-నిధుల కొరత లేదు -ఎన్నికల తర్వాత సచివాలయ శంకుస్థాపన -హుస్సేన్సాగర్ పనులు ఆస్ట్రియా బృందానికి.. -స్పష్టత ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ -అమరావతికి నిధులులేవు..హైదరాబాద్కు తెస్తారా?
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే అజెండా.. అందులో ఏమాత్రం రాజీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలు తాము చేయబోమని, నగరాభివృద్ధి ప్రణాళికల అమలుకు ఐదారేండ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని చెప్పారు. హుస్సేన్సాగర్, మూసీ ప్రక్షాళనకు ఆస్ట్రియా బృందానికి పనులు అప్పగించామని తెలిపారు. నగరంలో నాలుగైదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఇప్పటికే ఖాయమైందని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరాణాత్మక సమాధానాలు ఇచ్చారు.
తమ ప్రణాళికలకు నిధులు ఎక్కడినుంచి సేకరిస్తున్నదీ మొదలుకొని జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోబుతున్నదీ గణాంకాలతో సహా వివరించారు. పొలిటికల్ టెర్రరిజం ఎవరిదని ప్రశ్నించిన కేసీఆర్.. ఇతర రాజకీయ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. దానిని తెలంగాణ శక్తుల పునరేకీకరణ గా భావిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థి అంటూ పలానా పార్టీ అని చెప్పే పరిస్థితి లేదు. మీరే (మీడియా) చెప్పాలన్నారు. ఆ వివరాలు…
చంద్రబాబుకు ఇక్కడేం పని? అసలు చంద్రబాబు ఇక్కడికి రావటమే అసంబద్ధం. ఆయనకు ఇక్కడేం పని? ఊడ్చుకోవడానికి ఆయనకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉంది. తిరుపతి, గుంటూరు, వైజాగ్ ఇలా అనేక పట్టణాలున్నయి. అవన్నీ డెవలప్ అయిపోయినయి.. ఇగ చేసేదేంలేదని ఇక్కడికి వస్తున్నడా? అవన్నీ వదిలేసి హైదరాబాద్ రోడ్లు ఊడుస్తమంటే ఎవరు నమ్ముతరు? 17 సంవత్సరాల సుదీర్ఘ టీడీపీ పాలనలో ఆయన మామ, ఆయనే ఉన్నారు. హైదరాబాద్కు చేసిందేం లేదు. ఎవరూ నమ్మే పరిస్థితిల లేరు. ఫలితం కూడా అదే విధంగా ఉండబోతుంది.
మూడు విధాలా.. మాకే అవకాశం.. జీహెచ్ఎంసీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం. దానిని ఎవరూ అపలేరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవిస్తుంది. ప్రతిపక్షాల సర్వేల్లోనూ ఇదే తేలింది. ఎక్స్ అఫిషియో మెంబర్లు మాకే ఎక్కువ ఉంటరు. ఇక మజ్లిస్ మాకు మిత్రపక్షమే. ఎట్ల లెక్కచూసినా మాదే మేయర్ పీఠం. మొన్న నమస్తే తెలంగాణ వాళ్ళుకూడా రాశారు. లెక్క ఉంది.. తేలాల్సింది సీట్ల లెక్కనే. మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడరే అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉంటామని ప్రకటించారు. వాళ్ళది ఏతత్వమైనా రాజకీయంగా మాకు మిత్రపక్షమే. వారి బ్లడ్ గ్రూప్ ఏంది.. బీజేపీ బ్లడ్ గ్రూప్ ఏంది అనేది మాకు సంబంధం లేదు. బీఫ్ మీద కూడా మాట్లాడటం రాజకీయ దౌర్బల్యం. ఎవరు ఏం తింటేంది? ప్రపంచవ్యాప్తంగా బీఫ్ తింటరు. చైనాలో పాములు, కప్పలను కూడా తింటరు. పాతబస్తీలో టీఆర్ఎస్ను బ్రహ్మాండంగా హర్షిస్తున్నారు. సర్వేల్లోనూ అక్కడ మజ్లిస్, టీఆర్ఎస్ రెండు పార్టీలకే ఓట్లు పడతయని అంటున్నరు. ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించడం సాధ్యం కాదు. మేయర్ అభ్యర్థిని గెలిచిన తరువాత అందరూ కూర్చుని నిర్ణయిస్తారు.
కేంద్ర, రాష్ట్ర నిధులతో డబుల్ బెడ్రూం.. డబుల్బెడ్ ఇండ్లకు నిధులెక్కడివి అంటున్నారు. అనేక పథకాలనుంచి సమీకరిస్తున్నం. కేంద్ర పథకాల్లో అర్బన్ హౌజింగ్ స్కీములున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర పథకాల నిధులు కలిపి నిర్మించి ఇస్తం. కేసీఆర్ నిబద్ధతతో ఉన్నాడు. హడ్కో నుంచి , రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతాం. హైదరాబాద్లో భూములు అమ్మితే వచ్చేవికూడా ఇండ్లకు పెడతాం. ప్రభుత్వం తరపున నగరంలో వెయ్యి ఎకరాలు సేకరించినం. ఎక్కువ భాగం స్థలాలకే ఖర్చు ఉంటుంది. ఈ స్థలాల్లో వచ్చే యేడాదికల్లా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించబోతున్నాం. రాష్ట్ర ఆదాయంలో ఈ సంవత్సరం 15 శాతం పెరుగుదల ఉంది. కేవలం ప్లాన్డ్ ఎక్స్పెండిచరే రూ. 60 వేల కోట్ల పైచిలుకు ఉంది. చైనాలోకూడా 15 శాతం లేదు. ఏడాదికి రూ. 6 లక్షల ఆదాయం ఉన్న మధ్య తరగతి వర్గాలకు కూడా క్రెడిట్ లింకేజీ స్కీం కింద డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తాం.
ఎన్నికల తరువాత సచివాలయ శంకుస్థాపన.. కొత్త సెక్రటేరియట్కు జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత నేనే శంకుస్థాపన చేయబోతున్నా. ఉస్మానియా ఆసుపత్రి టవర్స్కూడా రూపకల్పన పూర్తయింది. ఉన్న భవనం వెనుక కొత్త భవనాలను నిర్మిస్తాం. చెస్ట్ ఆసుపత్రి ఆటోమేటిక్గా తరలిపోతుంది. హుస్సేన్ సాగర్ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. సమైక్య రాష్ట్రంలో కుళ్ళిపోయి సర్వనాశనం అయ్యింది. కెమికల్స్ దాంట్లో కలువకుండా మళ్ళించే పనులుచేపట్టాం. దానిని వివాదం చేశారు. ఆస్ట్రియా బృందం వద్ద కొత్త టెక్నాలజీ ఉంది. మూసీ, హుస్సేన్సాగర్ పనులను వాళ్ళకు అప్పగించాం. కేసీఆర్గా హామీ ఇస్తున్నా.. వాటిని ప్రక్షాళన చేసి ఆచరణలో చూపెడతాం. రేస్కోర్స్ను తరలిస్తాం. చర్లపల్లి జైలు వద్ద 90 ఎకరాల ఓపెన్ స్పేస్ ఉంది. చంచల్గూడ జైలును తరలిస్తే పాతబస్తీలో 170 ఎకరాల జాగా ఉంటది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరికీ సంబంధించి విద్యాలయాలను ఏర్పాటు చేస్తాం. బస్బేలు, మార్కెట్ల వంటి మౌలిక వసతుల కోసం కొంత స్థలాన్ని వినియోగిస్తాం.
ఇండ్ల దరఖాస్తులపై ప్రకటన చేస్తాం.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నిబద్ధతతో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు ఉండొద్దని అనుకున్నాం. ఎమ్మెల్యే కేవలం తన నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించే గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక అంతా అధికారులదే. చిన్న తప్పు జరిగినా ఉద్యోగం ఊడదీస్తామని హెచ్చరించాం. హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తులను వంద శాతం రెవెన్యూ అధికారులతో కలెక్ట్ చేయిస్తాం. కట్ఆఫ్ డేట్, అన్ని వివరాలు ప్రకటిస్తాం.
దురదృష్టకరం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన దురదృష్టకరం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్నాం. మేము మౌనంగా ఏమీ లేము. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నాం.
దేనికైనా ఒక హద్దు ఉంటుంది.. కేంద్ర ప్రభుత్వం దేశంలో 20 నగరాలను స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తే తెలంగాణకు ఒక్కటీ లేదు. ఏపీలో కాకినాడ, వైజాగ్లు ఉన్నాయి. మరి తెలంగాణ కాకి ఎత్తుకుపోయిందా? కేంద్రం తీరు హర్ట్ చేసే విధంగా ఉంది. అప్పట్లో పెట్టుబడిదారులకు అనుకూల ప్రదేశాల్లో తెలంగాణను ప్రకటించలేదు. టీఎస్ఐపాస్ కింద ఏర్పాటుచేసిన ఇంక్యుబేటర్ సెంటర్ను సత్యనాదెళ్ళ, రతన్టాటా, సుందర్పిచాయ్లు అభినందించారు. కేంద్రం మాత్రం అభినందించలేదు. ఏదో చిల్లర ప్రచారం కోసం టీఆర్ఎస్, కేసీఆర్పై అప్పర్ హ్యాండ్ సాధిస్తామంటే అది సాధ్యం కాదు. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారు. తెలంగాణ కరువు నివేదిక ఇయ్యలేదని బీజేపీ వాళ్ళు చెప్పిస్తారు. ప్రభుత్వానికేమో అక్టోబర్ 30 వరకు ఇవ్వాలని అధికారికంగా లేఖ రాస్తారు. కేంద్రం, రాష్ట్రం మధ్య రాజ్యాంగ సంబంధం ఉండాలి. వెంకయ్యనాయుడు ప్యాకేజీ, లీకేజీ అంటే.. ప్యాకేజీ ఎక్కడిది.. లీకేజీ ఎక్కడిది. ఆయన ప్రాస అందరికీ తెలిసిందే. నాక్కూడా అద్భుతమైన తెలుగు వస్తది.
మరో ఎయిర్పోర్టు… హైదరాబాద్కు ఉత్తర భాగంలోగానీ, తూర్పు బాగంలో కానీ ఇంకో ఎయిర్పోర్టు రావాలి. ప్రభుత్వం వద్ద 700ఎకరాల భూమి ఉంది. కేంద్రంతో మాట్లాడుతున్నాం. సివిల్ ఎయిర్పోర్టు కింద ఇది పనిచేస్తుంది. ఔటర్ రింగు రోడ్డుపై క్రాసింగ్స్, రేడియల్ రోడ్లు సంపూర్ణం కాలే. హెచ్ఎండీఏ మాస్ట్ర్ప్లాన్లో అవన్నీ కూడా ఉంటాయి. లీడ్ సంస్థతో ఓఆర్ఆర్ను ఇంటిగ్రేడ్ చేస్తూ క్రాస్ఓవర్ లేకుండా చేస్తున్నాం. జర్నలిస్టులకు డబుల్బెడ్రూం కంటే మంచి సదుపాయం కల్పిస్తాం. 580 చదరపు అడుగులు కాకుండా 800 చదరపు అడుగుల్లో నిర్మించి ఇస్తాం. కమిటీ వేసి అందరికీ డబుల్బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తాం. నేను ఫౌండేషన్ స్టోన్ వేస్తా. సంవత్సరం లోపు ప్రారంభించుకుందాం.
కరెంటు వాడకం పెరిగింది.. వ్యవసాయానికి వాడకపోవడం వల్లనే నగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చారనేది అవాస్తవం. గతంలోకంటే 5 నుంచి 10 వేల మిలియన్ యూనిట్ల వాడకం పెరిగింది. ఆ వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి. పాఠశాల ఫీజులపై ఒక నియంత్రణ చేపట్టాల్సి ఉంది. రానున్న క్యాబినెట్లో ఈ అంశంపై విధాన నిర్ణయం తీసుకోనున్నాం. రూ. 500కోట్ల నుంచి రూ. 1000 కోట్లలోపు వచ్చే అసెంబ్లీలో బీసీ సబ్ప్లాన్ను ప్రవేశపెడ్తాం. బీసీ క్రీమీలేయర్ అనేది సుప్రీంకోర్టు ఆదేశం. కేంద్రం, రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. చేయమని చెప్పే ఆస్కారమే లేదు.
అసాంఘికశక్తులపై ఉక్కుపాదం.. తెలంగాణ ప్రభుత్వం ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదంతో వ్యవహరిస్తుంది. అసాంఘిక శక్తులను అణచివేస్తాం. సంఘ వ్యతిరేక శక్తుల ఆటలు సాగనివ్వం శాంతి భద్రతలు సామరస్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. ఇదే టాప్ ప్రయారిటీ. ఎక్కడా రాజీపడం. ఉగ్రవాదాన్ని ఉపేక్షంచే పరిస్థితే లేదు. ప్రైవేటు మనీ లెండర్స్ అంశంపై కఠినమైన చట్టాలు తేవాల్సి ఉంది. ఇప్పటివరకు బ్లాక్మనీ, వైట్ మనీ చూసినం. కానీ ఇప్పుడు కొత్తగా ఈ కాల్మనీ వచ్చింది. ఆంధ్రలో కాల్మనీ సృష్టికర్తలే ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి ఓట్లు అడుగుతున్నరు. అందుకే హైదరాబాద్ ఓటర్లు తస్మాత్ జాగ్రత్త.
నీటి కొరత లేకుండా చేశామనడం తప్పా? ఎల్లంపల్లి నుంచి గోదావరిజలాల్ని తరలించే పనులు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందనేది వాస్తవం. కానీ మా ప్రభుత్వం అన్ని ఆటంకాలు, అవరోధాల్ని తొలగించి, వేగంగా పూర్తి చేశామని చెబుతున్నం. లేకపోతే ఇంకా మూడేండ్లకు కూడా పూర్తి కాకపోయేది. రైల్వే సహాయనిరాకరణ వల్ల ఒక్కచోట రెండేండ్లనుంచి పెండింగ్లో ఉంది. నేను రైల్వే జీఎం శ్రీవాత్సవ ఉన్నపుడు ఆయనకు ఫోన్ చేసి… మీ రైల్వే వాళ్లు 200 బోర్లు వేసుకోండి.. మీకు బల్క్గా నీళ్లివ్వటం మావల్ల కాదు. మాకే నీళ్లు లేవు అని అంటే, అదేంది సార్… గుస్సా అవుతున్నరు అని ఒక్కరోజులో పర్మిషన్ ఇచ్చిండు. డిఫెన్స్ భూములకు సంబంధించి.. కంటోన్మెంట్కు కూడా అదే చెప్పినం. వెంటనే అనుమతులిచ్చినరు. నిరంతరం పర్యవేక్షణతో ఎఫెక్టివ్గా స్టెప్స్ తీసుకున్నం. వర్షాభావంతో సింగూరు ఎండిపోయినా నగరంలో నీటి కొరత రాకుండా చూసినమని ప్రజలకు చెప్పినం.
ఒకరు చేస్తే డమ్మీ అవుతరా.. ఒక మంత్రి ఇంకో మంత్రిని డమ్మీ చేయడం సాధ్యమేనా?. ఐనా ఒకరు చేస్తే డమ్మీ అవుతరా? రాష్ట్ర మంత్రి హోదాలో కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రభుత్వమంటేనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రతిపక్షాలకు ఏం విమర్శించాలో అర్థంకాని పరిస్థితి ఉంది.
ఆనాడు ఉద్యమ నేతను.. ఈనాడు ముఖ్యమంత్రిని.. దురాశతో కాంగ్రెస్ నాయకులు వీహెచ్, ఉత్తమ్కుమార్రెడ్డి ఆంధ్రా వాళ్ళను మీరు రాక్షసులన్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ మేము రాక్షసులు అన్నమాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాటి సమైక్య పాలకులకు మడుగులొత్తితే.. వాళ్లను కూడా దద్దమ్మలు, చవటలు, సన్నాసులు అనికూడా అన్నాం. ఉద్యమ నాయకుడిగా ఆరోజు అది నా కర్తవ్యం. అప్పుడు టీఆర్ఎస్ ఫక్తు ఉద్యమ పార్టీ. ఆ రీతిగానే ఉన్నం. తెలంగాణ సాధించుకున్నం. 2014 జూన్ 2 తరువాత టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మారింది.
హైదరాబాద్లో ఉన్న కన్నడిగులు, మళయాళీలు, గుజరాతీలు సహా అందరూ మావారే. హైదరాబాద్లో ఉన్నవాళ్లంతా గర్వంగా హైదరాబాదీయులుగా చెప్పుకోవాలని సభల్లోకూడా చెప్పాను. 18 నెలల్లో చీమన్నా చిటుక్కుమన్నదా? చంద్రబాబు హైదరాబాద్లో సెక్షన్ 8 ను అమలు చేయాలని అన్నారు. ప్రాంతాల మధ్య కక్షలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సింగిల్ కంప్లైంట్ కూడా లేదు. చిల్లర రాజకీయాల కోసం, వచ్చే నాలుగు ఓట్ల కోసం కక్కుర్తి పడి హైదరాబాద్ ప్రశాంతతకు భంగం కలిగించకండి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కాలనీల్లో టీఆర్ఎస్కు ఓటేస్తామని ముందుకు వస్తున్నరు.
