-ఐదంచెల వ్యూహంతో తల్లీబిడ్డలకు రక్షణ
-2014లో 30 శాతమే.. 2022లో 67%
ఒకప్పుడు సర్కారు దవాఖానలో ప్రసవం అంటే పునర్జన్మే. తల్లీబిడ్డలో ఒక్కరే బతుకుతారనే భయమే కారణం. తెలంగాణ ప్రభుత్వం 8 ఏండ్లలోనే ప్రసవాల చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. పంచతంత్ర వ్యూహంతో 2014లో 30 శాతంగా ఉన్న డెలివరీలు, 2022 జూలైనాటికి 67%కు చేరాయి. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన అంటే మునుపెన్నడూ లేని భరోసా.
గర్భవతి అయిన నాటినుంచి పోషకాహారంతోపాటు.. ప్రతిక్షణం గమనిస్తూ.. పరీక్షిస్తూ.. పురిటి నొప్పులు రాంగనే ఇంటి నుంచి దవాఖానకు తీసుకొచ్చి.. సాధారణ ప్రసవం చేయించి.. కేసీఆర్ కిట్టు ఇచ్చి.. పదిహేను వేల వరకు డబ్బులిచ్చి.. ఇంటికి క్షేమంగా చేర్చడం.. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగనిది. ఒక్క తెలంగాణలోనే.. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు.. అవీ సాధారణ ప్రసవాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ మార్పు వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఉన్నది. ఆయన మార్గదర్శకత్వంలో వైద్యారోగ్యశాఖ అనుసరించిన బహుముఖ వ్యూహమున్నది. నిశితంగా గమనిస్తే.. గర్భిణులకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరగటానికి ముఖ్యంగా ఐదు కారణాలు కనిపిస్తాయి.
వసతులు మెరుగు
మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో వసతులను మెరుగుపరిచింది. ముఖ్యంగా లేబర్ రూమ్లను ఆధునీకరించి, అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపు 600 లేబర్ రూమ్లను జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నది. కొత్త డెలివరీ టేబుళ్లు, పరికరాలు, లైట్లు, వాష్ బేసిన్లు, నల్లాలు, ఏసీ.. ఇలా అన్ని రకాల వస్తువులను అందించింది. సీహెచ్సీ, ఏహెచ్, జిల్లా దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచింది. అదనపు స్పెషలిస్టులు, సిబ్బందిని నియమించింది. అదనపు డెలివరీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. లేబర్ రూంలను కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలైన ‘లక్ష్య’, ‘కాయకల్ప’కు అనుగుణంగా తీర్చిదిద్దింది.
సిబ్బందికి శిక్షణ.. బాధ్యత
సురక్షిత ప్రసవాలపై జాతీయ ప్రమాణాల ప్రకారం రాష్ట్రంలోని అందరు డాక్టర్లు, నర్సులకు శిక్షణ ఇప్పించింది. దేశంలో మొదటిసారిగా మిడ్ వైఫరీ కోర్సును ప్రవేశపెట్టింది. నర్సులకు ఏడాది నుంచి ఏడాదిన్నరపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లో గర్భిణులకు వైద్య సాయం, కాన్పులు చేసేలా చికిత్స ఇచ్చింది. రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్, ఫెర్నాండెజ్ హాస్పిటల్ నిపుణులతో వీరికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే కొందరు మిడ్ వైఫ్లు విధుల్లో ఉండగా.. త్వరలో 133 మందికి పోస్టింగ్ ఇవ్వనున్నది. మరోవైపు.. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను ఏఎన్ఎంలు, ఆశాలకు అప్పగించింది. ఏఎన్సీ, పీఎన్సీ చెకప్లు కచ్చితంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకొన్నది. ఆశాలు దగ్గరుండి దవాఖాన చెకప్లకు, ప్రసవానికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆశ కార్యకర్తల వేతనాలనూ భారీగా పెంచింది.
ఎంసీహెచ్లు, ఎస్ఎన్సీయూల ఏర్పాటు
మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఎంసీహెచ్’లను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 26 కేంద్రాలను మంజూరు చేసింది. నిపుణులైన సిబ్బందిని నియమించింది. ప్రసవం అనంతరం నవజాత శిశువుల సంరక్షణ కోసం స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ (ఎస్ఎన్సీయూ) సంఖ్యను పెంచుతున్నది. మొత్తం 41 ఎస్ఎన్సీయూలను మంజూరు చేసింది.
