-కరోనా కట్టడిపై దుష్ప్రచారం -గాంధీలో రోగులు 247 మందే.. ఆ దవాఖాన కిక్కిరిసిపోలేదు -ప్రజలను గందరగోళపరుస్తున్న కొందరు వ్యక్తులు, మీడియా -ఎందరికైనా చికిత్సచేసే సామర్థ్యం ఉంది -మృతదేహాలకు పరీక్షలు సాధ్యం కాదు -తరచూ వ్యాజ్యాలతో సమయం వృథా -వైద్యాధికారులు, నిపుణుల ఆవేదన -ముఖ్యమంత్రి దృష్టికి పలు అంశాలు -వైరస్ సోకిన వైద్య సిబ్బంది ఎక్కడ? ఎందరు? -ఢిల్లీ ఎయిమ్స్లో 480 -దేశవ్యాప్తంగా 10 వేలు -తెలంగాణలో 153

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికోసం వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం చేస్తున్న కృషిపై కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా ప్రచారంచేస్తున్నాయని వైద్యశాఖ అధికారులు, నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా వైద్యంచేసే సామర్థ్యం ప్రభుత్వ దవాఖానలకు ఉన్నదని తెలిపారు.
ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు దుష్ప్రచారంచేసి ప్రజలను గందరగోళపరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉన్నదని కూడా అనుమానం వ్యక్తంచేశారు. రెండువేల మందికి పైగా చికిత్సను అందించగలిగే సామర్థ్యం కలిగిన గాంధీ దవాఖానలో 247 మంది మాత్రమే వైరస్ సోకినవారున్నారని చెప్పారు. వాస్తవం ఇదైతే కొందరు పనిగట్టుకొని గాంధీ దవాఖాన రోగులతో కిక్కిరిసిపోయిందని ప్రచారంచేస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు నిరంతరం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తుండటంతో రోజూ కోర్టుకు తిరుగాల్సి వస్తున్నదని, దీనివల్ల వైద్యసేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఏ కారణంతో మరణించినా సరే వారందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్చేయాలని ముఖ్యమంత్రిని వైద్యశాఖాధికారులు అభ్యర్థించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్కుమార్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ యోగితారాణా, డీఎంఈ రమేశ్రెడ్డి, డీఎంహెచ్ శ్రీనివాస్, కొవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్, హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.
వాస్తవానికి.. ప్రచారానికి పొంతన లేదు -కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదని వైద్యాధికారులు, నిపుణులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. వారు సీఎం దృష్టికి తెచ్చిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. -గాంధీ దవాఖాన రోగులతో కిక్కిరిసిపోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. పేపర్లు, టీవీల్లో కూడా అలాగే చెప్తున్నారు. గాంధీలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉన్నది. వెయ్యి ఆక్సిజన్ సౌకర్యమున్న బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం 247 మంది రోగులు మాత్రమే ఉన్నారు. గాంధీలో ఉన్న సౌకర్యాలనే పూర్తిగా వాడుకొనే అవసరం ఇంతవరకు రాలేదు. చాలామంది డిశ్చార్జి అయి ఇంటికెళ్లారు. ఎలాంటి లక్షణాలు లేనివారికి హోం ట్రీట్మెంట్ అందిస్తున్నాం. -రోగులు ఎక్కువైతే చికిత్స అందించే ఏర్పా ట్లు లేవని కూడా దుష్ప్రచారంచేస్తున్నారు. నిజానికి దేశంలోని ఇతర రాష్ర్టాలకన్నా తెలంగాణలోనే వైద్యారోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉన్నది. 9.61 లక్షల పీపీఈ కిట్లను సిద్ధంగా ఉంచాం. 14 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయి. ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్లు మొత్తం 3600 సిద్ధంగా ఉంచాం. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇతరత్రా పరికరాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎంతమందికైనా చికిత్స అందిస్తాం. -గాంధీ దవాఖానలో చికిత్స పొంది, కోలుకొని ఇండ్లకు పోయినవారు ఎంతో సంతోషంగా ఉన్నారు. దవాఖానలో సకల సౌకర్యాలతో మంచి వైద్యమందించారని బహిరంగంగా చెప్తున్నారు. వైరస్ సోకినవారు తృప్తిగా ఉంటే, కొందరు విమర్శించడం బాధాకరం. -వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నదనే ప్రచారంచేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు అందించే వారికి కూడా వైరస్ సోకుతున్నది. ఇది చాలా సహజం. ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మందికి కరోనా వైరస్ సోకింది. ఐసీఎంఆర్ అంచనా ప్రకారమే భారతదేశంలో 10 వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది. అమెరికాలో 68 వేల మంది వైద్య సిబ్బందికి సోకింది. బ్రిటన్లో వైరస్ సోకినవారిలో 15 శాతం మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఇదే తరహాలో తెలంగాణలో ఇప్పటిదాకా 153 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. వారిలో ఎవరూ సీరియస్గా లేరు. వారు మా తోటి వైద్య సిబ్బంది. వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాం. అంతా కోలుకుంటున్నారు. తెలంగాణలో మాత్రమే వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నట్టు ప్రచారంచేయడం బాధాకరం. -కరోనా మరణాలుగా చెప్తున్నవన్నీ కేవలం కరోనా వల్ల సంభవించిన మరణాలు కాదు. 