కరీంనగర్ జిల్లాలో తోటపల్లి ప్రాజెక్ట్ రద్దు విషయమై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు మండిపడ్డారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రస్తుతం మాట మార్చాయని గురువారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో చెప్పారు. 2008 ఫిబ్రవరి 18న తోటపల్లి ప్రాజెక్ట్ రద్దు చేయాలని కోరుతూ సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి రాసిన లేఖను చూపారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రద్దుచేసి రీ ఇంజినీరింగ్ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
-తోటపల్లి పై మాట మార్చడం సరికాదు -ఆ ప్రాజెక్టు వల్ల లాభాలకంటే నష్టమే ఎక్కువ -తీరు మారకుంటే కాంగ్రెస్కు విపక్ష హోదా కూడారాదు -ఏపీ సీఎంతో కిషన్రెడ్డి కుమ్మక్కు -మంత్రి హరీశ్రావు ధ్వజం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలన్న విపక్షాలు ప్రస్తుతం గుడ్డిగా విమర్శలు చేస్తున్నాయని హరీశ్రావు తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు రద్దుతో ఆరు గ్రామాలను ముంపు బారి నుంచి కాపాడటం వల్ల భూసేకరణ జరగడం లేదని, ప్రభుత్వానికి రూ.1200 కోట్ల ఆదాయం మిగులుతుందన్నారు. గతంలో తోటపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం చూపాలని ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య.. ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్ నేతలకు ముంచుడే తప్ప తేల్చడం తెలియదని ఎద్దేవా చేశారు. విపక్షాల విమర్శలతో తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రైతులే తోటపల్లి ప్రాజెక్టు వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువని చెప్పారని మంత్రి గుర్తు చేశారు. మిడ్ మానేరు రిజర్వాయర్ కాలువ ద్వారా నీటి నిర్వహణకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఏడేండ్ల పాటు అధికారంలో ఉన్న నేతలు.. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏడు తట్టల మైట్టెనా తవ్వించారా? అని ఆయన నిలదీశారు. తోటపల్లి ప్రాజెక్ట్ సామర్థ్యం 1.418 టీఎంసీలైతే.. వినియోగ సామర్థ్యం 0.9 టీఎంసీలు మాత్రమేనన్నారు. ఇందుకోసం రూ.1200 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంతోపాటు ఆరు గ్రామాలు నీట మునిగిపోతాయని గుర్తుచేశారు. గౌరవల్లి రిజర్వాయర్ను తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామన్నారు.
టీడీపీతో చేతులు కలిపిన కిషన్రెడ్డి బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి టీడీపీతో చేతులు కలిపారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణలో పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మించవద్దన్న ఏపీ సీఎం చంద్రబాబుకు కిషన్రెడ్డి మద్దతునిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులను చంద్రబాబుకు చూపాలని కిషన్రెడ్డికి సూచించారు.
గోదావరిపై లైడార్ సర్వే నిర్వహిస్తున్నాం గోదావరి నది పరివాహక ప్రదేశంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోనే తొలిసారి లైడార్ సర్వే నిర్వహిస్తున్నామని హరీశ్రావు తెలిపారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకారంతో చిత్తశుద్దితో ముందుకెళ్తామన్నారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్నవారు ప్రాజెక్టుల నిర్మాణం కోసం లైడార్ సర్వే నిర్వహించారా? అని ప్రశ్నించారు. ప్రాణహిత – చేవెళ్ల పథకానికి ఒక్క అనుమతైనా తెచ్చారా? అని నిలదీశారు. గతంలో జలదోపిడీని పట్టించుకోని వారు ఇప్పుడు అర్థంపర్థం లేని విమర్శలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా కూడా కోల్పేయే అవకాశముందన్నారు. గుడ్డి వ్యతిరేకత మానుకోవాలని విపక్షాలను కోరారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీత, యాదయ్య, ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేత్రదానానికి మంత్రి హరీశ్రావు అంగీకారం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్రావు నేత్రదానానికి ముందుకువచ్చారు. తన మరణానంతరం నేత్రదానానికి అంగీకరిస్తూ సంబంధిత పత్రాలపై గురువారం ఆయన సంతకం చేశారు. ఆయా పత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్గౌడ్కు అందజేశారు. భావితరాలకు కంటి చూపును ప్రసాదించాలంటే దేశంలోని ప్రతిఒక్కరు నేత్రదానం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో సుమారుగా 12 లక్షల మంది అంధులున్నారని, వారికి చూపు ప్రసాదించాలంటే నేత్రదానం ఒక్కటే మార్గమని, ఇందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు.