-ఆదర్శంగా నిలిచిన ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి షాలిని
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 12: ఒకప్పుడు సర్కార్ దవాఖానలకు వెళ్లాలంటేనే
సామాన్యులు భయపడేవారు. ఉన్నతవర్గాలవారు ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకొనేందుకు ముందుకు వస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల షాలిని. వరంగల్ జిల్లా పాపయ్యపేట చమన్ ప్రాంతానికి చెందిన ఆమె ఆర్మూర్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ప్రశాంత్ హైదరాబాద్ హయత్నగర్కు చెందిన ఓ కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. జడ్జి షాలినికి పురుటి నొప్పులు రావడంతో హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)కు వెళ్లారు. సామాన్య మహిళ మాదిరిగా వచ్చిన ఆమెకు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిపించారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సర్కార్ దవాఖానల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఇక్కడ డెలివరీ చేయించుకున్నట్టు సంతోషంగా చెప్తున్నారు జడ్జి షాలిని. జూనియర్ సివిల్ జడ్జి హోదాలో ఉన్న షాలిని ప్రభుత్వ దవాఖానలో పురుడుపోసుకోవడం అభినందనీయమని డీఎంహెచ్వో సాంబశివరావు కొనియాడారు. షాలినికి దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి, డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్ను అందజేశారు.