Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీమ లిఫ్టును ఆపాలి

-రాయలసీమ ఎత్తిపోతలతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీరని నష్టం
-పాలమూరు-రంగారెడ్డికి అనుమతివ్వండి
-త్వరగా నీటి కేటాయింపులు పూర్తి చేయండి
-అప్పటి వరకూ గెజిట్‌ అమలును నిలపండి
-కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్‌ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, కృష్ణా జలాల వినియోగంపై ఏపీతో నెలకొన్న వివాదాలు, అందుకు కారణాలను, వాస్తవ పరిస్థితులను వివరించారు. అదేవిధంగా కరువు ప్రాంతమైన పాలమూరును సస్యశ్యామలం చేయడానికి, ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని విజ్ఞప్తిచేశారు.

ఆ ప్రాజెక్టుకు కృష్ణాలో నికర జలాలు కేటాయించాలని కోరారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికార పరిధిని నిర్దేశిస్తూ ఇటీవల విడుదలచేసిన గెజిట్‌ అమలును బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేసేంతవరకూ వాయిదా వేయాలని కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ర్టాలు ఉమ్మడిగా వినియోగించుకుంటున్న ప్రాజెక్టులను మాత్రమే రివర్‌ బోర్డుల పరిధిలోకి తేవాలని, మిగిలిన వాటిని గెజిట్‌లో నుంచి మినహాయించాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన సీఎం కేసీఆర్‌ వెంట పాలమూరు ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు.

జల్‌జీవన్‌ మిషన్‌ పకడ్బందీ అమలుకు సీఎం సలహాలు..
తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్నట్టుగానే.. కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా హర్‌ ఘర్‌ జల్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాని అమల్లో అనేక సవాళ్లు ఎదురవుతుండగా, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌తో కేంద్రమంత్రి చర్చించారు. మిషన్‌ భగీరథను తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ను పకడ్బందీగా అమలుచేసేందుకు సలహాలను స్వీకరించారు. అనంతరం ఇదే విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా కేంద్రమంత్రి వెల్లడించారు. తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో భేటీ చాలా ఉత్సాహవంతంగా సాగిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు.

40 నిమిషాలపాటు సుదీర్ఘ చర్చ
కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ 40 నిమిషాలకుపైగా భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు చెందిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించారు. గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల అనుమతుల అంశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల ప్రయోజనాలు, వాటి ఆవశ్యకతను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డుల గెజిట్‌, జల్‌జీవన్‌ మిషన్‌పైనా తన అభిప్రాయాలను తెలిపారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.