-జాతీయ రాజకీయాలకు మార్గదర్శకుడు
-ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి వెలుగు దివిటీ
-బీజేపీ అహాన్ని దెబ్బతీసిన ఏకైక నాయకుడు
-మోదీ, షా అజేయులేం కాదని రుజువు చేసిన నేత
-బీజేపీ నిజస్వరూపాన్ని బజారున పెట్టిన నాయకుడు
-రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉచ్చులో పడిన బీజేపీ బ్రోకర్లు
-ఆత్మరక్షణలో ఎటూ పాలుపోని బీజేపీ ఆగ్రనాయకత్వం
-రాజనీతిని, రాజకీయ పంథాను రుచి చూపించిన నేత
-సీఎం కేసీఆర్ రాజనీతికి ప్రాంతీయ పార్టీలు విస్మయం
Politics is nothing but perception అన్నారు రాజకీయ పండితులు.
అభిప్రాయాన్ని కలిగించడమే రాజకీయం. ఫలానా పార్టీ మంచిదని అంటే.. మంచిగానే చెలామణి అవుతుంది. చెడు అంటే చెడుగానే చలామణి అవుతుంది. బీజేపీ పైన ఉన్న పర్సెప్షన్ను మార్చి.. బీజేపీ బండారాన్ని బట్టబయలు చేశాడు.
అతడు ‘నేనురా తెలగాణ నిగళాలు తెగద్రొబ్బి ఆకాశమంత ఎత్తార్చినాను’ అని నినదించిన వీరుడు.. తెలంగాణను సాకారం చేసిన నాయకుడు.. కే చంద్రశేఖర్రావు.
ఇప్పుడు మహాకవి దాశరథి అన్నట్టు భూవదనంబునందు కుంకుమము భగ్గున మండినది అగ్గివోలె అంటూ కేసీఆర్ కదులుతున్నాడు.. కోట్లాది ప్రజల గళ ధ్వనియై.. ఇలాగోళమందున్న అందరి శబ్దమై.. తానొక్కడే ప్రజాకోటియై.. ఢిల్లీ వైపు..
ఇది భారత్ రాష్ట్ర సమితి రాజకీయ ప్రస్థానానికి మచ్చు తునక.. బీఆర్ఎస్ రాజనీతికి మెచ్చు తునక.
ఎనిమిదేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి.. తమకు ఎదురేలేదని విర్రవీగుతూ వచ్చిన పార్టీ దూకుడును
ఒకే ఒక్కడు దీటుగా నిలువరించాడు.
దర్యాప్తు సంస్థలు కేంద్రానికే కాదు..
రాష్ట్రాలకు కూడా ఉంటాయని.. సమర్థంగానూ, బలంగానూ ప్రయోగించగలవని
ఒకే ఒక్కడు రుజువు చేశాడు.
సమాఖ్య స్ఫూర్తిని భగ్నం చేసి.. వ్యవస్థల హననానికి పూనుకొన్న శక్తులకు ముకుతాడు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం
ఒకే ఒక్కడు అడ్డుగోడై నిలుచున్నాడు.
మోదీ, షాలను ఎదుర్కోవడం సాధ్యమే కాదని నిస్పృహల్లో ఉండిపోయిన రాజకీయ పార్టీలకు.. వాళ్లు అజేయులేం కారని
ఒకే ఒక్కడు కొండంత నమ్మకాన్నిచ్చాడు.
తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడుఉన్నాడని నిరూపించి.. ఎమ్మెల్యేల ఎర కుట్రను విచ్ఛిన్నం చేసి..
ఒకే ఒక్కడు బీజేపీని ఊహించని రీతిలో ఆత్మరక్షణలో పడేశాడు.
మోదీ, షాల నిర్వాకంతో నీరసించిపోయిన రాజకీయ గుండెలకు ఆయువు పోశాడు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. మతాల మధ్య ఉద్రేకాలు రెచ్చగొట్టడం.. తడిగుడ్డల ప్రమాణాలతో విశృంఖల విహారం చేస్తున్న బీజేపీ నిజస్వరూపాన్ని నగ్నంగా బయటపెట్టి.. దాన్నెలా అడ్డుకోవచ్చో చూపించాడు.
ఎనిమిదేండ్లుగా అప్రతిహిత అరాచకత్వంతో రెచ్చిపోతున్న బీజేపీని ఈ దేశంలో ధిక్కరించిన మొనగాడుగా తెలంగాణ ఉద్యమసారథి.. పుత్తడి తెలంగాణ సాధకుడు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్నది. మోదీ, షాలు అజేయులేం కాదని, బీజేపీ దొంగ పనులను ససాక్ష్యంగా బయటపెట్టి.. ఆ పార్టీని, దాని నేతల నిస్సిగ్గు నైజాన్ని ఎండగట్టిన ఒకే ఒక్క రాజకీయ నేత దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే.. కేసీఆర్వైపే అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. కేసీఆర్ అనైతిక రాజకీయాలు, కూటనీతి కుట్రలను పటాపంచలు చేసి.. దేశవ్యాప్తంగా నీరసించి పోయిన రాజకీయ వర్గాల్లో మళ్లీ ఒక భరోసాను నింపిన నాయకుడిగా కేసీఆర్ను ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ పండితులు కొనియాడుతున్నారు. గత కొన్నేండ్లుగా మోదీ, షాల దెబ్బకు ప్రాంతీయ పార్టీలు కుదేలయ్యాయి. సామదానభేద దండోపాయాలతో రోజు రోజుకూ బలహీనపడుతున్న పార్టీలు అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే ఆపసోపాలు పడే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీకి లొంగిపోవటమో.. రాజకీయం చేయడం మానుకోవడమో అన్న దుస్థితి నెలకొన్న దశ.
మోదీ, అమిత్ షా కుటిలనీతికి కాంగ్రెస్ కకావికలమైంది.
శరద్పవార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్ వంటి నేతలు చతికిలబడిన పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణపై తెగబడ్డ బీజేపీ ముఠాను ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టుకొని.. ఆ పార్టీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టించిన నేత కేసీఆర్. ఇవాళ దేశ రాజకీయ రంగానికి ఒక దిక్సూచిగా కేసీఆర్ మాత్రమే కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఆత్మరక్షణలో బీజేపీ
ఎనిమిదేండ్లుగా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీకి.. తెలంగాణలో కేసీఆర్ విసిరిన బ్రహ్మాస్త్రంతో ఊహించని దెబ్బ తగిలింది. మోదీ షా ద్వయం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. కేసీఆర్ వంటి నేతతో పెట్టుకోవడం అంటే ఆషామాషీ కాదని తెలిసివచ్చింది. మునుగోడు అనే కల్పిత ఉప ఎన్నికను తెచ్చి.. కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రానికే కట్టడి చేయాలని పన్నిన కుట్ర భగ్నం కావటమే కాకుండా.. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి వేసిన ఎరకు వాళ్లనే చిక్కుకొనేలా చేసి బజారున నిలబెట్టారు.
రాష్ట్ర దర్యాప్తు సంస్థలను, సీఆర్పీసీని సమర్థంగా వినియోగించి.. తమకు వెన్నెముకలా వ్యవహరిస్తూ.. వారి కుతంత్రాలను అమలుచేస్తున్న వ్యక్తికే ఉచ్చు బిగించడంతో మోదీ, షాలకు ఊపిరాడటంలేదని ఆ పార్టీ వర్గాలే అంతర్గతంగా అనుకొంటున్నాయి. దేశంలో తమను ప్రశ్నించే గొంతుక ఉండకూడదు.. ప్రతిపక్షాలు మనుగడ సాగించకూడదు. ప్రజాదరణతో ప్రత్యర్థి పార్టీలు ప్రభుత్వాలు నడుపకూడదు.. ఇలా నిలువెత్తు అహంకారాన్ని నింపుకొన్న వ్యక్తిత్వాలు.. ప్రజాస్వామ్యంపైనా, సమాఖ్య స్ఫూర్తిపైనా కనీస గౌరవం లేని కుటిల మనస్కులను నిగ్గదీసి నిలదీసే నాయకుడు వచ్చారని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయని తెలిసి కూడా.. తనను, తన పార్టీ నేతలను అష్టకష్టాలు పెడుతారని తెలిసి కూడా మడమతిప్పకుండా.. బీజేపీ కూటనీతిని ఎండగట్టిన రాజకీయ నేత కేసీఆర్ అని అంటున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా టీఆర్ఎస్లోని ఒక్క నాయకుడు కూడా కేసీఆర్ చేయి వీడకుండా.. కేసీఆర్ అడుగులో అడుగు వేస్తూ కదలటం చూసి ఆశ్చర్యపోతున్నారు. పార్టీ పట్ల, పార్టీ నాయకుడి పట్ల సహచరులకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చూసి.. నాయకుడంటే కేసీఆర్.. పార్టీ అంటే టీఆర్ఎస్ అనే పరిస్థితి నెలకొన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.
మోదీ షాలకు చెక్
తమ పన్నాగాలకు తొలిసారిగా తెలంగాణ సర్కార్ చెక్ పెట్టడంతో మోదీ, అమిత్ షా తేలు కుట్టిన దొంగల్లా నోరు విప్పకుండా మౌనం పాటించాలనుకొన్నప్పటికీ.. సాధ్యం కాలేదు. ఎక్కడో రామగుండంలో ఏడాది క్రితం పనులు మొదలుపెట్టిన ఒక కంపెనీకి కల్పిత ప్రారంభోత్సవాన్ని పెట్టుకొని.. అక్కడికి పోవడానికి ముందే.. హైదరాబాద్కు వచ్చి.. విమానాశ్రయానికే కార్యకర్తలను పిలిపించుకొని.. నర్మగర్భంగా ఆక్రోశాన్ని వెళ్ల్లగక్కి వెళ్లిపోయారు. 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధాని మోదీ, ఆయన ముఠాను ప్రజాక్షేత్రంలో కేసీఆర్ నిలబెట్టడం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
కేంద్రానికే కాదు.. రాష్ట్రానికీ అధికారాలున్నాయి
సమాఖ్య స్ఫూర్తి పాలనలో కేంద్రానికి అపరిమితమైన అధికారాలేమీ రాజ్యాంగం కట్టబెట్టలేదు. చట్టాల ముందు కేంద్రం, రాష్ట్రం రెండింటికీ అధికారాలను కల్పించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలకు ఎన్ని అధికారాలు ఉన్నాయో, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పని చేసే దర్యాప్తు సంస్థలకూ విస్తృతమైన అధికారాలను కల్పించింది. రాష్ట్రాలకు సీఆర్పీసీ చట్టం ప్రకారం అంతేస్థాయిలో అధికారాలున్నాయని మోర విరుచుకొని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు నోటీసులు జారీచేసి ఇంతవరకూ ఏ రాష్ట్రమూ చేయని పనిని చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో లభ్యమైన ఆడియో, వీడియో, కాల్ డాటా సాక్ష్యాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. చట్టం చట్రంలో నిందితులు బుకాయించడానికి ఆస్కారం లేనివిధంగా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం కృతకృత్యమైంది. ఈ ఉదంతంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే మార్గదర్శకం అయింది.
బీఆర్ఎస్.. గుణాత్మక ప్రస్థానం
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు సాధించడం కోసం భారత్ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ ప్రారంభించిన జాతీయ రాజకీయ ప్రస్థానం తెలంగాణ వేదికగానే సంచలన అడుగులు వేస్తున్నది.
కేంద్రంలో తనకు అడ్డే లేదని అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీకి చుక్కలు చూపించి బీఆర్ఎస్ రాజకీయ పంథా ఏమిటో కేసీఆర్ చేతల ద్వారానే చెప్పారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు ఏ విధంగా ఉండాలో.. ఉండబోతుందో ఒక శాంపిల్ చూపించారు. డిసెంబర్ 3 వ తేదీ తరువాత మంచి రోజులు ఉండటంతో ఇక బీఆర్ఎస్ కార్యకలాపాలు మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
నేడు దీక్షా దివస్
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏండ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు.ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును టీఆర్ఎస్ దీక్షా దివస్గా పాటిస్తున్నది. 2009 నవంబర్ 29న కరీంనగర్లోని ఉత్తర తెలంగాణభవన్ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్ బయలుదేరగా, కరీంనగర్ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తరువాత నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడే కేసీఆర్ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే ఆయన దీక్షను విరమించారు.