సార్వత్రిక ఎన్నికల్లో కారు మిగతా పార్టీలన్నిటినీ దాటి భారీ మెజారిటీ దిశగా సాగుతోంది. MLA, MP స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులు విజయం దిశగా పయనిస్తున్నారు.
నిన్నటిదాకా గప్పాలు కొట్టిన అనేక కాంగ్రెస్ నేతల ఓటమి ఖాయమవుతోంది.
. భువనగిరిలో బుర్ర నర్సయ్యగౌడ్ గెలుపు నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లాలో టీఆర్ఎస్ పాగా వేసింది. భువనగిరి లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర నర్సయ్య గౌడ ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఓడించారు.
. మహబూబ్నగర్లో జైపాల్రెడ్డి ఓటమి మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి ఓటమిపాలయ్యారు. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.
. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో కనకారెడ్డి గెలుపు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో గులాబీ జెండా ఎగిరింది. టీఆర్ఎస్ అభ్యర్థి కనకారెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.
. మహబూబాబాద్ ఎంపీగా సీతారాం నాయక్ గెలుపు వరంగల్ జిల్లా మహబూబాబాద్ లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ పాగా వేసింది. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాం నాయక్ విజయం సాదించారు.ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్పై గెలుపొందారు.
. గన్పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళి తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు అమరవీరులను స్మరించుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ గులాబీ దళపతి కేసీఆర్ గన్పార్క్ వెళ్లి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. గన్పార్కుకు చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు జైతెలంగాణ నినాదాలతో హెరెత్తించారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుతామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా…తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరిచిపోలేనివని కేసీఆర్ స్మరించుకున్నారు. అంతకు ముందు ఆయన తెలంగాణభవన్లో విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వ తొలి కేబినెట్ మీటింగ్లో అమరవీరులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.
. తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు : కేసీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్ను గెలిపించిన నాలుగున్నర కోట్ల ప్రజలందరికీ కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. యావత్ తెలంగాణ ప్రజానీకానికి శిరస్సువహించి నమస్కరిస్తున్నానని చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమ మీద పెట్టిన బాధ్యతను పూర్తి నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు గర్వం పనికి రాదన్నారు.
. రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం: కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. ఈ సందర్బంగా టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు టీఆర్ఎస్ఎల్పీ భేటీ రేపు జరుగనుందని ఆపార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి పార్టీ తరపును గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
. మీడియా సహకారం కొనసాగాలి: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మీడియా పాత్ర ఇలాగే కొనసాగాలని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించిన సందర్బంగా ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా ఘననీయ సహకారం అందించిందని, వారికి పార్టీ తరపున తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మీడియా సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. మీడియా మిత్రులు సలహాలు ఇవ్వాలని కోరారు.
. మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తాం: కేసీఆర్ తెలంగాణ ప్రజలు తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి అధికారం కట్టబెట్టినందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కతజ్ఞతలు తెలిపారు. ఇవాళ తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా తాము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం పార్టీ మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామన్నారు.
. రసమయి బాలకిషన్ గెలుపు కరీంనగర్ జిలా మానకొండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గెలుపొందారు. 46,488 ఓట్ల మెజార్టీతో రసమయి విజయం సాధించారు.
. తెలంగాణ భవన్ వద్ద సంబురాలు సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించన సందర్బంగా తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణభవన్ వద్దకు చేరుకున్న వేలాది కార్యకర్తలు పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. జైతెలంగాణ నినాదాలు చేస్తూ ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్కు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి దండం పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కేసీఆర్కు స్వాగతం పలికారు.
. తుంగతుర్తిలో గాదరి కిషోర్ గెలుపు నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్పై గాదరి కిశోర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
. నిజామాబాద్ ఎంపీగా కవిత విజయం నిజామాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. లక్షా 80 వేల ఓట్ల మెజార్టీతో కవిత విజయ ఢంకా మోగించారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ ఓడిపోయారు.
. మర్రి జనార్ధన్రెడ్డి, ఆలే వెంకటేశ్వరరెడ్డి గెలుపు పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. నాగర్కర్నూలులో మర్రి జనార్ధన్రెడ్డి గెలుపొందగా, దేవరకద్రలో ఆలే వెంకటేశ్వరరెడ్డి విజయం సాధించారు. ఇప్పటికే కొల్లాపూర్, షాద్నగర్లో కూడా టీఆర్ఎస్సే గెలిచింది.
. ఆదిలాబాద్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి విజయం ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్ గెలుపొందారు. 1,67,571 ఓట్ల మెజార్టీతో నగేష్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఓడిపోయారు.
. పెద్దపల్లిలో వివేక్ ఓటమి… బాల్కసుమన్ గెలుపు.. పెద్దపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ ఘోరంగా ఓడిపోయారు. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్ విజయ ఢంకా మోగించారు. బాల్కసుమన్ 2,10,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ విజయం కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ విజయం సాధించారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. 2 లక్షల 3 వేల ఓట్ల మెజార్టీతో వినోద్ గెలుపొందారు.
. షాద్నగర్లో టీఆర్ఎస్ గెలుపు పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. షాద్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్ విజయం సాధించారు.
. కొల్లాపూర్లో జూపల్లి కష్ణారావు గెలుపు పాలమూరు జిల్లా కొల్లాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కష్ణారావు గెలుపొందారు. కష్ణారావు 10,856 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్రెడ్డి ఓటమి పాలయ్యారు.