ప్రసవాలు డబుల్..
రాష్ట్ర ప్రభుత్వం క్రమ పద్ధతిలో తీసుకొన్న చర్యల ఫలితంగా ప్రభుత్వ దవాఖానపై గర్భిణులకు నమ్మకం పెరిగింది. తద్వారా ఎనిమిదేండ్లలోనే ప్రసవాలు రెట్టింపు అయ్యాయి. 2014లో మొత్తం ప్రసవాల్లో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం మాత్రమే జరుగగా.. ఈ ఏడాదికి ఏకంగా 66 శాతానికి పెరిగింది. అంటే.. ప్రైవేట్ దవాఖానల కన్నా ప్రభుత్వ దవాఖానల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో 54.7 శాతం డెలివరీలు జరుగగా.. ఈ ఏడాది జూలై నాటికి ఏకంగా 66.8 శాతానికి పెరిగింది.
అమ్మ ఒడి.. ఆరోగ్య లక్ష్మి
గర్భిణులు చెకప్ల కోసం దవాఖానకు వెళ్లి, వచ్చేందుకు.. ప్రసవం కోసం వెళ్లేందుకు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో అమ్మ ఒడి (102) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. అమ్మ ఒడి వాహనాలను ఇప్పటివరకు 41 లక్షల మంది వినియోగించుకొన్నారు. మరోవైపు గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నది. స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో సమతుల్య ఆహారాన్ని అందిస్తున్నది. దీంతో వారు ఆరోగ్యంగా ఎదుగుతున్నారు.
కేసీఆర్ కిట్
గతంలో పేద మహిళలు గర్భంతో ఉన్నా తప్పనిసరిగా కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. మరికొందరు ఆర్థిక స్థోమత లేక పోషకాహారం తినలేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు. ఈ ఇబ్బందులన్నింటికీ పరిష్కారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ‘కేసీఆర్ కిట్’ పథకం రూపుదాల్చింది. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద నాలుగు విడుతల్లో నగదు సాయంతోపాటు చేస్తున్నారు.
-ప్రభుత్వ దవాఖానలో గర్భిణిగా పేరు నమోదు చేసుకొని కనీసం రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకొన్న తర్వాత రూ.3 వేలు అందజేస్తారు.
-ప్రభుత్వ దవాఖానలో ప్రసవమైన తర్వాత ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు, మగబిడ్డ పుడితే రూ.4 వేలు అందజేస్తారు. వెంటనే సుమారు రూ.2 వేలు విలువైన 16 వస్తువులతో కూడిన కిట్ను అందజేస్తారు.
-బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇవ్వాల్సిన టీకాలు తీసుకున్న తర్వాత 3 వేలు అందిస్తారు.
-10 నెలల కాలంలో టీకాలన్నీ తీసుకున్న తర్వాత చివరి విడుత రూ.2 వేలు ఇస్తారు.
-కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటివరకు 13.30 లక్షల మందికి, రూ.1,176 కోట్ల నగదును బదిలీచేశారు. మొత్తం రూ.1,387 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. కేసీఆర్ కిట్ వల్ల గర్భిణులు ఇంటివద్దే ఉంటూ పోషకాహారం తీసుకొంటున్నారు.
సగం మంది గ్రాడ్యుయేట్లు వస్తున్నారు
మా దవాఖానకు నెలకు 200 నుంచి 300 మంది గర్భిణులు వస్తున్నారు. ఇందులో సగం మంది గ్రాడ్యుయేట్లు ఉంటున్నారు. ఎం.టెక్, ఎం.కామ్ చేసిన వాళ్లు కూడా వస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగిందనడానికి ఇది నిదర్శనం. మా దవాఖానలో ప్రభుత్వం అత్యాధునిక వసతులు కల్పించింది.వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తూ.. వైద్యసిబ్బందికి సలహాలు, సూచలనలు ఇస్తున్నారు. వైద్యులకు మంచి శిక్షణ ఇప్పించారు. దీంతో క్లిష్టమైన కేసులకు కూడా ఇక్కడే డెలివరీలు చేస్తున్నాం. గతంలో కోఠి వెటర్నిటీ హాస్పిటల్ లేదా పేట్ల బుర్జు దవాఖానకు పంపించేవాళ్లం.