– ఆత్మగౌరవ పాలన కోసమే ఎమ్మెల్సీ ఎన్నికలు – బీజేపీ, కాంగ్రెస్లకు డిపాజిట్ దక్కొద్దు: హోంమంత్రి నాయిని – దేవీప్రసాద్ను ఆశీర్వదించండి: మంత్రి కేటీఆర్ – భారీ మెజార్టీతో గెలిపించండి: అభ్యర్థి దేవీప్రసాద్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్కు మద్దతుగా ప్రచారం జోరుగా సాగుతున్నది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్లో రాష్ట్ర మంత్రులు ప్రచారం నిర్వహించారు. మదీనాగూడా, కేపీహెచ్బీ కాలనీ, గాజులరామారంలో మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్రెడ్డి, భానుప్రసాద్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, హయత్నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఉద్యమనాయకుడు దేవీప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అత్మగౌరవ పాలన కోసమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నవారంతా తెలంగాణ బిడ్డలేనని స్పష్టంచేశారు. రవాణా మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన అంశాలతో పాటు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకుసాగుతున్నారన్నారు. కేసీఆర్ పనితీరుకు మద్దతుగా పట్టభద్రులంతా టీఆర్ఎస్కు ఓటెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఈ పోరు ఆత్మగౌరవ పాలనకు సంభందించిన సమరమన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడంకులు సృష్టించిన చంద్రబాబు సారథ్యంలో పోటీకిచేస్తున్న బీజేపీ, 1200 మంది యువకుల బలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. వేణుగోపాలచారి మాట్లాడుతూ టీఆర్ఎస్ సారథ్యంలోని కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాడిన నాయకుడు దేవీప్రసాద్ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవటం కనీస భాద్యతన్నారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు, ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్ను పట్టభద్రులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాటలు కాదు చేతలను గమనించి పట్టభద్రులు దేవీప్రసాద్ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్ని రంగాలపై పూర్తిగా స్పష్టత ఉందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో హైదరాబాద్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదన్నారు. విద్యత్ సమస్య తీర్చి, 4 ఏండ్లలో రక్షిత మంచినీటిని ఇంటింటికీ అందించేందుకు, 46వేల చెరువు కుంటలను బాగుచేసేందుకు, ప్రతి గ్రామానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసిందన్నారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపనడేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్రెడ్డి మాట్లాడుతూ న్యాయం కోసమే పుట్టింది తెలంగాణ ఉద్యమమని, ఉద్యమ నాయకుడు దేవీప్రసాద్ను గెలిపించాలన్నారు.
కంటోన్మెంట్ పెరల్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు విచక్షణతో ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, పుట్ట మధు, విఠల్రెడ్డి, రాథోడ్ బాబూరావు, బొడిగె శోభ, గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు ప్రచారంలో పాల్గొన్నారు.
దేవీప్రసాద్కు పలు సంఘాల మద్దతు దేవీప్రసాద్కు అన్నివర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం అధ్యక్ష, ప్రధాక కార్యదర్శులు రామకృష్టారెడ్డి, శ్యామప్రసాద్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు మద్దతిస్తున్నట్లు దళిత గ్రాడ్యుయేట్స్ ఫోరం అధ్యక్షుడు అన్నిమళ్ల శంకర్ తెలిపారు.