. టీఆర్ఎస్ 50.. కాంగ్రెస్ 10.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 50 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 6, ఎంఐఎం 2, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. మరో 13 స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10, టీడీపీ 18, ఎంఐఎం 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
. వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి విజయం వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించారు. 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ నేత రాజయ్య ఓటమి పాలయ్యారు.
. తెలంగాణ భవన్లో విజయోత్సవాలు తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. 119 స్థానాలకు గానూ ఇప్పటి వరకు 45 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. మరో 20 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో పార్టీ అభిమానులు బాణా సంచా కాల్చి తెలంగాణ పాటలకు స్టెప్పులేస్తున్నారు. మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
. ఘోర పరాజయం పాలైన జగ్గన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 29 వేల 500 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
. సూర్యాపేటలో జగదీశ్వర్రెడ్డి విజయం సూర్యాపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్రెడ్డి గెలుపొందారు. జగదీశ్వర్రెడ్డి గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
. సిద్ధిపేటలో హరీష్రావు విజయం మెదక్ జిల్లా సిద్ధిపేటలో హరీష్రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 93,350 ఓట్ల మెజార్టీతో హరీష్ గెలుపొందారు. సిద్ధిపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు సందడి చేస్తున్నారు.
. పద్మారావు గెలుపు.. జయసుధ ఓటమి.. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత జయసుధ ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి కత్తి పద్మారావు గెలిచారు. మెదక్ ఎంపీ స్థానంలో కూడా టీఆర్ఎస్ హవానే కొనసాగుతోంది.
. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బోణీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ గెలుపొందారు.
. లక్షా 34 వేల ఆధిక్యంలో బాల్కసుమన్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాల్కసుమన్ లక్షా 34 వేల ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
. 19,391 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ గెలుపు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయపతాకాన్ని ఎగురవేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 19,391 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి ఓటమి నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ గెలిచారు. టీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
. మంథనిలో శ్రీధర్బాబు ఓటమి కరీంనగర్ జిల్లా మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్బాబు ఓటమి పాలయ్యారు. శ్రీధర్బాబుపై టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు 16,800 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీధర్బాబు ఓడిపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు.
. లక్షా 20 వేల ఆధిక్యంలో కవిత నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత లక్షా 21 వేల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
. ఈటెల రాజేందర్ గెలుపు హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ విజయదుందుభిని మోగించారు.
. వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ గెలుపొందారు.
. టీఆర్ఎస్ అభ్యర్థులు రాజయ్య, ప్రభాకర్రెడ్డి గెలుపు నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్లో తాటికొండ రాజయ్య గెలుపొందారు. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
. కోమటిరెడ్డి ఓటమి… నర్సయ్యగౌడ్ గెలుపు.. నల్లగొండ జిల్లాలో భువనగిరి ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ విజయం సాధించారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమి చవి చూశారు.
. హుస్నాబాద్లో టీఆర్ఎస్ విజయం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్కుమార్ గెలుపొందారు. 34,000 ఓట్ల మెజార్టీతో సతీష్ విజయం సాధించారు.
. పొన్నాల లక్ష్మయ్య ఓటమి.. యాదగిరిరెడ్డి గెలుపు.. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఘోరంగా ఓడిపోయారు. పొన్నాలపై టీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరిరెడ్డి గెలుపొందారు. పొన్నాల ఓడిపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
. దామోదర ఓటమి.. బాబుమోహన్ గెలుపు.. ఆందోల్లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి బాబు మోహన్ గెలుపొందారు. దామోదరపై 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
. లోక్సభ ఫలితాల్లో బోణీ కొట్టిన టీఆర్ఎస్ లోక్సభ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి భారీ మెజార్టీతో గెలుపొందారు. లక్షా 24 వేల ఓట్ల మెజార్టీతో కడియం గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య ఓటమి పాలయ్యారు.
. వర్ధన్నపేటలో టీఆర్ఎస్ గెలుపు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో టీఆర్ఎస్ గెలుపొందింది. వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆరోరి రమేశ్ విజయం సాధించారు. 53 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
. బసవరాజు ఓటమి.. కొండా సురేఖ గెలుపు.. వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా సురేఖ విజయం సాధించారు. 47 వేల ఓట్లకు పైచిలుకు ఆధిక్యంతో కొండా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజు సారయ్య ఓటమి చవిచూశారు.
. దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం మెదక్ జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి 25 వేల ఓట్లకు పై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి ఓడిపోయారు.
. విజయశాంతి ఓటమి.. పద్మాదేవేందర్రెడ్డి గెలుపు.. మెదక్ ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి గెలుపొందారు. పద్మాదేవేందర్రెడ్డి 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
. మాజీ మంత్రి సునీతాలక్ష్మా రెడ్డి ఓటమి మెదక్ జిల్లా నర్సాపూర్లో మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సీహెచ్ మదన్రెడ్డి 5000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
. సిరిసిల్లలో కేటీఆర్ గెలుపు సిరిసిల్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ గెలుపొందారు. 40 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కేటీఆర్ అభిమానులు ఉత్సహంతో, డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
. ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీత గెలుపు నల్లగొండ జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత గెలుపొందారు. ఆలేరులో టీఆర్ఎస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
. లక్షా 24 వేల ఆధిక్యంలో కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయ ఢంకా మోగించనున్నారు. ఇప్పటి వరకు లక్షా 24 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే స్థానంలో కూడా కేసీఆర్ ముందంజలో ఉన్నారు.