– ఎంఓయూపై ట్రిపుల్ ఐటీ,ఐఎస్బీ, నల్సార్ సంతకాలు – ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఐటీ ఇంక్యుబేటర్ ఏర్పాటు – వైఫై నగరంగా హైదరాబాద్: ఐటీ మంత్రి కేటీఆర్

ఐటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యం, మార్కెటింగ్, న్యాయపరమైన విషయాల్లో తోడ్పాటు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఐఎస్బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్సింగ్, ఐఐఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్, ఐఎస్బీ డీన్ అజిత్ అరుణాకర్, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ముస్తఫా ఎంఓయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో అతిపెద్దదైన టీ-హబ్ ఇంక్యుబేటర్ను ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 80 వేల చదరపు గజాల్లో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంపిక చేసిన మూడువేల మంది విద్యార్థులకు మరో ఆరునెలల్లో ఇంక్యుబేటర్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే రెండేండ్లలో మూడు లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ప్రభుత్వం సొంతంగా భవనాన్ని ఏర్పాటు చేసి 1500 మంది ఔత్సాహిక ఐటీ కంపెనీలకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ ఎలక్ట్రానిక్ కంపెనీ ముందుకొచ్చిందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్లో 4జీ సేవలను అందించడంతో పాటు, వైఫై నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు విస్తరణపై కేంద్రం నుంచి మరికొంత స్పష్టత రావాల్సి ఉందని, దీనిపై త్వరలోనే కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ప్రసాద్తో భేటీ అవుతానని ఆయన వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూపొందించే కొత్త ఆవిష్కరణలకు ట్రేడ్, పేటెంట్ హక్కుల కల్పన కోసం అవసరమైన న్యాయసహాయం చేస్తామని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ముస్తఫా తెలిపారు.