-సెప్టెంబర్ 2న కొంగరకలాన్లో ప్రగతి నివేదన సభ
-1600 ఎకరాల్లో బహిరంగసభాస్థలి
-దేశచరిత్రలో నిలిచేలా నిర్వహించాలి
-నేటినుంచే సభ ఏర్పాట్లలో నిమగ్నమవ్వాలి
-ఇబ్బందులు లేకుండా కమిటీలు వేసుకోవాలి
-సభకు వచ్చేందుకు ఉత్సాహంతో ప్రజలు
-మంత్రులతో సమావేశంలో సీఎం కేసీఆర్
-ఏడుగంటలపాటు సుదీర్ఘంగా కొనసాగిన భేటీ
-ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్కు వందకుపైనే అసెంబ్లీ స్థానాలు
-సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయన్న ముఖ్యమంత్రి!
-పార్టీ రాష్ట్ర కమిటీ, టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం రేపు
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగసభను సెప్టెంబర్ రెండోతేదీ సాయంత్రం నాలుగుగంటలకు హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 25 లక్షలమంది హాజరయ్యే ఈ సభ కోసం గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. దాదాపు 1600 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ఎంపికచేశామని, అందులో సభావేదిక, బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు. ఈ సభ విజయవంతానికి కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు ఉండాలని సీఎం ఆదేశించారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఏడుగంటలపాటు సాగిన ఈ సమావేశంలో.. ప్రస్తుతం నెలకొన్న కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపైనా ముఖ్యమంత్రి లోతుగా చర్చించారని సమాచారం. రైతులందరూ సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వందకు పైగా అసెంబ్లీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలన్నీ చెప్తున్నాయని సీఎం అన్నారని తెలిసింది. ప్రగతినివేదన సభ ఏర్పాట్లపై టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. తెలంగాణభవన్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశం జరుగనుంది. సంయుక్త సమావేశం ఈ నెల 17నే జరుగాల్సిన ఉన్నా, వర్షాల కారణంగా వాయిదావేసిన సంగతి తెలిసిందే.
ఏర్పాట్లు భారీగా ఉండాలి ప్రగతి నివేదన సభలో పార్కింగ్, నీటి సదుపాయం, అత్యవసర వైద్య సదుపాయం వంటి ఏర్పాట్లుచేయాలని బుధవారం నాటి సమావేశంలో సీఎం సూచించారు. సభలో చివర ఉన్నవారికి సైతం బహిరంగసభ స్పష్టంగా కనపడటానికి వీలుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలన్నారు. సభకు తరలివచ్చేవారికి ఏర్పాట్లు చేయడానికి జిల్లాలవారీగా మంత్రులు జిల్లాల ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పారు. భారీ బహిరంగసభల నిర్వహణలో టీఆర్ఎస్ గతంలో అనేక చరిత్రలను తిరుగరాసిందని చెప్తూ.. వరంగల్లో ఉద్యమ సమయంలో నిర్వహించిన భారీ బహిరంగసభను గుర్తుచేశారు. హైదరాబాద్లో నిర్వహించే సభ దానికి దీటుగా, దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్నారు. సమయం తక్కువ ఉన్నందున ఏర్పాట్లు వేగంగా చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన లక్షలమంది సభకు హాజరుకావడానికి ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారని, వారికి అవసరమైన రవాణా సదుపాయం కల్పిస్తే చాలని పేర్కొన్నారు. సభను విజయవంతం చేసేందుకు పలు కమిటీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సభావేదిక, పార్కింగ్, వాలంటీర్స్ కమిటీ, రిసెప్షన్ కమిటీ, మంచినీటి సౌకర్యం, మీడియా కమిటీ, నగర అలంకరణ, సాంస్కృతిక కమిటీ తదితరాలు ఏర్పాటు చేయనున్నారు.
రాజకీయ పరిస్థితులపైనా చర్చ సుదీర్ఘంగా సాగిన సమావేశంలో.. కేంద్రంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితలపైనా సీఎం లోతుగా చర్చించారని తెలిసింది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వందకు పైగా అసెంబ్లీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలన్నీ పేర్కొంటున్నాయని సీఎం చెప్పారని సమాచారం. పలు అంశాలపై మంత్రుల నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు, పరిస్థితులను విశ్లేషించారని తెలిసింది. ప్రజల్లో పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉందని మంత్రులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారని సమాచారం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రంలో రాజకీయ పరిణామాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై తీసుకువస్తున్న వత్తిడిని సీఎం వివరించినట్టు తెలిసింది. దీంతోపాటు వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రిజర్వాయర్లు నిండుకుండల్లా మారుతున్నాయని, ఎస్సారెస్పీకి కూడా ఆశాజనంగా నీళ్లు వస్తుండటంతో ఈ ఏడాది మంచి పంటలు పండుతాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారని సమాచారం. డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా తదితర కీలక పథకాల అమలు, ప్రజల్లో వాటిపై సానుకూలతపైనా మంత్రులతో సీఎం చర్చించినట్టు తెలిసింది. రైతులకు అవసరమైన 24 గంటల విద్యుత్ను కూడా సరఫరా చేస్తున్నందున ఈసారి పంట దిగుబడి పెరిగే అవకాశముందని అన్నట్టు సమాచారం. రైతుబంధుతో రైతులందరూ సంతోషంగా ఉన్నారని సీఎం చెప్పినట్టు తెలిసింది. మిషన్ భగీరథ ద్వారా రాబోయే దీపావళి నాటికి ఇంటింటికీ సురక్షిత నీటిని అందించేలా పనులు వేగంగా పూర్తిచేయాలని అన్నట్టు సమాచారం. రైతుబీమా కింద వెంటవెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని, కంటివెలుగుకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని సీఎం వివరించారని తెలిసింది.
అన్ని విధాలుగా అనువైన కొంగరకలాన్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్ల మున్సిపాల్టీ పరిధిలోని కొంగరకలాన్లో విశాలమైన సభాస్థలి అందుబాటులో ఉంది. నూతనంగా నిర్మిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు సమీపంలో ఈ ప్రాంతం ఉంది. శామీర్పేట, బౌరంపేట, కొంగరకలాన్ ప్రాంతాలను పరిశీలించగా.. కొంగరకలాన్లో 1600 ఎకరాలు అందుబాటులో ఉండటంతో బహిరంగసభతోపాటు అక్కడే వాహనాలు పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని దీనిని ఖరారుచేశారు. ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఉన్నందున వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి అనువుగా ఉండటంతోపాటు నగరంలో ట్రాఫిక్ జామ్లకు ఆస్కారం ఉండదనే అంచనాతో ఈ ప్రాంతాన్ని ఖరారుచేశారు. షాద్నగర్, జడ్చర్ల, తాండూరు, వికారాబాద్, చేవెళ్ల నుంచి గచ్చిబౌలి ఔటర్ మీదుగా కొంగరకలాన్కు చేరుకోవచ్చు. మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి ఘట్కేసర్ ఔటర్ మీదుగా రావిర్యాల వరకూ చేరుకునే వెసులుబాటు ఉంది. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు చేరుకోవచ్చు. ఔటర్ నుంచి కలెక్టరేట్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు వంద అడుగుల వెడల్పుతో టీఎస్ఐఐసీ అధికారులు నిర్మించారు. ఈ నేపథ్యంలో కొంగరకలాన్ అయితే రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవని భావించిన అధినేత.. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహణకు మొగ్గుచూపారు.