-ప్రాణనష్టం ఉండొద్దు.. పంటనష్టం జరుగొద్దు -ఇతర నష్టాలు పూడ్చుకోవచ్చు.. ప్రాణాలు తిరిగి తేలేం -రాబోయే మూడు, నాలుగు రోజులు చాలాముఖ్యం -నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్షీట్ తయారుచేయాలి -ఫ్లడ్ మేనేజ్మెంట్పై పాలసీని రూపొందించాలి -భద్రాచలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు -మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు -దగ్గరుండి సహాయ చర్యలు పర్యవేక్షించాలి -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశం -వర్షాలు, వరదలపై ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తుతుండగా, మరో మూడు నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడటమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టంచేశారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. సహాయ చర్యల ఖర్చుకు వెనుకాడవద్దని, అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతిరోజూ నివేదిక తెప్పించుకొని, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, విద్యుత్ డిమాండ్లో భారీ వ్యత్యాసం వచ్చినా గ్రిడ్ ఫెయిల్ కాకుండా సమర్థవంతంగా వ్యవహరించిన విద్యుత్శాఖను సీఎం అభినందించారు. హైదరాబాద్తోపాటు ఇతర నగరాల్లో భారీ నష్టం కలుగకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్శాఖను కూడా ప్రశంసించారు. రాష్ట్రంలో వానలు, వరదలు, వాటివల్ల తలెత్తిన పరిస్థితిపై సీఎం సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జలవనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయం, రహదారులు – భవనాలు తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. జిల్లాలవారీగా పరిస్థితిని అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు వరదల ఉద్ధృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు.
మిషన్ కాకతీయతో చెరువు కట్టలు పటిష్ఠం భారీ వర్షాలు పడుతున్నా చెరువులకు గండ్లు పడకపోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో దాదాపు అన్ని చెరువులు నిండి, అలుగు పోస్తున్నాయి. మిషన్ కాకతీయ వల్ల చెరువు కట్టలు పటిష్ఠంగా మారాయి. గతంలో ఇలాంటి వర్షాలు వస్తే వేలసంఖ్యలో చెరువు కట్టలు తెగేవి.. బుంగలు పడేవి. కానీ ఇప్పుడు చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగింది. కట్టలు పటిష్ఠమయ్యాయి. మిషన్ కాకతీయలో చేపట్టని కొన్ని కుంటలకు మాత్రమే నష్టం వాటిల్లింది. రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు పడి చెరువులకు వరద వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ప్రతి చెరువునూ నిత్యం గమనిస్తూ ఉండాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్అలీ, కే తారకరామారావు, నిరంజన్రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, కార్యదర్శులు భూపాల్రెడ్డి, స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, డీజీపీ మహేందర్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్రెడ్డి, జలవనరుల ముఖ్యకార్యదర్శి రజత్కుమార్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు, పురపాలకశాఖ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్, టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఈఎన్సీ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.
భారీగా వరదలు వచ్చే అవకాశం ‘గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయి. అన్ని జలాశయాలకు నీరు వస్తున్నది. నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉన్నది. కానీ రాబోయే మూడునాలుగు రోజులు కూడా చాలా ముఖ్యం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు నెలకొన్న ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. దీనికితోడు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణాలన్నింటివల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడి, పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనావేసి అందుకు తగినట్లు ఏర్పాట్లుచేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన ముఖ్య విషయాలు: ఎంత విపత్తు వచ్చినా సరే ప్రాణనష్టం నివారించలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇతరత్రా నష్టాలు సంభవిస్తే ఏదోలా పూడ్చుకొనే అవకాశం ఉన్నది. కానీ, ప్రాణాలు తిరిగి తేలేము. కాబట్టి విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడటమే అత్యంత ప్రధానమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. దానికి అనుగుణంగా పనిచేయాలి. వాతావరణం బాగా లేదు కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా, ముంపు ప్రమాదం ఉన్నా వెంటనే అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలి. కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. కాజ్వేల వద్ద వరద నీరు రోడ్లపైకి వస్తున్నది. అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు నీటి ప్రవాహానికి ఎదురెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు.
-ఏటూరు నాగారం, మంగపేట మండలాలతోపాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రాంతాలను గుర్తించాలి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. -గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటుచేయాలి. ఈ శిబిరాల్లో అందరికీ కావాల్సిన వసతి, భోజనం ఏర్పాటుచేయాలి. కొవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలి. -మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడే ఉండి తమ ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించాలి. -వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలి. -పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల అధికారులు ప్రతిరోజు ప్రతి పట్టణం, ప్రతి గ్రామం నుంచి తాజా పరిస్థితిపై నివేదిక తెప్పించుకోవాలి. ఆ నివేదిక కలెక్టర్ల ద్వారా కార్యదర్శికి, అక్కడి నుంచి ప్రధాన కార్యదర్శికి చేరాలి. దానికి అనుగుణంగా ఎక్కడ ఏది అవసరమో ఆ చర్య తీసుకోవాలి. సహాయ చర్యల్లో అశ్రద్ధ, జాప్యం జరుగవద్దు. -ప్రస్తుతం అవసరమైన చర్యలు తీసుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన శాశ్వత వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఏ స్థాయిలో వర్షం వస్తే, ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉన్నది? లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? -ఎక్కడ కాజ్వేల మీదుగా నీరు ప్రవహించవచ్చు? రోడ్లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? తదితర అంశాలపై అధ్యయనం చేసి వ్యూహం ఖరారుచేయాలి. పట్టణాల్లో మున్సిపల్శాఖ, పోలీసులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేయాలి. విపత్తు జరిగిన వెంటనే రంగంలోకి దూకేలా వారిని సిద్ధంచేయాలి. -అన్ని నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్షీట్ తయారుచేయాలి. నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువైతే జరిగే పరిణామాలను అంచనా వేయాలి. గతంలో నదులు పొంగి ప్రవహించినప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తిందో ట్రాక్ రికార్డు ఉండాలి. దాని ఆధారంగా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలి. -ఉమ్మడి ఏపీలో వరదలు సంభవిస్తే ఏం చేయాలనే విషయంలో ఆంధ్రప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వ్యవహరించారు. తెలంగాణను నాడు పట్టించుకోలేదు. ఇప్పుడైనా తెలంగాణ దృక్పథంలో విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఇది శాశ్వత ప్రాతిపదికన జరుగాలి. ‘ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ’ తయారుకావాలి. -వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులు, ఇతరత్రా వ్యాధులపై వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలి. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు సిద్ధంగా ఉంచాలి. ప్రతి వానకాలంలో వైద్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సరైన వ్యూహం రూపొందించి, అమలు చేయాలి. -రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు 24 గంటలపాటు నడవాలి. ఎక్కడి నుంచి ఏ ఫోన్కాల్ వచ్చినా స్వీకరించి, తక్షణం సహాయం అందించాలి.