-సింగరేణిలో గులాబీ సూరీళ్ల జైత్రయాత్ర -ఇంటిసంఘానికే మళ్లీ గుర్తింపు హోదా -తొమ్మిది డివిజన్లలో టీబీజీకేఎస్ గెలుపు -సీఎం కేసీఆర్, ఎంపీ కవితల వెంటే కార్మికులు -కూటమి కట్టినా.. మట్టికరిచిన ప్రత్యర్థులు -ముందే సంకేతాలిచ్చిన భారీ పోలింగ్
ఊహించినట్టే జరిగింది. తెలంగాణ అన్నం గిన్నె సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోతున్నది. కార్మికులంతా సీఎం కేసీఆర్, ఎంపీ కవితల వెంటే నిలిచారు. భారీగా నమోదైన పోలింగ్ టీబీజీకేఎస్ విజయాన్ని కౌంటింగ్కు ముందే తేల్చింది. టీబీజీకేఎస్కు కనీసం దరిదాపుల్లో కూడా ప్రత్యర్థివర్గం నిలవలేకపోయింది. సింగరేణి కార్పొరేట్లో కూడా గులాబీ జెండా తొలిసారి సగర్వంగా రెపరెపలాడింది. సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్ల్లో కార్మికవర్గం ప్రభుత్వ విధానాలను బలంగా సమర్థిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్పై విశ్వాసాన్ని, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై భరోసాను వ్యక్తం చేసింది. మొత్తం పోలైన 49873 ఓట్లలో టీబీజీకేఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.కడపటి వార్తలు అందే సమయానికి కార్పొరేట్ సహా ఎనిమిది డివిజన్లలో టీబీజీకేఎస్ విజయాన్ని సాధించింది. రెండు డివిజన్లలో ఏఐటీయూసీ ఆధిక్యంలో ఉన్నది. ప్రత్యర్థి పార్టీలు, సంఘాలు గతంలో చేసిన అన్యాయాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు ఈ దఫా ఎన్నికల్లో కార్మికులు తిరుగులేని సమాధానమిచ్చారు. సిద్ధాంతాలు, నైతిక విలువలకు పాతరేసిన ప్రధాన సంఘాలన్నీ మిలాఖత్ అయి తీవ్రంగా ప్రయత్నించినా, భూపాలపల్లి డివిజన్లో తప్ప మరెక్కడా సోదిలోకి లేకుండా పోయాయి. గురువారం ఉదయం సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముందుగా మందకొడిగా సాగినా ఆ తర్వాత పుంజుకున్నది. సాయంత్రం పోలింగ్ ముగిసేసరికి 94.93శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 52,534 ఓట్లలో 49,873 ఓట్లు పోలయ్యాయి.
సింగరేణి భవన్తో శుభారంభం సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఉన్న అవ్యాజమైన ప్రేమ, ఆప్యాయతకు సింగరేణి కార్మికులు ముగ్ధులయ్యారు. ఆ ఫలితం గురువారం నాటి ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. కార్పొరేట్ కార్యాలయంలో భాగంగా హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్లో ఆ ప్రభావం మొదటిసారిగా కనపడింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రభంజనం సింగరేణి భవన్ నుంచే ప్రారంభమయ్యింది. శుభారంభమే అదిరింది.
సింగరేణి భవన్లో మొత్తం 86 ఓట్లకుగాను.. 84 ఓట్లు పోలవ్వగా.. టీబీజీకేఎస్కు 77 ఓటు ్ల రావడం గమనార్హం. ఇక ప్రత్యర్థులైన ఏఐటీయూసీకి 4, సీఐటీయూకు 2, బీఎంఎస్కు ఒక్క ఓటు దక్కాయి.
ఇల్లెందుతో బోణీ సాయంత్రం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచే టీబీజీకేఎస్ హవా కొనసాగుతూ వచ్చింది. టీబీజీకేఎస్కు తొలి కానుక ఇల్లెందు డివిజన్ అందించింది. ఇక్కడ పోలైన మొత్తం 1095ఓట్లలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి 617 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఏఐటీయూసీకి 400 ఓట్లు వచ్చాయి. 217 ఓట్ల మెజార్టీతో(19.81శాతం) ఇక్కడ టీబీజీకేఎస్ ఘనవిజయం సాధించింది. మెజారిటీ కార్మికులు బాణం గుర్తుపై నమ్మకం ఉంచారని స్పష్టమయ్యింది.
కార్పొరేట్లోనూ పాగా కొత్తగూడెంలోని కార్పొరేట్ కార్యాలయంలో మొదటిసారిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయకేతనం ఎగరేసింది. హైదరాబాద్లోని సింగరేణిభవన్లో పోలైన ఓట్లతో కలిపి ఇక్కడ మొత్తం 1475 ఓట్లకుగాను 1415 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్కు 866 ఓట్లు రాగా, ఏఐటీయూసీకి 322 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ టీబీజీకేఎస్ 544 ఓట్ల మెజార్టీతో గెలిచింది.
కొత్తగూడెంలో తిరుగులేని ఆధిక్యం
కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్ మొదట్నుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం పోలైన ఓట్లలో ఇంటి సంఘానికి 2011 ఓట్లు పోలవగా, ఏఐటీయూసీకి 1200 ఓట్లు లభించాయి. ఇక్కడ టీబీజీకేఎస్కు 811ఓట్ల మెజార్టీ లభించింది.
మణుగూరులో గులాబీ జెండా
మణుగూరు డివిజన్లో మొత్తం పోలైన ఓట్లలో టీబీజీకేఎస్ 1623ఓట్లను గెలుచుకుంది. ఏఐటీయూసీకి 992 ఓట్లు పోలయ్యాయి. ఈ డివిజన్లో టీబీజీకేఎస్ 631 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించింది.
బెల్లంపల్లిలో హవా బెల్లంపల్లి డివిజన్లో పోలైన మొత్తం ఓట్లలో టీబీజీకేఎస్ 862 ఓట్లు గెలుచుకోగా ఏఐటీయూసీకి 688 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీబీజీకేఎస్ 174 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
శ్రీరాంపూర్ టీబీజీకేఎస్దే శ్రీరాంపూర్ డివిజన్లో ఇంటిసంఘం 2243 ఓట్ల భారీ మెజార్టీతో ఏఐటీయూసీపై ఘనవిజయం సాధించింది. ఇక్కడ పోలైన 11265 ఓట్లలో టీబీజీకేఎస్కు 6189 ఓట్లు రాగా, ఏఐటీయూసీకి 3916 ఓట్లు పోలయ్యాయి.
రామగుండంలో గెలుపు రామగుండం 1వ డివిజన్లో టీజీబీకేఎస్ 2497 ఓట్లు సాధించి గెలుపొందింది. ఏఐటీయూసీకి 2151 ఓట్లు పోలయ్యాయి. రామగుండం రెండో డివిజన్లో టీబీజీకేఎస్ 1827 ఓట్లు గెలుచుకోగా, ఏఐటీయూసీకి 1061 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 895 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఇక 3వ డివిజన్లో 153 ఓట్ల మెజార్టీతో టీబీజీకేఎస్ గెలిచింది.