-ఆదాయ నామ సంవత్సరం -అన్ని శాఖల్లో జీతాలు అధికం -ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు -9,36,976 మందికి ప్రయోజనం -త్వరలో ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక -దానిపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీ -అందులో సీఎస్, రామకృష్ణారావు, రజత్ -జాప్యంలేకుండా కారుణ్య నియామకాలు -అన్ని శాఖల్లో పదోన్నతులు, బదిలీలు -మార్చిలోగా సమస్యల నుంచి విముక్తి -రిటైరయ్యే రోజే అన్ని ప్రయోజనాలు -ఆఫీసులో సన్మానం.. గౌరవ వీడ్కోలు -సీఎం ఆదేశం.. వెంటనే సర్క్యులర్ జారీ

కరోనా కష్టకాలం.. ఆర్థిక మాంద్యం.. సాగని కొలువులతో 2020లో నానావిధాల సతమతమైన వేతన జీవులను కొత్త ఏడాదిలోకి కొత్త సంబురంతో తీసుకువెళ్లాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండురోజుల ముందే నూతన సంవత్సర కానుకలను ప్రకటించి రాష్ట్రంలోని అన్ని శాఖల, అన్ని రకాల ఉద్యోగులకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. త్వరలో జీతాలను పెంచడమే కాదు.. రిటైర్మెంట్ వయసును కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కష్టకాలంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భరోసానిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వేగంగా భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. అతి త్వరలో వేతన సవరణ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది.
ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. అన్ని శాఖల్లో.. అన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్, డైలీ వేజ్, ఫుల్టైమ్ కంటింజెంట్, పార్ట్టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశావర్కర్లు, విద్యావాలంటీర్లు, సెర్ప్
ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకొంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులు 9,36,976 మంది ఉంటారని, వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని చెప్పారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఉద్యోగులకు కచ్చితంగా వేతనాలు పెంచుతాం ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఏపీలో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకొన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనావేశాం. ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టేతెలంగాణ వచ్చింది. ధనిక రాష్ట్రంగా మారింది. రైతులకోసం, పేదలకోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమానికీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మళ్లీ వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరమున్నది.
ప్రభుత్వానికున్న ఆర్థిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీనిచ్చింది.దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. పదవీ విరమణ వయస్సు ఎంతమేర పెంచాలో అధికారుల కమిటీ ఉద్యోగ నాయకులతో చర్చిస్తుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని సీఎం తెలిపారు.
డీపీసీల ద్వారా పదోన్నతులు ‘ఆంధ్రప్రదేశ్తో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు సాధ్యంకాలేదు. ఇప్పుడు ఆ గొడవలన్నీ పరిష్కారమయ్యాయి. కాబట్టి వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులి వ్వాలి. అన్నిశాఖల్లో వెంటనే డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ)లు నియమించాలి. పదోన్నతులివ్వగా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీచేయాలి. అన్ని శాఖల్లో పదోన్నతుల తర్వాత ఎన్ని ఖాళీలుంటాయనే విషయంలో స్పష్టత వస్తుంది. శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి’ అని సీఎం ఆదేశించారు.
సరళంగా సర్వీస్రూల్స్ ‘ప్రతి ఉద్యోగి.. ఉద్యోగంలో చేరిననాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసురూల్స్ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరి వద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావాల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా పారదర్శకంగా ఉండేవిధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల అధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని కచ్చితంగా పట్టించుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
రిటైరైనవారికి గౌరవంగా వీడ్కోలు ‘ఉద్యోగులు దాదాపు 35 ఏండ్లపాటు ప్రభుత్వం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారు. వారికి చాలా గౌరవంగా వీడ్కోలు పలుకాల్సిన అవసరం ఉంది. నాలుగో తరగతి ఉద్యోగి నుంచి శాఖాధిపతి వరకు ఎవరైనా పదవీ విరమణ పొందితే వారికి ఆ కార్యాలయంలోనే ఘనంగా సన్మానం చేయాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలుకాలి. రిటైరైన రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందించాలి. వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణలో ఉండొద్దు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖల్లో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సర్క్యులర్ జారీ చేశారు.
కారుణ్య నియామకాల్లో జాప్యం వద్దు ‘ప్రభుత్వ ఉద్యోగంచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం అత్యంత విషాదకరం. దుఃఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం పడొద్దు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మార్చి కల్లా సమస్యల నుంచి శాశ్వత విముక్తి ‘సమైక్య ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం చిక్కుముడిగానే ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టుకేసులే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు, సంప్రదింపులు చేసి, న్యాయవివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా విధులు నిర్వర్తించే సౌలభ్యం కల్పించడానికి మార్గం సుగమమైంది. ఇక ఆలస్యం చేయకుండా ఉద్యోగుల అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తికావాలి. మార్చి నుంచి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలి’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాలు వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలుచేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలుకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరి లోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి, ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకొంటుంది.
తెలంగాణ సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టే తెలంగాణ వచ్చింది. ధనిక రాష్ట్రంగా మారింది. రైతులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఉద్యోగుల సంక్షేమానికీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42% ఫిట్మెంట్ ఇచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని రకాల సిబ్బందికీ వేతనాలు పెంచింది.ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల మేర అన్నిరకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని నిర్ణయించాం.
-ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలుస్తారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రాష్ట్రంలోని ఉద్యోగులకు వేతనాలను, పదవీ విరమణ వయసును పెంచాలని నిర్ణయించడం ఆనందంగా ఉన్నది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్న ఏకైక సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
-మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు