-భవిష్యత్తులో ఉద్యమ పంథానే కొనసాగిస్తా -ముఖ్యమంత్రి కేసీఆరే మాకు స్ఫూర్తి -ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐఐఎం సాధించడం లక్ష్యం -మంత్రిగా అవకాశం వస్తే ఎన్నో పనులు చేసుకునేందుకు అవకాశం -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్
బోయినపల్లి వినోద్కుమార్.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించిన తొలి ఎంపీ అభ్యర్థి. కరీంనగర్ లోకసభ అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన ఆయన గడిచిన ఐదేండ్లలో అనేక అంశాల్లో కీలక పాత్ర పోషించారు. స్వరాష్ర్టానికి రావాల్సిన హక్కులు, నిధులు వంటి ఎన్నో అంశాలపై లోక్సభ వేదికగా గళాన్ని వినిపించారు. 16వ లోక్సభ చర్చల్లో అత్యధికంగా పాల్గొన్న వ్యక్తిగా పేరుగడించారు. గడిచిన ఐదేండ్లలో 106 అంశాలపై 540 ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ముద్రవేసుకున్నారు. గడిచిన ఐదేండ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు, భవిష్యతులో అనుసరించబోయే పద్ధ్దతులపై నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలను వెల్లడించారు.
గడిచిన ఐదేండ్లలో మీరు కరీంనగర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తారా? కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం చేయాలన్నది కేసీఆర్ కల. దానిని సహకారం చేస్తా. ముఖ్యమంత్రితో కలసి ప్రధాని, రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకున్న. సీఎంతో మాట్లాడి భూసేకరణ మనమే చేసి ఇవ్వడానికి, రైల్వే లైన్ నిర్మాణ వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఒప్పించి పనులు చేపిస్తున్నాము. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి చేసి లైన్ నిర్మాణానికి అప్పగించాం. సాధ్యమైనంత తొందరగా రైల్వేలైన్ పూర్తి అవుతుంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోకమాన్య తిలక్ రైలును కరీంనగర్ – ముంబై వయా నిజామాబాద్ మీదుగా వారానికి ఒకరోజు ఎక్స్ప్రెస్ రైలును నడిపే విధంగా కేంద్ర రైల్వేను ఒప్పించాను. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్ల వద్ద ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా.
2014కు ముందు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క జాతీయ రహదారి లేదు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి కరీంనగర్ చుట్టూ ఉన్న ప్రధాన రోడ్లను జాతీయ రహదారులుగా నోటిఫై చేయించాను. కరీంనగర్ను స్మార్టు సిటీగా ఎంపిక చేయించా. నిరుద్యోగ యువతీ యుకులకు శిక్షణ ఇచ్చేందుకు కరీంనగర్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశాం. ఉర్దూ భాష మాట్లాడే ముస్లింలు ఎక్కువగా ఉన్న కరీంనగర్ పట్టణంలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేశాం. శాతావాహన విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కోర్సుకు కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి ఇప్పించా. పలు ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు తీసుకువచ్చా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధికోసం చర్యలు తీసుకున్నాం.
గడిచిన ఐదేండ్లలో లోక్సభ వేదికగా మీరు లెవనెత్తిన సమస్యలు ఏమిటీ..? ప్రధానితో ఏఏ అంశాలపై చర్చించారు.? ప్రత్యేక హైకోర్టు, ఆంధ్రాలో కలిసిన ఏడు మండలాలు, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా, మైనార్టీ, ఎస్టీ, రిజర్వేషన్ల పెంపు, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, తెలంగాణలో ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు, విభజన చట్టంలో పేర్కొన్న హమీలను నెరవేర్చాలని ప్రధానితో మాట్లా డాం. అనేక తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా గళం విప్పాను. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, ఉత్తర తెలంగాణ స్థానమైన కరీంనగర్ పట్టణంలో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని కోరాను. కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలను శాశ్వత విద్యాసంస్థలుగా ఏర్పాటు చేయమని, కరీంనగర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ ఏర్పా టు, పాత కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్ వద్ద మెగా లెదర్ పార్కు ఏర్పాటు చేయాలని కోరాను. పత్తి క్వింటాలుకు రూ.5వేల మద్దతు ధర ఇవ్వాలని, ఎల్పీజీ సిలిండర్ల కొరత తీర్చాలని కోరినట్టు చెప్పారు. బీబీనగర్ కేంద్రంగా ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ఒత్తిడితెచ్చాం. ఎట్టకేలకు ఎయిమ్స్ మంజూరు చేసింది.
భవిష్యత్తులో మీరు, తోటి ఎంపీలు ఏ అంశాలపై దృష్టిపెడుతారు? ముఖ్యంగా విభజన చట్టంలోని సెక్షన్ 90 కింద పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. నీటి కరువు లేని ఆంధ్రాకు జాతీయ హోదా ఇచ్చినప్పడు నీళ్ల కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా లేకపోవడం బాధాకరం. వచ్చే లోక్సభలో సెక్షన్ 90కి సవరణ అయ్యేలా చర్యలు తీసుకుని తెలంగాణలోనూ ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించే అంశపై దృష్టిపెడుతాం. కేంద్రం జాతీయ రహదారులుగా ప్రకటించిన రహదారుల భూసేకరణ, క్షేత్రస్థాయిలో అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. తెలంగాణలో అనేక రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. వాటి అమలుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం. కరీంనగర్ డెయిరీ తరహాలోనే కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చి వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడిపరిశ్రమ పెంపుదలపై ప్రత్యేక దృష్టిపెడుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎంపీలమంతా ఒక్కతాటిపై ఉండి కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, వాటాలు, హక్కుల అంశాలపై పోరాడుతాం. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో తెలంగాణ ప్రథమ శ్రేణిలో ఉండేందుకు కృషిచేస్తాం.
ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మీరు మంత్రి హోదాలో ఉంటారని ముఖ్యమంత్రి కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే.. మీ పాత్ర ఎలా ఉండే అవకాశం ఉంది? మంత్రిగా అవకాశం వస్తే అనేక ప్రయోజనాలుంటాయి. ఏదైనా సమస్యను సాధించుకోవాలంటే ఎంపీగా మంత్రులను కలువాలి. కానీ మంత్రి స్థానంలో మనమే ఉంటే నేరుగా పనిచేసుకోవచ్చు. శరద్పవార్, లాలూ ప్రసాద్యాదవ్, మమతాబెనర్జీ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పుడు వారి శాఖలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులను వారి రాష్ట్రంలో చేసుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పనులు చేసుకునే వీలు కలుగుతుంది.రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే అవకాశం ఏర్పడుతుంది.