుగట్టిన కమ్యూనిస్టుల దేశమైన చైనాలో కూడా సడలింపులు అనివార్యమయ్యాయని చెప్పారు. పరిణామ క్రమంలో చాలా మార్పులు జరుగుతాయని, అందులో భాగంగానే మోదీ ప్రభుత్వం నీతి అయోగ్ ప్రవేశపెట్టిందన్నారు. మారిన పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పాటు పడాలని సీఎం అధికారులకు సూచించారు.

అధికారులు ప్రభుత్వాన్ని నడిపే సారథులుగా వ్యవహరించాలి అధికారులు ఒక శాఖకు బాధ్యులుగా కాకుండా ప్రభుత్వాన్ని నడిపే సారధులుగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అధికారులు పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకొని తమ అనుభవాలను పంచుకొని తరచూ చర్చలు జరుపుకొని మంచి విధానాలు రూపొందించాలని చెప్పారు. తనకు, మంత్రులకు కూడా మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అధికారులే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలన్నింటిపైనా అధికారులందరి వద్ద సమగ్ర సమాచారం ఉండాలన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న అధికారులకు గొప్ప పని సంస్కృతి ఉందని, అది గొప్ప అదృష్టమని సీఎం కేసీఆర్ కితాబునిచ్చారు. సమయ పరిమితులు పెట్టుకోకుండా అధికారులు రాత్రి పొద్దుపోయేవరకు కూడా సేవలందిస్తున్నారని అభినందించారు.

ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవి.. -రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు చేయాలి. ప్రతినెలా ఒకటవ, మూడవ శనివారాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇతర కార్యక్షేత్రాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ఎవరికివారు బాధ్యత స్వీకరించాలి. విద్యా సంస్థల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి. -రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఆదివారంతో సహా అన్ని రోజులు తెరిచి ఉంచుకునే వెసులుబాటు కల్పించాలి. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయాలి. కార్మికశాఖ ప్రతిపాదనలు పంపాలి. వారమంతా పనిచేసినవారు ఆదివారాలు షాపింగ్ చేద్దామంటే వీలు కావడంలేదు. ఇదే క్రమంలో వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసేవారితో నిర్ణీత సమయంకన్నా ఎక్కువ గంటలు పనిచేయించకుండా చూడాలి. వీక్లీ ఆఫ్ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూడాలి.

-ప్రతి సంవత్సరం జులై మొదటివారం హరిత హారం వారోత్సవాలు నిర్వహించాలి. పాఠశాల విద్యార్థినుంచి ముఖ్యమంత్రివరకు ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములయ్యేలా చూడాలి. ప్రజా ప్రతినిధులు హరిత హారం కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి. మండల, మున్సిపల్ సమావేశాలకు అటవీశాఖ అధికారులను ఆహ్వానించి సమీక్ష నిర్వహించాలి. రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్లలో 230 కోట్ల మెక్కలు పెంచాలి. -ప్రతి ఏడాది ఫిబ్రవరి చివరివారంలో మిషన్ కాకతీయ వారోత్సవం జరపాలి. ప్రజలందరి భాగస్వామ్యంతో చెరువులను పునరుద్ధరించాలి. -ఈ వేసవిలో హుస్సేన్‌సాగర్ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలి. మురికి నీరు హుస్సేన్‌సాగర్‌లోకి చేరకుండా చూడాలి. హుస్సేన్‌సాగర్‌లో పూడిక తీయాలి. -ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి శాఖల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. వారి జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి. బీసీల్లోని సంచార జాతులు, అగ్రవర్ణాలలోని పేదలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. -గృహ నిర్మాణ పథకాన్నికూడా పకడ్బందీగా అమలు చేయాలి. దీనికి సంబంధించి విధానాన్ని రూపొందించాలి. -గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా అధికారులు చొరవ చూపాలి. గ్రామాల్లో వీధి లైట్లు పగటి పూట వాడకుండా కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.