-ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దుతాం -వచ్చే ఏడాది టీహబ్-2, టీ వర్క్స్, ఫార్మాసిటీ ప్రారంభం -ద్రవ్యోల్బణం, నిరుద్యోగితపై కేంద్రం సమాధానం చెప్పాలి -నాకు మంత్రి పదవికన్నా పార్టీ పదవే విలువైనది -2019లో అన్ని జెడ్పీలను గెలువడం ఒక మంచి జ్ఞాపకం -నన్ను అత్యధికంగా ప్రభావితం చేసే నాయకుడు కేసీఆరే -మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తాం -ట్విట్టర్ ఆస్క్కేటీఆర్లో మంత్రి కేటీఆర్ సమాధానాలు

హైదరాబాద్ను అద్భుత నగరంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. హైదరాబాద్ నగరంలో సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రారంభమైందని, త్వరలోనే మార్పు కనిపిస్తుందని తెలిపారు. దేశంలో తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. తనకు మంత్రి పదవికన్నా పార్టీ పదవే విలువైనదని స్పష్టంచేశారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన పరిస్థితి నుంచి 2019లో మంత్రిస్థాయిలో పాలన వరకు పరిణామక్రమాన్ని ‘టెన్ ఇయర్స్ చాలెంజ్’ అంటూ అభివర్ణించారు. 2019లో రాష్ట్రంలోని అన్ని జెడ్పీలను టీఆర్ఎస్ గెలుచుకోవడం ఒక మంచి జ్ఞాపకమని తెలిపారు. పౌరులకు అనేక ప్రయోజనాలు కల్పించే నూతన మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తామని స్పష్టంచేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా దాదాపు గంటన్నరపాటు సాగిన ‘ఆస్క్కేటీఆర్’లో పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ప్రభుత్వ ప్రాథమ్యాలు, పార్టీ కార్యక్రమాలు, వ్యక్తిగత అంశాలు, అభిరుచులు, సమకాలీన రాజకీయ పరిస్థితులు ఈ చర్చలో చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమం ట్విట్టర్ ట్రెండింగ్లో టాప్లో నిలిచింది. కేటీఆర్కు ట్విట్టర్లో దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మరింత ఆకర్షణీయంగా హైదరాబాద్ పర్యాటకపరంగా హైదరాబాద్ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేటుసంస్థలకు అప్పగించామని, చార్మినార్ గోల్కొండ పర్యాటకక్షేత్రాలకు ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారికి మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. హైదరాబాద్లో చేపట్టిన ఎస్సార్డీపీ ప్రాజెక్టులకు నిధులకొరత లేదని, భవిష్యత్కు అవసరమైన మౌలికవసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్లో 50 ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, స్కైవాక్స్ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు. ఈ-బీఆర్టీఎస్ పద్ధతిలో కూకట్పల్లి- హైటెక్సిటీ -గచ్చిబౌలి ప్రాంతాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందని చెప్పారు. పాతబస్తీకి కూడా మెట్రోరైలు వస్తుందని తెలిపారు.
ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్లో తాగునీటి కొరత చాలా తక్కువగా ఉన్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత నీటి సరఫరా కొరత ఉండదని తెలిపారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకువెళ్లేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. నగరంలో ఎంఐఎంతోపాటు ఆర్ఎస్ఎస్లాంటి సంస్థలకు సభలు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. 111 జీవో గురించి స్పందిస్తూ.. ఇందులో ఏదైనా మార్పుచేర్పులు అవసరమైతే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డులేదని, దీన్ని నూతన రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామని చెప్పారు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిందని, మరో మూడు ఫ్లైఓవర్లు వస్తాయన్నారు. వరంగల్ కుడా మాస్టర్ప్లాన్ జనవరి మొదటివారంలో ఉంటుందని వెల్లడించారు. నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మున్సిపల్ అధికారుల విచక్షణతో సంబంధంలేకుండా ప్రజల అవసరాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు తన మున్సిపల్ శాఖ అధికారులతో నూతన చట్టాన్ని కఠినంగా అమలుచేస్తామని చెప్పారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, వాటి ఫలాలు త్వరలో చూస్తారని మంత్రి తెలిపారు.
శాంతియుత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే శాంతియుతమైనదని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం, విద్యతోపాటు పట్టణ, గ్రామీణ మౌలికవసతుల రంగాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశమున్నదని తెలిపారు.
తెలంగాణ ప్రజలు తెలివైనవారు ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైనవారు తెలంగాణ ప్రజలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా బలోపేతంకావడానికి హిందు-ముస్లిం కమ్యూనల్ కార్డును వాడుతున్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం లేకున్నా రాష్ట్రంలో టీఆర్ఎస్కు 60 లక్షలమంది కార్యకర్తలున్నారని, వారిద్వారా ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటామని తెలిపారు.
ప్రజలను పక్కదారి పట్టిస్తున్న కేంద్రం చర్యలు పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కుంటుపడుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాల్లో కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.
2020లో టీహబ్-2 టీహబ్ రెండోదశ, టీ వర్స్క్ 2020 మొదటి అర్ధసంవత్సరంలో పూర్తవుతాయని, ఫార్మాసిటీ ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతర్జాతీయస్థాయి తయారీరంగ కంపెనీలను హైదరాబాద్కు తీసుకువస్తామని, ఇప్పటికే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని వివరించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్గ్రోత్ అనే ‘త్రీ ఐ’ మంత్రాలను తమ ప్రభుత్వం పాటిస్తున్నదని చెప్పారు. పట్టణాభివృద్ధితోపాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
జగన్ ఆరునెలల పాలన మంచి ప్రారంభం రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందని కామెంట్ చేసిన పలువురు ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో టీఆర్ఎస్ పోటీచేయాలని కోరడం, ఆ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నడిపించడం సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరునెలల పాలన మంచి ప్రారంభమని వ్యాఖ్యానించారు. ఏపీ మూడు రాజధానుల అంశం అక్కడి ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.
మంత్రిపదవికన్నా పార్టీ పదవే విలువైనది తనను రాజకీయంగా అత్యధికంగా ప్రభావితం చేసే నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తల కృషివల్లనే తనకు మంత్రిపదవి దక్కిందన్నారు. మంత్రిపదవి కన్నా పార్టీపదవే తనకు విలువైనదని స్పష్టంచేశారు. 2019లో అన్ని జిల్లా పరిషత్తులను టీఆర్ఎస్ గెలుచుకోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పారు. ప్రజల స్పందన సోషల్ మీడియా ద్వారా నేరుగా తెలుస్తుందని, తనపై మర్యాదపూర్వకమైన మీమ్లు (హాస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సినిమాల్లో నటించి సామాజిక సందేశం ఇవ్వాలని ఒక నెటిజన్ కోరడంపై కేటీఆర్ స్పందిస్తూ.. తనకు ఫుల్ టైం జాబ్ ఉన్నదని వ్యాఖ్యానించారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని తెలిపారు. ప్రస్తుతతరం నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నదని, ప్రపంచంతో కనెక్ట్ అయిందని, ఎంటర్ప్రెన్యూరల్ లక్ష్యాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాజకీయాలు, ఆర్థికవ్యవస్థను బ్యాలెన్స్ చేయడం అతిపెద్ద సవాల్గా అభివర్ణించారు. ఇప్పటికే దాదాపు అందరు మంత్రులు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారని తెలిపారు.