5-6 ఏండ్లలో అంతర్జాతీయ సొబగులు.. నగరాభివృద్ధికి నిధులెక్కడివని కొందరు అడుగుతున్నరు. ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ రూ. 7500 కోట్లు ఇస్తానంది. హడ్కో రూ. 2 వేల కోట్ల రుణం ఇచ్చింది. మొత్తం రూ. 9500 కోట్లకు టైఅప్ జరిగిపోయింది. బ్రిక్స్ బ్యాంకుతో మాట్లాడాల్సి ఉంది. రూ. 20 నుంచి రూ. 25 వేల కోట్ల రుణానికి వారు ఎస్ అనగానే కార్యాచరణ మొదలవుతుంది. జీహెచ్ఎంసీ నిధులు, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ మొత్తం, భూములు అమ్మగా వచ్చిన మొత్తాన్ని కలిపి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. అయితే సమస్యలు ఓవర్ నైట్లో పరిష్కారం కావు. నేను మాయమాటలు చెప్పను. నగరంలో మురుగునీటి వ్యవస్థ, వాన నీటి కాలువలు బాగు చేయాలంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది. కబ్జాలు తొలగించాలి. కోర్టుల్లో కేసులు ఉంటయి. పరిపాలనాపరమైన సౌలభ్యం ఉండాలని రంగారెడ్డి జిల్లాను అలాగే ఉంచి ఇబ్రహీంపట్నం, మేడ్చెల్ వంటి ప్రాంతాలను కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్ను 4-5 జిల్లాలుగా చేస్తం.
అమరావతికి సహాయం ప్రకటించాలనుకున్నా.. చంద్రబాబు హైదరాబాద్కు కేంద్రం నిధులు తెస్తడా? ఆయన అమరావతికే దిక్కులేదు. పీఎం వచ్చి నీళ్లు, మట్టి ఇచ్చిపోయిండు. రెండు కుండలు తెస్తే ఇదేందిరా? అని పరేషాన్ అయిన. వెంకయ్యనాయుడుని అడిగిన ఏమన్న ఇస్తున్నరా అని. ఏంలేదని చెప్పిండు. వాస్తవానికి అమరావతి పోకముందు అక్కడ ఏదైనా సాయం ప్రకటించాలని అనుకున్నం. కాని ప్రధానమంత్రే మట్టి, నీళ్లు ఇచ్చినపుడు నేను ఏదైనా సాయం ప్రకటిస్తే బిడ్డా నాకంటే గొప్పోనివి అయిపోయినవా? అనుకుంటరని ప్రకటించలేదు. ఈ విషయాన్ని యనమలతో, చంద్రబాబుతో కూడా చెప్పిన.
మరికొన్ని ప్రధాన అంశాలు… -వరంగల్లో ముస్లిం సోదరులంతా మాకే ఓట్లేసినరు. లేకపోతే అంత పెద్ద మెజార్టీ వచ్చి ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావు. అందరూ ఆత్మ గౌరవంతో ఉండాలని సర్వమత సమానం అనే నినాదంతో ఆది నుంచి ముందుకుపోతున్నం. -ఏపీతో రాజ్యాంగపరమైన దోస్తానా ఉంటది. -రోడ్లపై చిరు వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నాం. క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నం. జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యయనం చేస్తున్నారు. -నగరంలో నిర్మించే ప్లై , స్కై ఓవర్లు పీపీపీ విధానంలో చేపట్టినా భారం ప్రజలపై ఉండదు. ప్రభుత్వమే భరిస్తుంది. -తెలంగాణ డాక్టర్లకు అన్యాయం జరగనివ్వం. కమలనాథన్ కమిటీ రిపోర్టుకు సంబంధించి వారు ఆందోళన చేస్తున్నారనే సమాచారం లేదు. వెంటనే సీఎస్కు తగిన ఆదేశాలు జారీ చేస్తా.