95 శాతం ఇతర కారణాలతో చనిపోయిన వారే. కిడ్నీ, గుండె, లివర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు, షుగర్, బీపీ ఉన్నవారు చనిపోతున్నారు. ఇతరజబ్బులతో చనిపోయినప్పటికీ, వారికి కరోనా పాజిటివ్ ఉన్నది కాబట్టి, కరోనాతోనే చనిపోయినట్టు నిర్థారిస్తున్నారు. ఇది అశాస్త్రీయమైన అవగాహన. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నది. -కరోనా విషయంలో తరచూ ఎవరో ఒకరు కోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యాలు వేస్తున్నారు. దీనివల్ల ప్రతిరోజు సీనియర్ వైద్యాధికారులు కోర్టుకు వెళ్లాల్సి వస్తున్నది. రోజంతా ఆ పనితోనే సరిపోతున్నది. దీనివల్ల కరోనా కేసులతోపాటు, ఇతర కేసులను పర్యవేక్షించడం కష్టంగా మారుతున్నది. ఈ పిల్స్ అన్నీ నిజానికి ఉద్దేశపూర్వకంగా వేస్తున్నవనే తెలుస్తున్నది. దీనివల్ల వైద్యాధికారుల విలువైన సమయం వృథా అవుతున్నది. -ఏ కారణంతో చనిపోయినా సరే, మరణించిన ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలు అమలుకు సాధ్యం కానివి. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతిరోజు సగటున 900- 1000 మంది వరకు మరణిస్తుంటారు. ఏదో మూల ఏదో కారణంతో ఎవరో చనిపోతుంటారు. వారందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? వారికి పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, దవాఖానల్లో ఇతర వైద్య సేవలు అందించడం సాధ్యంకాదు. రకరకాల జబ్బులతో వచ్చేవారు, డెలివరీల కోసం వచ్చేవారు ఉంటారు. ఇప్పుడు కరోనాతో వస్తున్నవారు ఉంటున్నారు. వారందరినీ వదిలేసి, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాదు. డబ్ల్యూహెచ్వో, కేంద్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్.. మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు. హైకోర్టు ఆదేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఆచరణ యోగ్యంకాదు. ఈ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాలి.
కొత్తగా 92 మందికి కరోనా రాష్ట్రంలో సోమవారం కొత్తగా 92 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ వైరస్ కారణంగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం 3,742 మందికి వైరస్ సోకగా, 142 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆందోళన వద్దు: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని.. అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. కరోనా సోకినప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని.. ఇతరత్రా జబ్బులున్న కొద్దిమంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే.. తగిన వైద్యమందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సీరియస్గా ఉన్నవారికి దవాఖానల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్ సోకినప్పటికీ.. లక్షణాలు లేనివారికి ఇండ్లల్లోనే ఉంచి వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతోసమయం వృథా కరోనా విషయంలో తరచూ ఎవరో ఒకరు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తున్నారు. దీనివల్ల ప్రతిరోజు సీనియర్ వైద్యాధికారులు కోర్టుకు వెళ్లాల్సి వస్తున్నది. రోజంతా ఆ పనితోనే సరిపోతున్నది. దీనివల్ల కరోనా కేసులతోపాటు, ఇతర కేసులను పర్యవేక్షించడం కష్టంగా మారుతున్నది. ఈ పిల్స్ అన్నీ నిజానికి ఉద్దేశపూర్వకంగా వేస్తున్నవనే తెలుస్తున్నది. దీనివల్ల వైద్యాధికారుల విలువైన సమయం వృథా అవుతున్నది. – వైద్యారోగ్యశాఖ అధికారులు, నిపుణులు
-గాంధీలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉన్నది. వెయ్యి ఆక్సిజన్ సౌకర్యమున్న బెడ్లు ఉన్నాయి. గాంధీలో ఉన్న సౌకర్యాలనే పూర్తిగా వాడుకొనే అవసరం ఇంతవరకు రాలేదు. -ఇతర రాష్ర్టాలకన్నా తెలంగాణలోనే వైద్యారోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉన్నది. 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయి. ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 3600 బెడ్స్ సిద్ధంగా ఉంచాం. -మరణాలన్నీ కరోనా వల్ల సంభవించినవి కాదు. 95% కిడ్నీ, గుండె, లివర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు, షుగర్, బీపీ ఉన్నవారు చనిపోతున్నారు. ఇతర జబ్బులతో చనిపోయినా వారికి కరోనా ఉన్నది కాబట్టి, కరోనాతోనే చనిపోయినట్టు నిర్థారిస్తున్నారు. ఇది అశాస్త్రీయమైన అవగాహన.