-స్వయంసమృద్ధి సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం
-గణనీయంగా పెట్టుబడులు, పరిశ్రమలు
-హైస్పీడ్ రైల్ నెట్వర్క్తో అద్భుతాలు..
-కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం మాట నిలుపుకోవాలి
-పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్..
-కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి భూమిపూజ

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరూ ఊహించనిరీతిలో అతికొద్ది కాలంలోనే పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని, హైదరాబాద్లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర ప్రాంతాలకు తరలిపోతారంటూ అపోహలు వ్యాప్తిచేసినవారందరి నోళ్లు మూతపడేలా పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ర్టానికి తరలివస్తున్నాయని చెప్పారు. తెలంగాణ స్వయంసమృద్ధి సాధించిన రాష్ట్రం కావాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, కొండకల్ గ్రామంలో మేధా సర్వోడ్రైవ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ గురువారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులురావు అన్న అనుమానాల మధ్య ఆ రేండ్ల క్రితం రాష్ట్రం ఆవిర్భవించిందని, కానీ నేడు రైలు బోగీలే కాదు.. హెలికాప్టర్ల విడిభాగాలు కూ డా రాష్ట్రంలో తయారవుతున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో విమానాల, అపాచి హెలికాప్టర్ల విడిభాగాలు తయారవుతున్నాయని, జహీరాబాద్లో ట్రాక్టర్లు, బస్సులు తయారవుతున్నాయని తెలిపారు. ఇప్పుడు రైలు కోచ్లు, బోగీలు, వ్యాగన్లు కూడా తయారుకానున్నాయని చెప్పారు. మూడేండ్ల క్రితం హైదరాబాద్లో మెట్రోరైలు ప్రారంభమైందని, ఆ రైళ్లను కొరియన్ కంపెనీ తయారుచేసి పంపిందని తెలిపారు. ఇప్పుడు మెట్రో రైళ్లు తెలంగాణలోనే తయారు కాబోతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.

హైస్పీడ్ రైల్తో జీవన ప్రమాణాల మెరుగు
రాష్ట్రంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు రావాలని మంత్రి కేటీఆర్ అభిలషించారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. గంటలో కరీంనగర్, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకోవచ్చని చెప్పారు. అప్పుడు హైదరాబాద్లో పనిచేసే వ్యక్తి నగరంలోనే నివసించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఆదిలాబాద్లో ఇల్లు ఉంటే అక్కడినుంచే రోజూ హైదరాబాద్ వచ్చి పనిచేసుకొని తిరిగి వెళ్లిపోవచ్చని చెప్పారు. హైస్పీడ్ రైల్ నెట్వర్క్తో అద్భుతాలు జరుగుతాయన్నారు.
‘మేధా’ వల్ల తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ
మేధా సంస్థ వల్ల తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ వచ్చిందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ బిడ్డ యుగేందర్రెడ్డి స్థాపించిన ఈ సంస్థ దేశంలోనే ప్రైవేట్రంగంలో అతిపెద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అని చెప్పారు. మేధా సంస్థ 2005లో రూ.25 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై 15 ఏండ్లకాలంలో 12 ఫ్యాక్టరీలతో నాలుగైదు ఖండాలలో విస్తరించిందని చెప్పారు. భారతీయ రైల్వే కోసం మేధా సంస్థ హైస్పీడ్ లోకోమోటివ్స్ను, కోచ్లను, వాటికి సంబంధించిన ప్రొపెల్లింగ్, సిగ్నలింగ్ వ్యవస్థలను తయారుచేస్తున్నదని తెలిపారు. మేధా సంస్థ దేశాన్ని ఆకర్షించేవిధంగా అభివృద్ధి చెందినందుకు తెలంగాణ పౌరుడిగా తాను గర్వపడుతున్నట్టు చెప్పారు. కొండకల్లో స్థాపించనున్న ఈ పరిశ్రమ కోసం టీఎస్ఏఐసీ ఇప్పటికే రైతుల నుంచి వంద ఎకరాల స్థలాన్ని సేకరించిందని, సుమారు రూ.800 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో వచ్చే మోనో రైళ్లకు మేధా సంస్థ నుంచే రైలు కోచ్లు, లోకోమోటివ్స్ రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మం దికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఏడాదికి 500 కోచ్లు, 50 లోకోమోటివ్స్ ఇక్కడ తయా రు చేయనున్నారన్నారు. మరో 18 నెలల్లోనే మొదటి (ఉత్పత్తి) యూనిట్, మొదటి కోచ్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుందామని తెలిపారు. ఇప్పటికే ఈ మేధా కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులను తయారుచేస్తుందని చెప్పారు. ‘కొండకల్, వెలిమల గ్రామాల పరిధిలో ఈ యూనిట్ను తీసుకొచ్చారు. ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకుని సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేయాలి’ అని మేధా సంస్థకు సూచించారు.
కేంద్రం చేయూతనివ్వాలి
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు. బాధనిపించి మాత్రమే చెప్తున్నాను. ఆరేండ్ల క్రితం తెలంగాణ ఏర్పడ్డనాడు కేంద్రం కాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పింది. ఆరునెలల్లో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తాం.. తప్పకుండా ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఆరేండ్లయింది.. అతీగతీ లేదు. కేంద్ర ప్ర భుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.. తెలంగాణ కొత్త రాష్ట్రం.. ప్రగతిశీల రాష్ట్రం, ప్రగతికాముక రాష్ట్రం. పురోగమన విధానాలతో ముందుకుపోతున్న రాష్ట్రం. ఈ రాష్ర్టానికి చేయూతనివ్వండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సాధ్యమైనంత త్వరగా వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి’ అని పేర్కొన్నారు.
స్థానిక యువతకు ఉపాధి
స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ఎమ్మెల్యే యాదయ్య కోరారని మంత్రి కేటీఆర్ గుర్తుచేస్తూ.. తమ ప్రభుత్వ ఆ దిశగా ఇటీవలే ఒక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. తమ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు తమకే ఉద్యోగాలివ్వాలంటూ కొన్ని రాష్ర్టాలు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నాయని తెలిపారు. కొత్తగా పరిశ్రమలు పెట్టేవారు స్థానిక యువతకు 60-70 శాతం ఉద్యోగాలు ఇస్తే.. స్కిల్ క్యాటగిరీ, సెమీ స్కిల్డ్ క్యాటగిరీలోగానీ అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని తమ ప్రభుత్వం పురోగమన వి ధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. దీనివల్ల పెట్టుబడిదారులు సానుకూలంగా స్పందించే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహన పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. చాలామంది టూ, త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తామంటూ ముందుకొస్తున్నారని తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడులకు ప్రయత్నించాలని మేధా సంస్థను కోరారు.
దేశంలోనే అతిపెద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీ: మేధా గ్రూపు ఎండీ
తాము నెలకొల్పనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రైవేటురంగంలో దేశంలోనే అతి పెద్దదని మేధా గ్రూపు ఎండీ కశ్యప్రెడ్డి చెప్పారు. ఇక్కడ కోచ్లు, మెట్రోరైళ్లు, మోనోరైళ్లు తయారవుతాయని తెలిపారు. మేధా సర్వోడ్రైవ్స్ను 1984లో హైదరాబాద్లో ఏర్పాటుచేశామని, 1990లో రైల్వే రంగంలో అడుగు పెట్టామని తెలిపారు. తమకు 7 అనుబంధ సంస్థలుసహా 12 సంస్థలు ఉన్నట్లు చెప్పారు. వీటిలో రెండు ఐరోపా, రెండు అమెరికా, రెండు దక్షిణ అమెరికా, భారత్లో ఏడు జాయింట్ వెంచర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కంపెనీల్లో 3500 మంది పనిచేస్తున్నారని, ఏకీకృత పెట్టుబడి రూ. 21వేల కోట్లని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎంపీలు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, భూపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జిల్లా పరిషత్తు చైర్పర్సన్లు తీగల అనితారెడ్డి, మంజుశ్రీ, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వైస్ చైర్మన్ వెంకటనర్సింహారెడ్డి, మేధా కంపెనీ ఈడీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా కలెక్టర్లు అమయ్కుమార్, హన్మంత్రావు, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ పాల్గొన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు రావు అన్న అనుమానాల మధ్య ఆరేండ్ల క్రితం రాష్ట్రం ఆవిర్భవించింది. కానీ నేడు రైలు బోగీలే కాదు.. హెలికాప్టర్ల విడిభాగాలు కూడా రాష్ట్రంలో తయారవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో విమానాల విడిభాగాలు, అపాచి హెలికాప్టర్ల విడిభాగాలు తయారవుతున్నాయి. జహీరాబాద్లో ట్రాక్టర్లు, బస్సులు తయారవుతున్నాయి. ఇప్పుడు రైలు కోచ్లు, వ్యాగన్లు కూడా తయారుకానున్నాయి.