లోక్సభ బీఏసీ భేటీలో టీఆర్ఎస్ పక్ష నేత నామా రైతు వ్యతిరేక విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తాం

దేశ సమస్యలతోపాటు తెలంగాణ రాష్ట్ర సమస్యలను కూడా పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని లోక్సభ టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులే కాకుండా దేశంలో ప్రస్తుత సమస్యలు కూడా పరిగణనలోకి తీసుకొని వాటన్నింటిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆదివారం పార్లమెంట్లో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన లోక్సభ బీఏసీ సమావేశంలో నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. జీఎస్టీ పెండింగ్ నిధులు, కరోనా, వలస కార్మికుల సమస్యలు, నిరుద్యోగం, సరిహద్దు వివాదాలు, ఆర్థికప్రగతిపై కూడా చర్చించాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన రూ.9 వేల కోట్లు జీఎస్టీ, ఐజీఎస్టీకి సంబంధించిన వాటిపై చర్చించాలన్నారు.
అనంతరం మీడి యాతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పార్లమెంట్ లోపల, బయట కేంద్రంపై పోరాటంచేస్తామని చెప్పారు. ఈ సమావేశాలలో కొన్ని కొత్త బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర చూస్తున్నదని, ఇందులో రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న విద్యుత్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. జాతీయ రహదారుల విషయంలో కేంద్ర వాగ్దానాలు నెరవేరలేదని, రైల్వే సమస్యలపై లేవనెత్తున్నామన్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని డిమాండ్చేశారు. టీఆర్ఎస్ ఎంపీలందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు.